బీజేపీని గద్దె దించే లక్ష్యంతో పని చేస్తాం: తమ్మినేని వీరభద్రం
ఆదానీ కంపెనీలపై దాడులు లేవా.. ఈడీ ప్రతిపక్షాలకేనా సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విధాత: రానున్న ఎన్నికల్లో కలిసి వచ్చే శక్తులను సమీకరించి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించే లక్ష్యంతో పోరాటాలు ఉదృతం చేస్తామని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్ష నాయకుల సంస్థలపైన, వ్యక్తులపైన ఈడీ, సీబీఐ దాడులు జరుగుతున్నాయే తప్ప ప్రధానమంత్రి మోడీ అనుచరుడైన ఆదానీ, […]

- ఆదానీ కంపెనీలపై దాడులు లేవా.. ఈడీ ప్రతిపక్షాలకేనా
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
విధాత: రానున్న ఎన్నికల్లో కలిసి వచ్చే శక్తులను సమీకరించి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించే లక్ష్యంతో పోరాటాలు ఉదృతం చేస్తామని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్ష నాయకుల సంస్థలపైన, వ్యక్తులపైన ఈడీ, సీబీఐ దాడులు జరుగుతున్నాయే తప్ప ప్రధానమంత్రి మోడీ అనుచరుడైన ఆదానీ, అతని సంస్థలపై దాడులు లేవా అని ప్రశ్నించారు.
దేశంలో రోజురోజుకు బీజేపీ నియంతృత విధానాలు పెరిగిపోతున్నాయని, అందులో భాగంగానే మీడియా సంస్థలపై దాడులు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసి పోరాటాలకు సన్నద్ధం అవుతామని తెలిపారు. అందులో భాగంగానే రాష్ట్రంలో బీఆర్ఎస్తో రానున్న ఎన్నికల్లో పొత్తులు ఉంటాయన్నారు.
ఇంతవరకు సీపీఎం, బీఆర్ఎస్ల మధ్య సీట్ల పొత్తు విషయంలో చర్చలు జరగలేదన్నారు. మీడియాలో వచ్చిన వార్తలు ఊహ జనితం అన్నారు. గత ఎన్నికల ముందు ప్రజలకు మోడీ ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేరలేదని విమర్శించారు. దేశంలో మతతత్వ దాడులు పెరిగాయని, హత్యలు అత్యాచారాలు జరుగుతున్న మోడీ స్పందించకపోవడం సిగ్గుచేటు అన్నారు.
కేంద్రంలో మోడీ ప్రభుత్వం రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేస్తుందని మండిపడ్డారు. మార్చ్ 15 నుంచి 30 వరకు కేంద్ర ప్రభుత్వ విధివిధానాలను నిరసిస్తూ సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజా జాతాను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న పోడు భూముల సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. 2022 వరకు దేశంలో ఇండ్లు లేని పేదవారు ఉండరని చెప్పిన ప్రధానమంత్రి ఇప్పటివరకు ఎన్ని ఇండ్లు కట్టించారో సమాధానం చెప్పాలని అన్నారు.
దేశంలో బుల్లెట్ ట్రైన్లు అతిగతి లేదని విమర్శించారు. రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో పెండింగ్ లో ఉన్న ఎస్ఎల్బీసీ సొరంగం, ఉదయ సముద్రం ప్రాజెక్టులకు ఎక్కువ నిధులు కేటాయించి త్వరిత గతిన పూర్తి చేయాలని అన్నారు.
సాగర్ ఎడమ కాలువ లిప్టుల పనులను పూర్తి చేసి వెంటనే ఆపరేటర్లను నియమించాలన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు తుమ్మల వీరారెడ్డి, డబ్బికారు మల్లేష్, బండ శ్రీశైలం, సయ్యద్ హాశం, కందాల ప్రమీల, సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి సలీం తదితరులు పాల్గొన్నారు.