‘ధరణి’నే సర్వరోగ నివారిణి కాదు ‘ధరణి’ సవరణో, రద్దు చేయడమో సమస్యకు సంపూర్ణ పరిష్కారం కాదు భూచట్టాల నిపుణుడు, న్యాయవాది భూమి సునీల్ చర్చా పత్రం (PART 1) ధరణితోనే భూ సమస్యలన్నీ పరిష్కారమవుతాయని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నది. తాము అధికారంలోకి రాగానే మొదటి సంతకం ధరణిని రద్దు చేయడంపైనేనని కాంగ్రెస్ నాయకత్వం ప్రకటిస్తున్నది. క్షేత్రస్థాయిలో ధరణి సమస్యలు ఉన్నాయని రైతుల గోస చూస్తే అర్థమవుతున్నది. మరి ఈ సమస్యకు పరిష్కారమేంటి? ధరణిని రద్దు చేయాలా? లేక […]
ధరణితోనే భూ సమస్యలన్నీ పరిష్కారమవుతాయని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నది. తాము అధికారంలోకి రాగానే మొదటి సంతకం ధరణిని రద్దు చేయడంపైనేనని కాంగ్రెస్ నాయకత్వం ప్రకటిస్తున్నది. క్షేత్రస్థాయిలో ధరణి సమస్యలు ఉన్నాయని రైతుల గోస చూస్తే అర్థమవుతున్నది. మరి ఈ సమస్యకు పరిష్కారమేంటి? ధరణిని రద్దు చేయాలా? లేక దాంట్లో సవరణలు తేవాలా? అసలు ధరణి సర్వరోగ నివారిణి అవుతుందా? ప్రత్యామ్నాయమేంటి? ఉన్న సమస్యలేంటి? వాటికి పరిష్కారాలేంటి? ఈ అంశాలపై ప్రముఖ భూచట్టాల నిపుణుడు న్యాయవాది రూపొందించిన అధ్యయనం పత్రం ఇది. దీనిపై మీరూ చర్చించండి. మీ అభిప్రాయాలను పంచుకోండి. మీ వాదనకు మా విధాత వేదికవుతుంది. మీ వాదనను ప్రపంచానికి చాటుతుంది. మీ అభిప్రాయాలను vidhathanews@gmail.com కు మెయిల్ చేయండి.
—————-
విధాత:భూ హక్కుల చరిత్రలో తెలంగాణది ఒక మహోన్నత స్థానం. కౌలుదార్లను భూయజమానులుగా చేసిన నేల. పేదలను పట్టాదారులుగా మార్చిన ప్రాంతం. ఇక్కడ భూహక్కుల కోసం రైతాంగ సాయుధ పోరాటం (Telangana Armd Struggle) జరిగింది. ఇదే గడ్డపై నుండి భూదాన ఉద్యమం (Bhoodan Movement) ఆరంభమైంది. దేశం మొత్తంలో పేదలకు పంచిన ప్రభుత్వ భూమిలో పద్నాలుగు శాతం తెలంగాణలోనే పంపిణీ జరిగింది.
రైతులకు మేలు చేసే ఎన్నో గొప్ప చట్టాలు ఇక్కడ రూపొందాయి. అయినా, తెలంగాణ (Telangana) ఏర్పడే నాటికి యాభై ఆరు శాతం గ్రామీణ కుటుంబాలకు భూమి లేదు. భూమి ఉన్న వారికి కూడా గుంటకో సమస్య ఉంది. భూమి ఉంటే చాలదు. ఆ భూమికి పట్టా, రికార్డులలో పేరు ఉంటేనే హక్కులకి భద్రత. పట్టానో, రికార్డులో పేరో లేదా రెండూ కూడా లేని వారి సంఖ్యే ఎక్కువ. సాదాబైనామా (Sadabainama) ద్వారా భూమి కొనుగోలు చేసి పట్టా లేని వారు పది లక్షలకు పైనే. పోడు సాగు చేస్తూ హక్కు పత్రం పొందని వేల గిరిజన కుటుంబాలు. లక్షల్లో ఉన్న కౌలు రైతులకు అందని ప్రభుత్వ ఫలాలు. 30 ఏళ్లకు ఒకసారి జరగాల్సిన భూముల సర్వే (Land Survey) 70 ఏళ్లు దాటినా జరగలేదు.
