ఈ గడ్డ మీదికి కాషాయ జెండా రానివ్వం సీపీఐ, సీపీఎం సంయుక్త సమ్మేళనంలో నినదించిన కమ్యూనిస్టులు మోడీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తూ.. లౌకికవాదాన్ని ధ్వంసం చేస్తున్నదన్న ఏచూరి 2024లో బీజేపీని ఓడించి తీరుతామన్న డి. రాజా భావజాలపరంగానే కాదు, భౌతికశక్తిగా కూడా కమ్యూనిస్టులు ఎదగాలి- తమ్మినేని ఇక్కడ బీజేపీ అడుగుపెట్టకుండా చేయడమే తమ కర్తవ్యం-కూనంనేని తెలంగాణలో బీఆర్ఎస్తో కలిసి సాగుతామని, ఈ గడ్డపై బీజేపీని అడుగుపెట్టనివ్వబోమని కమ్యూనిస్టులు నినదించారు. ప్రజాసమస్యలపై విడివిడిగా పనిచేస్తున్న సీపీఐ(CPI), సీపీఎం(CPm) తెలంగాణ […]
తెలంగాణలో బీఆర్ఎస్తో కలిసి సాగుతామని, ఈ గడ్డపై బీజేపీని అడుగుపెట్టనివ్వబోమని కమ్యూనిస్టులు నినదించారు. ప్రజాసమస్యలపై విడివిడిగా పనిచేస్తున్న సీపీఐ(CPI), సీపీఎం(CPm) తెలంగాణ వేదికగా ఏకమౌతున్నట్లు ప్రకటించాయి. హైదరాబాద్ నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో రెండు పార్టీలు కలిసి సంయుక్త సమ్మేళనాన్ని నిర్వహించాయి.
ఈ కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యదర్శి డి. రాజా, సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి సహా ఇరు పార్టీల రాష్ట్ర కార్యదర్శులు, ముఖ్యనేతలు పాల్గొన్నారు. రెండు పార్టీలు కలిసి పనిచేయడానికి ముందుకు రావడం పట్ల సీతారాం ఏచూరి హర్షం వ్యక్తం చేశారు.
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం బీజేపీ యేతర రాష్ట్రాల ప్రభుత్వాలను ఇబ్బందులకు గురిచేస్తున్నదని ఏచూరి ఆరోపించారు. సీబీఐ, ఈడీ దుర్వినియోగం, లేకపోతే ఎన్నికల్లో ఓడిపోయినా సీబీఐ, ఈడీలను అడ్డంపెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వాలను మార్చే ప్రయత్నం చేస్తున్నది.
ఢిల్లీలో వాళ్ల వాదన ఏమిటి? ఎన్నికల్లో ఎవరైనా గెలవనివ్వండి ప్రభుత్వం మాత్రం బీజేపీదే వస్తుంది. అంత కచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు? ఈడీ, సీబీఐ లేదా డబ్బు, లేదా వాళ్ల మీద దాడులు చేసి పార్టీల్లో చీలక తీసుకుని వచ్చి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అంటే ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తూ… లౌకిక వాదాన్నిధ్వంసం చేయడానికి ఈ ప్రభుత్వం పూనుకున్నది.
ఒకేదేశం, ఒకే భాష, ఒకే పార్టీగా మార్చాలని ప్రధాని మోడీ ప్రయత్నిస్తున్నారని సీపీసీ రాజా విమర్శించారు. దక్షిణాధి రాష్ట్రాల్లో బీజేపీ యేతర ప్రభుత్వాలను గవర్నర్ల ద్వారా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా పనిచేస్తామని ఆయన స్పష్టం చేశారు.
కమ్యూనిజం ప్రమాదకర సిద్ధాంతమని ఇటీవల ప్రధాని అన్నారు. కార్చిచ్చు వంటి..దహించి వేస్తుందని విమర్శించారు. అవును కమ్యూనిజం ప్రమాదకరమైన సిద్ధాంతమే. మోడీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్కు కచ్చితంగా ప్రమాదకరమైందే. దేశంలోని శ్రామికులకు కమ్యూనిజం ప్రియమైన సిద్ధాంతం. మోడీ ఆధారపడుతున్న అదానీ, అంబానీకి మాత్రం కాదు. మేము సవాల్ స్వీకరిస్తున్నాం. మీతో పోరాడుతాం. 2024లో బీజేపీని ఓడించి తీరుతామన్నారు.
తమ్మినేని సీతారాం మాట్లాడుతూ.. కమ్యూనిస్టులు ఈరోజు బీఆర్ఎస్ వద్దకు వెళ్లారని చాలామంది అనుకుంటున్నారు. బీఆర్ఎస్, డీఎంకే, అన్నాడీఎంకే వద్దకు వెళ్లింది కమ్యూనిస్టులు కాదని స్పష్టంగా చెబుతున్నాం. ఎవరైతే కమ్యూనిస్టుల లైన్కు అనుగుణంగా మారారో వాళ్లే కమ్యూనిస్టుల దగ్గరకు వచ్చినట్టు అని తమ్మినేని చెప్పారు.
మేము ఎక్కడున్నామో అక్కడే ఉన్నామని, ఈ గడ్డమీదికి కాషాయ జెండా రాకూడదు. రానివ్వమని, తరిమితరిమి కొడతామని , మళ్లీ గోల్కొండ కింద బొందపెడుతామనే వైఖరితో మనం ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. అది భావజాలపరంగానే కాదు, భౌతికశక్తిగా కూడా కమ్యూనిస్టులు ఎదగాలన్నారు. అందుకోసం మన ఐక్యత కీలకమన్నారు.
సీపీఐ రాష్ట్రకార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. సీపీఐ, సీపీఎంలు ఒకే తల్లికి పుట్టిన కవల పిల్లల్లాగే ఉండాలి. ఓట్ల కోసం రాజకీయం చేస్తే కమ్యూనిస్టు పార్టీ ఇప్పటికే అధికారంలో ఉండేదన్నారు. ఒకటి రెండు సీట్ల కోసం కక్కుర్తి పడాల్సిన అవసరం మాకు లేదన్నారు. మాకు రాజకీయ లక్ష్యం ఉందన్నారు. బీజేపీ కో హటావో అన్నాం. కానీ బీఆర్ఎస్ హటావో అనలేం అన్నారు. ఇక్కడ బీజేపీ అడుగుపెట్టకుండా చేయడమే తమ కర్తవ్యమన్నారు.