గుజరాత్లో మెజారిటీకి బొహ్రాలే కారణం.. పస్మందా నినాదంతో తమవైపుకు తిప్పుకునేలా పావులు మైనార్టీల మెప్పు పొందేలా చర్యలు విధాత: 2024 సార్వత్రిక ఎన్నికల కోసం బీజేపీ సకల సన్నాహాలు చేస్తున్నది. ఢిల్లీలో ఎన్డీఎంసీ కన్వెన్షన్లో రెండు రోజులు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగాయి. జనవరి 17 చివరి రోజున ముగింపు ఉపన్యాసంగా మోదీ ప్రసంగిస్తూ.. సమాజంలోని అన్ని వర్గాలను, ముఖ్యంగా ముస్లిం మైనారిటీల విశ్వాసాన్ని చూరగొనాలని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ముచ్చటగా మూడో సారి హ్యాట్రిక్ […]
విధాత: 2024 సార్వత్రిక ఎన్నికల కోసం బీజేపీ సకల సన్నాహాలు చేస్తున్నది. ఢిల్లీలో ఎన్డీఎంసీ కన్వెన్షన్లో రెండు రోజులు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగాయి. జనవరి 17 చివరి రోజున ముగింపు ఉపన్యాసంగా మోదీ ప్రసంగిస్తూ.. సమాజంలోని అన్ని వర్గాలను, ముఖ్యంగా ముస్లిం మైనారిటీల విశ్వాసాన్ని చూరగొనాలని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ముచ్చటగా మూడో సారి హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకోవటానికి మోదీ తన అమ్ముల పొదిలోని అన్ని అస్త్రాలను వెలికి తీస్తున్నారు.
ఈ ఎనిమిదేండ్లలో ఎప్పుడు లేని విధంగా తమది ‘అభివృద్ధి రాజకీయం’ అని అంటూనే.., ఇన్నాళ్లూ బీజేపీకీ దూరంగా ఉంటున్న వర్గాలను గుర్తించి ఆ వర్గాలు లక్ష్యంగా పనిచేయాలని బీజేపీ నాయకత్వ శ్రేణులకు సూచించారు. అందులో ముఖ్యంగా ముస్లిం వర్గాల్లోని వెనుకబడిన అట్టడుగు సెక్షన్లను తమ వైపు తిప్పుకోవటానికి వ్యూహ రచన చేశారు.
ఈ క్రమంలో గుజరాత్లో ముస్లిం మైనారిటీ వర్గాల్లోని బొహ్రా వర్గాలను తమ వైపు తిప్పుకొన్న ఫలితంగా ఒనగూడిన ప్రతిఫలా న్ని చెప్పుకొచ్చారు. గుజరాత్లో ఈ సారి అఖండ మెజారిటీ రావటానికి ముస్లిం వర్గాల్లోని బొహ్రాలను బీజేపీ తమ వైపు తిప్పుకొన్నది. బొహ్రాల్లోని చదువుకొన్న యువతను ఉద్యోగాల ఎర చూపి ఆకర్షించింది.
ఆ నేపథ్యంలోంచే మునుపెన్నడూ లేని స్థాయిలో గెలుపు సాధ్యమైందని మోదీ అంచనాకు వచ్చారు. ఇదే సూత్రంపై ఆధారపడి యూపీలోనూ విజయాలు సాధించామని బీజేపీ అగ్రనేతలు అంటున్నారు. యూపీలో కూడా ముస్లింల్లోని విద్యా, ఆర్థిక, సామాజికంగా వెనుకబడిన వర్గాలను బీజేపీ తమ వైపు తిప్పుకున్నది. ఆ బలంతోనే యోగీ ఆధిత్యనాథ్ విజయం సాధించారని అంటున్నారు.
సరిగ్గా ఇదే సూత్రాన్ని దేశ వ్యాప్తంగా అనుసరించాలని మోదీ-షా ద్వయం ఆలోచిస్తున్నట్లు తెలుస్తున్నది.
