బీజేపీ శాసన సభ పక్ష నేతగా ఏలేటి నియామకం
బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి నియామకం అయ్యారు. మహేశ్వర్ రెడ్డిని బీజేఎల్పీ నేతగా నియమిస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

- మండలి పక్ష నేతగా ఏవీఎన్ రెడ్డి
విధాత హైదరాబాద్ : బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి నియామకం అయ్యారు. మహేశ్వర్ రెడ్డిని బీజేఎల్పీ నేతగా నియమిస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. బీజేఎల్పీ ఉపనేతలుగా పాయల్ శంకర్, వెంకటరమణారెడ్డి నియామకం అయ్యారు. శాసనసభలో చీఫ్ విపద్గా పాల్వాయి హరీశ్ బాబు, విప్గా ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, కోశాధికారిగా పైడి రాకేశ్రెడ్డి, బీజేపీఎల్పీ కార్యదర్శిగా రామారావు పాటిల్లను నియమించారు. శాసనమండలి పక్షనేతగా ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి నియామకం అయ్యారు.
మహేశ్వర్ రెడ్డి నిర్మల్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన సంగతి తెలిసిందే. మహేశ్వర్ రెడ్డి 2009లో ప్రజారాజ్యం తరపున పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందే మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 8 స్థానాల్లో విజయం సాధించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా 4 స్థానాల్లో బీజేపీ విజయం సాధించడంతో ఆ జిల్లాకు చెందిన మహేశ్వర్ రెడ్డికే బీజేఎల్పీ నేతగా అవకాశం దక్కింది.
అదిగాక గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన వారిలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, మహేశ్వర్రెడ్డిలు మాత్రమే ఉన్నారు. మిగతా వారంతా తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గోషామహల్ నుంచి రాజాసింగ్ హ్యాట్రిక్ విజయం సాధించగా ఆదిలాబాద్ నుంచి పాయల్ శంకర్, సిర్పూర్ కాగజ్నగర్ నుంచి పాల్వాయి హరీశ్బాబు, నిర్మల్ నుంచి ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ముథోల్ నుంచి రామారావు పటేల్, నిజామాబాద్ అర్బన్ నుంచి ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, ఆర్మూర్ నుంచి రాకేశ్ రెడ్డి, కామారెడ్డి నుంచి కాటిపల్లి వెంకటరమణా రెడ్డి గెలిచారు.