భూ రికార్డులు వాస్తవ పరిస్థితికి ఆమడ దూరంలో ఉన్నాయి. భూతగాదాలు వేల సంఖ్యలో. సమస్యలతో కునారిల్లుతున్న భూపరిపాలన. ఇదీ తెలంగాణ ఏర్పడిన నాటి పరిస్థితి. తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పడుతున్న సందర్భంగా ‘ల్యాండ్ కారవాన్’ పేరుతో ఉమ్మడి పది జిల్లాల్లో దాదాపు మూడువేల కిలోమీటర్లు పర్యటించి, పదివేలమందిని కలిసి మాట్లాడాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కొత్త ప్రభుత్వం భూములకు సంబంధించి ఏం చెయ్యాలి? భూపరిపాలన ఏవిధంగా ఉండాలి? భూములకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అని అందరినీ అడిగాం.
ఆకాంక్షలు ఎన్నెన్నో..
అప్పుడు వారు వెలిబుచ్చిన ఆకాంక్షలలో ప్రధానమైనవి – భూముల రీ సర్వే చెయ్యాలి; భూరికార్డులను (Land Records) సవరించి అందరికీ అందుబాటులో ఉంచాలి; సాదాబైనామా (Sadabainama) క్రమబద్ధీకరణ చెయ్యాలి; పేదలకు భూపంపిణీ జరగాలి; కౌలుదారులకు (Tenant) రుణ అర్హత కార్డులు ఇవ్వాలి; పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలి; రెవెన్యూ ఫారెస్ట్ సరిహద్దులు నిర్ణయించి, సాగులో ఉన్న వారికి పట్టాలు ఇవ్వాలి; ప్రతి గ్రామంలో ఒక రెవెన్యూ అధికారి (Revenue Officer) ఉండాలి, వారికి సరైన శిక్షణ, వారిపై అజమాయిషీ ఉండాలి; అన్యాక్రాంతమైన గిరిజన, అసైన్డ్ (Assigned Lands) భూములను తిరిగి ఇప్పించాలి; మహిళలకు భూ హక్కులు కల్పించాలి; పేదలకు న్యాయ సహాయం అందించే పారాలీగల్ వ్యవస్థను బలోపేతం చేయాలి.
చేయాల్సింది ఏమి ఉన్నది?
తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, వారి అభిప్రాయాల ఆధారంగా ‘తెలంగాణ ప్రజల భూమి మేనిఫెస్టో’ రూపొందించాం. దీనిని ప్రజలలో చర్చకు ఉంచాం. అన్ని రాజకీయ పార్టీలకు అందించాం. BRS (అప్పటి TRS)తోపాటు కాంగ్రెస్, TDP మ్యానిఫెస్టోలలో కూడా ఈ అంశాలను పొందుపర్చారు. గడిచిన తొమ్మిదేళ్లలో ప్రజల భూమి ఆకాంక్షలు ఏమేరకు నెరవేరాయి? భూసమస్యలన్నీ పరిష్కారమయ్యాయా? ‘ధరణి’ (Dharani) భూసమస్యల సాగరాన్ని దాటించిందా? తెలంగాణ ప్రజలు హక్కులు చిక్కులు లేని దరికి చేరినట్లేనా? ఇంకా ఏమి చెయ్యాల్సి ఉంది?
‘ధరణి’ సర్వరోగ నివారిణి కాదు.. సవరణో, రద్దు చేయడమో పరిష్కారం కాదు
హామీలు – ఆచరణలు
రాష్ట్ర పునర్విభజన చట్టం (State Reorganisation Act) ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో చేసిన చట్టాలు కొత్త రాష్ట్రంగా ఏర్పడిన నాటినుండి రెండేళ్ల వరకే అమలులో ఉంటాయి. ఆ తరువాత వాటిని యథాతథంగా లేదా మార్పు చేర్పులతో తెలంగాణకు వర్తింప చెయ్యాల్సి ఉంటుంది. ఈ అవకాశాన్ని వినియోగించుకుని భూమి చట్టాలను తెలంగాణకు వర్తింపచేసే ముందు సమీక్షించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఆ బాధ్యతను నల్సార్ యూనివర్సిటీ (Nalsar Law University)కి అప్పగించింది.