ముస్లింల్లోని బొహ్రాలు గుజరాత్లో గణనీయ సంఖ్యలో ఉంటారు. అలాగే దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో 5 లక్షలకు పైగా ఉంటారని అంచనా. వీరికి తోడు ముస్లింల్లోని వెనుకబడిన వర్గాలను గుర్తించి వారి విశ్వాసాన్ని పొందాలని బీజేపీ అగ్రనాయకత్వం ఆలోచిస్తున్నది.
ఈ క్రమంలోంచే.. మోదీ ‘పస్మాందా’నినాదాన్ని ముందుకు తెచ్చారు. పస్మాందా అంటే.. నిర్లక్ష్యం చేయబడిన వారనీ, విడిచిపెట్టిన వారని అర్థం. 2024 సాధారణ ఎన్నికల కోసం బీజేపీ పస్మాందా నినాదంతో ముస్లింల్లోని స్వవర్గాలతో వివక్షకు గురైన, వెనుకబడిన వర్గాల ను తమవైపు తిప్పుకొనేందుకు పావులు కదుపుతున్నది. ఆ క్రమంలో ముస్లింలను… ఆఫ్రష్, అజ్లఫ్, అర్జల్ వర్గాలుగా వర్గీకరిం చింది.
అఫ్రష్లు అంటే-అఫ్ఘనిస్థాన్, ఇతర మధ్య ఆసియా దేశాల నుంచి దేశంలోకి వచ్చిన ముస్లింలు, లేదా దేశంలో ముస్లింలుగా మారిన ఉన్నత వర్గాలైన రాజ్పుత్లుగా చెప్తున్నారు. అంటే.. వీరు ముస్లింల్లోని కులీన ఉన్నత వర్గాలు. అజ్లఫ్లు-అంటే.. ముస్లింల్లో వివిధ వృత్తి జీవితాలు కలిగిన వారు. హిందు కుల వ్యవస్థలోని ఓబీసీ వర్గాల లాంటి వారు. అర్జల్లు -అంటే.. ముస్లింల్లోని అంటరాని వారు. పాకీపని చేసేవారూ, దూదేకులు, ఇతర వర్గాల వారిని అర్జల్లుగా వ్యవహరిస్తున్నారు.
దేశంలో మైనారిటీ వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం వెచ్చిస్తున్న నిధులను ఉన్నత వర్గాలే కాజేస్తున్నాయని చెప్పి, నిమ్న, వెనుకబడిన వర్గాలను దగ్గర చేసుకొనేందుకు బీజేపీ కసరత్తు చేస్తున్నది.
ఈ నేపథ్యంలోంచే.. ఫిబ్రవరి 1, 2 తేదీల్లో గుజరాత్ లో జాతీయ మైనారిటీ మోర్చా సమావేశం నిర్వహించాలని బీజేపీ నిర్ణయిం చింది.
అలాగే.. దేశంలో 70 పార్లమెంట్ నియోజక వర్గాలను ఎంపిక చేసి అందులో ఒక్కో నియోజక వర్గంలో 5వేల మంది ముస్లిం కార్యకర్తలను ఎన్నికల సైన్యంగా వినియోగించాలని బీజేపీ సన్నాహాలు చేస్తున్నది.
ఈ సందర్భంగానే నరేంద్ర మోదీ బీజేపీ నాయకత్వానికీ, వివిధ శ్రేణులకు ముస్లిం మైనారిటీ వర్గాలతో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.
ఎక్కడా మైనారిటీల మనోభావాలను కించపరిచేవిధంగా, గాయపరిచే విధంగా మాట్లాడొద్దని హెచ్చరించా రు. బాలీవుడ్పై బీజేపీ నేతలు ఈ మధ్య విమర్శదాడి ఎక్కుపెట్టిన దాన్ని ఉదహరించి, అట్లాంటి దాడిని వీడాలని సూచించారు. మొత్తంగా.. 2024 సార్వత్రిక ఎన్నికల కోసం బీజేపీ సర్వశక్తులను ఒడ్డటమే కాదు, అనేక రకాల ఓటు బ్యాంకు వ్యూహాలను పన్నుతున్నట్లు తెలుస్తున్నది.