విధాత : వందరోజుల పాలన చూసి ప్రజలు పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటేయాలని సీఎం రేవంత్రెడ్డి చెబుతున్నారని, అసలు ఈ వంద రోజుల పాలనలో ఏం చేశారని, ఏం చూసి మీకు ఓటెయ్యాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ప్రశ్నించారు. ఆయన బుధవారం మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం తమ వందరోజు పాలనలో వైట్ పేపర్, బ్లాక్ పేపర్ అంటూ మోదీకి లవ్ లెటర్ రాశారని విమర్శలు గుప్పించారు. రేవంత్ ప్రజలనే కాదు.. కాంగ్రెస్ను కూడా మోసం చేస్తున్నారన్నారు. మోదీనే మళ్లీ ప్రధాని అవుతారన్నట్లు రేవంత్ మాట్లాడారని.. కాంగ్రెస్ గెలవదని రేవంత్ చెప్పకనే చెప్పారన్న హరీశ్రావు రావు ఎద్దేవా చేశారు. గుజరాత్ మోడల్ నిరంకుశమని రాహుల్ అంటే, సీఎం రేవంత్ మాత్రం గుజరాత్ మోడల్ కావాలంటున్నారని.. గుజరాత్ మోడల్ ఫెయిల్ అంటూనే అదే మోడల్ కావాలంటున్నారని ఆరోపించారు. పది రోజుల్లో ఎన్నికల కోడ్ వస్తుందని.. అలాంటప్పుడు మోదీని ఎందుకు అంతగా రేవంత్ పొగిడారని ప్రశ్నించారు. రాహుల్ ప్రధాని అవుతాడని చెబుతున్న సీఎం రేవంత్రెడ్డి మరి ప్రధాని మోదీ సహకారం ఎందుకు కావాలని అడుగుతారన్నారని నిలదీశారు. బీజేపీ పార్టీ తమ ఎంపీలను లాగేసుకుంటుందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రజాపాలనలో పెన్నులు గన్నులయ్యాయని.. తాము అధికారంలో ఉన్న సమయంలో ఉన్నప్పుడు పరిస్థితి ఇలా ఉండేదా? అంటూ ప్రశ్నించారు. జర్నలిస్టులు సచివాలయంలో అన్ని ఫోర్లు స్వేచ్ఛగా తిరిగేవారని.. ప్రస్తుతం సచివాలయంలో విలేకరులకు ఎందుకు స్వేచ్ఛ లేదని హరీశ్రావు నిలదీశారు. నిధుల దుర్వినియోగమని చెప్పినవారు ఆరుగురిని పీఆర్వోలుగా ఎందుకు పెట్టుకున్నారన్నారు.
వందరోజుల పాలనలో హామీల అమలు ఎక్కడా
డిసెంబర్ 9న రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి..వందరోజుల వరకు రుణమాఫీ చేయలేదని ధ్వజమెత్తారు. కనీసం బడ్జెట్లోనూ రైతు రుణమాఫీ నిధుల కేటాయింపులు లేవన్నారు. రైతులకు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తామని ఇంత వరకు ఇవ్వలేదన్నారు. వచ్చే యాసంగికైనా రూ.500 బోనస్ ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతోనే కరువొచ్చిందన్నారు. ట్యాంకర్ల ద్వారా వరిపంటకు నీళ్లుపోయాల్సిన దుస్థితి ఎదురైందన్నారు. తాము అధికారంలోకి వస్తే రూ.4వేల పింఛన్లు ఇస్తామన్నారని.. కనీసం రూ.2వేల పింఛన్ను నెలనెలా ఇవ్వడం లేదని.. ఒక నెల ఎగొట్టారని విమర్శించారు. ఆరు గ్యారంటీల్లో 13హామీలు ఉన్నాయని.. అవన్నీ అమలయ్యేది ఎప్పుడు? అని ప్రశ్నించారు. మహిళలను మహాలక్ష్మీలను చేస్తామన్నారని.. మరి ఏమైందని ప్రశ్నించారు. ఎల్ఆరెస్ ఉచితంగా చేస్తామని చెప్పి.. ఇప్పుడు వసూలు చేస్తున్నారన్నారు.
నిరుద్యోగులకు రూ.4వేలు ఇస్తామని ఊసెత్తడం లేదని.. ఆటో అన్నలకు రూ.12వేలు ఇస్తామని చెప్పారని.. ఎందరో ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ రూ.16వేలకోట్లు అప్పులు చేశారని.. ఇంకా అప్పు కోసం ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారన్నారు. ఫ్లోర్లలో ఉండే కుటుంబానికి అన్ని మీటర్లకు ఉచిత విద్యుత్ అమలులో లేదని.. మరి ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు.