విధాత, హైదరాబాద్ : రైతాంగం అభివృద్ధికి..మెరుగైన విద్యా విధానం అమలుకు త్వరలోనే రైతు కమిషన్, ఎడ్యుకేషన్ కమిషన్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని సీఎం రేవంత్రెడ్డి వెల్లడించారు. త్వరలోనే ఆ రెండు కమిషన్లను ప్రకటించబోతున్నామన్నారు. పౌరసమాజం ప్రతినిధులతో శుక్రవారం సచివాలయంలో సీఎం రేవంత్రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మన విద్యా విధానం ఎలా ఉండాలో ఎడ్యుకేషన్ కమిషన్ నిర్ణయిస్తుందన్నారు. 25 ఎకరాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులలను ఒకే ఇంటిగ్రేటెడ్ క్యాంపస్లో ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. పైలట్ ప్రాజెక్టుగా కొడంగల్ లో ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు. కుల, మత వివక్షను పూర్తిగా తొలగించాలన్నదే వీటి ఉద్దేశమని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ధర్నా చౌక్ ను తెరిచామని, ప్రజా భవన్ ప్రజలకు అందుబాటులోకి తెచ్చామన్నారు.
ప్రజా పాలన పాలన ద్వారా సంక్షేమ పథకాల దరఖాస్తులు స్వీకరించామని గుర్తు చేశారు. పంటల బీమా పథకాన్ని పకడ్బందీగా అమలు చేయబోతున్నట్లుగా ప్రకటించారు. పంట మార్పిడి పథకాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించామన్నారు. గత ప్రభుత్వంలో ఉన్న చిక్కుముడులు తొలగించి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామన్నారు. యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎఎస్సీ ద్వారా నియామకాలు చేపడతామని స్పష్టం చేశారు. కౌలు రైతుల రక్షణ కు సంబంధించి అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని తెలిపారు.
అందరి సూచనలు , సలహాలు ఆధారంగా కౌలు రైతుల రక్షణకు చట్టం తీసుకురావాలని యోచిస్తున్నామన్నారు. రైతు భరోసా అనేది పెట్టుబడి సాయమని, ఎవరికి ఇవ్వాలనే దానిపై విస్తృత చర్చ జరగాలని కోరుతున్నామని తెలిపారు. నిస్సహాయులకు, నిజమైన లబ్దిదారులకు అవసరమైతే చెప్పినదానికంటే ఎక్కువ సహాయం చేయవచ్చన్నారు. ఆర్ధిక పరిస్థితి, విద్యుత్ పరిస్థితి, సాగునీటి రంగం పరిస్థితి పై పూర్తి వివరాలతో అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశామన్నారు. పారదర్శకత పాలనతో ముందుకెలుతున్నామన్నారు.