డబుల్ ఇండ్లపై త్వరలో ప్రభుత్వం పాలసీ ప్రకటన
డబుల్ బెడ్ రూమ్ ఇండ్లపై త్వరలోనే ప్రభుత్వం పాలసీ ప్రకటన

జీహెచ్ఎంసీ అభివృద్ధి పై ప్రభుత్వం సానుకూలత
సమీక్ష సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్
విధాత, హైదరాబాద్ :డబుల్ బెడ్ రూమ్ ఇండ్లపై త్వరలోనే ప్రభుత్వం పాలసీ ప్రకటన చేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. బుధవారం జీహెచ్ఎంసీ సమీక్ష సమావేశంలో అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జీహెచ్ఎంసీ సమీక్షలో అన్ని అంశాలను చర్చించామని, జీహెచ్ఎంసీ అభివృద్ధికి ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. వచ్చే సమ్మర్లో నీటి ఎద్ధడికి ఎలాంటి సమస్య లేదని, త్రాగునీటి సమస్య లేకుండా అన్ని ముందస్తు ఏర్పాట్లు చేసామన్నారు. జీహెచ్ఎంసీలో రెవెన్యూ పెంచుకోవడానికి ప్రత్యేక పాలసితో ముందుకు వెళ్ళబోతున్నామని, మూసీ అభివృద్ధికి ఎలాంటి ఆటంకం కలుగకుండా చర్యలు ఉంటాయన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్కు ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్తామని, అర్బన్ అభివృద్ధి కోసం కేంద్రం సహకారం తీసుకునే ఆలోచనలో మా ప్రభుత్వం ఉందని, కేంద్ర ప్రభుత్వంతో మాకు ఎలాంటి విబేధాలు లేవని, అభివృద్ధిలో కేంద్రాన్ని కలుపుకొని వెళ్తామన్నారు. హైదరాబాద్ అభివృద్ధి పై రోజూ వారీగా సమీక్షలు, సమస్యలపై రిపోర్ట్ తయారీ ఉంటుందన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో అధికారులు అలెర్ట్ గా ఉండాలని సూచన చేశామని, అప్పులు – ఆస్తులు అంశాలపై సీఎంకు నివేదిక అందిస్తామన్నారు. గత ప్రభుత్వం తరహాలో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు నిధుల కేటాయింపు ఉంటుందన్నారు. జీహెచ్ఎంసీ సమస్యలపై ప్రత్యేక నివేదిక తయారు చేయాలని ఆదేశించామని, త్రాగునీటి అంశంలో రాజకీయ అపోహలు మాత్రమే తప్పఎలాంటి సమస్యలు లేవన్నారు. వచ్చే వేసవిలో సిటీలో త్రాగునీటి సమస్య ఉత్పన్నం కాదని, అధికారుల సమన్వయం కోసం ప్రత్యేకంగా ఒఎస్డీని నియమిస్తున్నామన్నారు.