ఒక గృహిణి ఆత్మహత్య ఉదంతంలో ఆగ్రహించిన బంధువులు.. వృద్ధులైన ఆమె అత్తామామలను ఇంట్లో ఉంచి.. సజీవంగా తగులబెట్టారు
ఒక గృహిణి ఆత్మహత్య ఉదంతంలో ఆగ్రహించిన బంధువులు.. వృద్ధులైన ఆమె అత్తామామలను ఇంట్లో ఉంచి.. సజీవంగా తగులబెట్టారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ జిల్లా ముతిగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి చోటుచేసుకున్నది. 27 ఏళ్ల యువతి ఆత్మహత్య చేసుకోవడంతో ఆ వార్త తెలుసుకున్న ఆమె బంధువులు రాత్రిపూట ఆమె అత్తామామల ఇంటిమీదకు వచ్చారు. అత్తామామలతో ఘర్షణకు దిగారు. తమ కుమార్తెను కట్నం కోసం వేధించారని, చంపి, ఉరేసి, ఆత్మహత్యగా చిత్రీకరించారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించారు.
యువతి ఆత్మహత్య చేసుకున్నదని తమకు సోమవారం బాగా పొద్దుపోయిన తర్వాత సమాచారం అందిందని ప్రయాగ్రాజ్ డీసీపీ (సిటీ) దీపక్ భుకార్ తెలిపారు. ఈ ఘటన నేపథ్యంలో కొందరు ఆమె అత్తామామల ఇంటిని తగులబెట్టారు. ‘మృతురాలి తల్లిదండ్రులు, అత్తామామలు అక్కడే ఉన్నారు. పోలీసులు అక్కడికి చేరుకునే సమయానికి వారు ఘర్షణ పడుతున్నారు. అకస్మాత్తుగా ఆ ఇంటికి ఎవరో నిప్పుపెట్టారు’ అని ఆయన చెప్పారు. మంటలు అంటుకున్న ఆ ఇంటి నుంచి ఐదుగురు వ్యక్తులను పోలీసులు రక్షించారని తెలిపారు. మంటలు ఆర్పేందుకు వెంటనే అగ్నిమాపక సిబ్బందిని కూడా తెప్పించామన్నారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో కాలిపోయిన ఆ ఇంటిలో చూడగా మృతురాలి మామ రాజేంద్ర కేసర్వాని (65), అత్త శోభాదేవి (62) మృతదేహాలు కనిపించాయని ముతిగంజ్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ సునీల్ బాజ్పాయి చెప్పారు. గాయపడినవారిలో మృతురాలి భర్త, రాజేంద్ర కుమార్తె శివానీ, రాజేంద్ర తమ్ముడి భార్య లవ్లీ కేసర్వాని ఉన్నారని తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న గృహిణి మృతదేహంతో పాటు ఆమె అత్తామామల మృతదేహాలను పోస్టుమార్టంకు పంపించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.