విధాత, వనపర్తి బ్యూరో: వనపర్తి జిల్లా వీపనగండ్ల పోలీస్ స్టేషన్ను మంగళవారం జిల్లా ఎస్పీ రక్షిత కె మూర్తి ఆకస్మికంగా తనఖీ చేశారు. స్టేషన్లో పెండింగ్ కేసులు, వాటి స్థితిగతులు, నమోదైన కేసుల్లో నిందితుల అరెస్టు, దర్యాప్తు పురోగతి తదితర అంశాలపై ఎస్సై నందికర్ను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్లవారీగా యూఐ కేసులు తగ్గించుకోవాలన్నారు. నిర్ణీత గడువులోపు పెండింగ్ కేసులను పరిష్కార దశకు తీసుకురావాలని చెప్పారు. మహిళలపై నేరాలు, బాలికల అదృశ్యం కేసులు, ఆస్తి కేసులు, రోడ్డు ప్రమాదాలు, 174 సీఆర్పీసీ తదితర కేసులతోపాటు.. మిస్సింగ్ కేసులలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.
నమోదైన కేసులలో సమగ్ర దర్యాప్తు నిర్వహించి, న్యాయ స్థానాలలో తగిన సాక్ష్యాధారాలు ప్రవేశపెట్టి నేరస్తులకు శిక్ష పడే విధంగా చార్జీషీటు ఫైల్ చేయాలని చెప్పారు. పోలీసు స్టేషన్లలో నమోదయ్యే కేసుల వివరాలను సీసీటీఎన్ఎస్ లో ఎప్పటికప్పుడు పొందుపరచాలని తెలిపారు. మహిళల, చిన్నారుల అదృశ్యం కేసులలో ఏ విధమైన అలసత్వం చూపించకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని, తప్పిపోయిన వారిని కనుగొనడొంలో నిబద్ధత చూపించాలని సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని ముఖ్యమైన ప్రదేశాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, స్థానిక ప్రజలకు వాటి ప్రాముఖ్యతను వివరిస్తూ కెమెరాలను ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించాలన్నారు.