కాంగ్రెస్ బలంగా ఉంది.. కష్టపడి పనిచేస్తేనే ఫలితాలు
రాష్ట్రంలో కాంగ్రెస్ బలంగా ఉందని, సమష్టిగా కష్టపడి పని చేస్తే పార్లమెంట్ ఎన్నికల్లో మరింత మంచి ఫలితాలు సాధిస్తామని ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ అన్నారు

- బీజేపీ మతతత్వ రాజకీయాలను తిప్పికొట్టండి
- ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ
విధాత, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉందని, సమష్టిగా కష్టపడి పని చేస్తే పార్లమెంట్ ఎన్నికల్లో మరింత మంచి ఫలితాలు సాధిస్తామని ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ అన్నారు. మంగళవారం హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో నిర్వహించిన టీపీసీసీ అధికార ప్రతినిధుల సమావేశంలో ఆమె మాట్లాడారు. పార్టీ అధికార ప్రతినిధుల బాధ్యత చాలా కీలకమైందన్నారు. రాష్ట్రంలో మనం అధికారంలో ఉన్నామని, ప్రభుత్వ పథకాలను విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లాలని సూచించారు. ప్రణాళిక తయారు చేసుకుని ముందుకు వెళ్ళాలన్నారు. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం చేస్తున్న రాజకీయాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. బీజేపీ మతతత్వ రాజకీయాలను ఎండగట్టాలన్నారు.
బీజేపీ తెలంగాణ విషయంలో ప్రత్యేక దృష్టి సారించిందని, కొన్ని నియోజకవర్గాల్లో వారు ఇప్పటికే లోతుగా పనులు చేస్తున్నారని, కాంగ్రెస్ శ్రేణులు మరింత అప్రమత్తం కావాలని సూచించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ గెలవగానే నాయకులు కొంచం విశ్రాంతిలో ఉంటున్నారని, పార్లమెంట్ ఎన్నికల కోసం మళ్ళీ పెద్దఎత్తున పోరాటానికి సిద్ధం కావాలని కోరారు. దేశంలో కాంగ్రెస్ కు తెలంగాణ నుంచి అత్యంత బాధ్యత ఉందని, మనం కష్టపడి మరింత మంచి ఫలితాలు అందించాలని దీపాదాస్ మున్షీ తెలిపారు. కాగా అంతకు ముందు గాంధీభవన్ కు వచ్చిన ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీకు తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు.