విధాత: సీనియర్ ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కా తనకు చేయటానికి పని ఉండటం లేదనీ, రోజుకు ఎనిమిది నిమిషాల పనికి ఏడాదికి రూ.40లక్షల జీతం ఇస్తున్నారని అంటున్నారు. కనీసం వారానికి 40 గంటల పని ఉండాలి. కానీ నాకు గంట పని కూడా ఉండటం లేదని వాపోతున్నారు.
1991 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కా. హరియాణా రాష్ట్రంలో పోస్టింగ్ పొందిన నాటి నుంచీ ఆయనకు తన పనితీరుతో బదిలీలే ఎదురయ్యాయి. తన 30 ఏండ్ల సర్వీసులో 56 బదిలీలు పొందారు. అంటే ప్రతి ఆరు నెలలకు ఒకసారి బదిలీ బహుమానంగా పొందారు.
నీతి, నిజాయితీకి మారుపేరైన ఖేమ్కా ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించిన ప్రతిచోటా అధికార గణానికి కంటగింపు అయ్యారు. అధికార పీఠాలకు ఆశించిన రీతిలో పని చేయనందుకు… ఆయనకు బదిలీ బహుమానంగా పొందారు. రాజకీయ నాయకులే కాదు, తోటి అధికారుల సహాయ నిరాకరణ కూడా ఆయన అనునిత్యం ఎదుర్కొంటున్నారు.
తాజాగా ఈ మధ్యనే సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్కు అదనపు కార్యదర్శిగా బదిలీ చేశారు. ఈ డిపార్ట్మెంటుకు బదిలీపై రావటం ఇది నాలుగో సారి. విభాగం బడ్జెట్ నాలుగు కోట్లు. నా ఏడాది జీతం రూ. 40లక్షలు. అంటే దానిలో పది శాతం నా జీతమే ఉంటున్నదని అంటున్నారు. ఇందులో చేయటానికి పనేమీ ఉండదనీ, తనకు పని ఉన్న చోట పోస్టింగ్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ మేరకు ఆయన హరియాణా చీఫ్ సెక్రటరీ సర్వేశ్ కౌశల్కు లేఖ కూడా రాశారు.
మరో రెండేండ్లలో పదవీ విరమణ పొందనున్న అశోక్ ఖేమ్కా.. చివరి రోజుల్లో నైనా పనిచేసే అవకాశం కల్పించాలని కోరుతున్నారు. ఈ రోజుల్లో అయినా తనను విజిలెన్స్ డిపార్ట్మెంటుకు బదిలీ చేయాలని కోరుతున్నారు.
ఇవ్వాళ ప్రజలకు అతిపెద్ద ప్రమాదంగా, భారంగా మారిన అవినీతిని అంతం చేయనిదే స్వచ్ఛమైన సమాజం నిర్మించలేమని అన్నారు. తనకు అవకాశం కల్పిస్తే పేరుకు పోయిన అవినీతిని రూపుమాపుతానని అంటున్నారు. ఈ మేరకు ఆయన ప్రధాని నరేంద్రమోదీ, హరియాణా ముఖ్యమంత్రి మనోహర్లాల్ ఖట్టర్కు లేఖలు రాశారు.