తెలంగాణలో అమలులో ఉన్న వందకు పైగా చట్టాలను నల్సార్ అధ్యయనం చేసి, రాష్ట్ర , జిల్లా స్థాయిలలో సమావేశాలు నిర్వహించి, అన్ని వర్గాల వారి అభిప్రాయాలను తీసుకొని ప్రభుత్వానికి ఒక సవివరమైన నివేదికను సమర్పించింది. ఇప్పటి అవసరాలకు అనుగుణంగా పలు చట్టాలలో మార్పులు చేయాలని, కొన్ని చట్టాలను పూర్తిగా తొలగించాలని ఈ నివేదికలో సూచించింది. చట్టాలలో గందరగోళం పోవాలంటే అన్ని చట్టాలను కలిపి ఒకే చట్టంగా రూపొందిస్తే మేలని పేర్కొంది.
సాదాబైనామా/ రిజిస్టర్ కాని దస్తావేజుల (తెల్ల కాగితాలు / స్టాంపు కాగితాలు) ద్వారా లేదా నోటి మాట ద్వారా వ్యవసాయ భూములు కొనుగోలు చేసిన చిన్న, సన్నకారు రైతులకు పట్టాలు ఇవ్వడం కోసం తెలంగాణ ఏర్పడిన తొలినాళ్లలోనే ప్రయత్నం జరిగింది. సాదాబైనామా క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2, జూన్ 2014 లోపు గ్రామీణ ప్రాంతంలోని వ్యవసాయ భూములను సాదా బైనామా లేదా నోటి మాట ద్వారా కొనుగోలు చేసిన చిన్న, సన్నకారు రైతులకు ఉచితంగా పట్టా చేసి, పాసు పుస్తకాలు ఇవ్వడానికి ప్రభుత్వం ROR చట్టాన్ని సవరించింది.
దాదాపుగా పన్నెండు లక్షల దరఖాస్తులు వస్తే ఆరున్నర లక్షల మందికి పట్టాలు ఇచ్చారు. అయినా ఇంకా చాలామంది క్రమబద్ధీకరణ చేసుకోలేకపోయారు. మరొకసారి అవకాశం ఇవ్వాలని వచ్చిన వినతుల మేరకు ప్రభుత్వం మరోదఫా 2020 లో అవకాశం ఇచ్చింది. పాత ROR చట్టం అమలులో ఉన్నప్పుడు రెండున్నర లక్షలు, కొత్త ROR చట్టం వచ్చిన తర్వాత మరో ఏడున్నర లక్షల దరఖాస్తులు వచ్చాయి. క్రమబద్ధీకరణ చేసే అధికారాన్ని జిల్లా కలెక్టర్లకు అప్పగించారు. ఇంతకుముందు తహశీల్దార్లు ఈ పని చేసేవారు.
స్వాధీనంలో భూమి, చేతిలో పట్టా, రికార్డులో పేరు ఉంటేనే భూ హక్కులకు భద్రత. భూమి ఉన్నా రికార్డులలో పేరు లేదు. భూమి, రికార్డు ఉన్నా పట్టా రాలేదు. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రభుత్వం భూమి రికార్డుల ప్రక్షాళనను LRUP ఆరంభించింది. LRUP ద్వారా ప్రతి గ్రామానికి రెవెన్యూ సిబ్బందిని పంపి రికార్డుల్లో తప్పొప్పులను సవరించే కార్యక్రమం చేసింది. ఈ వివరాల ఆధారంగానే రైతులకు కొత్త పాసు పుస్తకాలను అందించడం జరిగింది.
DHARANI: ‘ధరణి’పై తహసీల్దార్, ఆర్డీవోలకూ అధికారాలు? వికేంద్రీకరణ దిశగా యత్నాలు!
కొత్త ROR చట్టాన్ని రూపొందించి, ప్రక్షాళన చేసిన భూమి రికార్డులను “ధరణి” లోకి ఎక్కించారు. ధరణి వలన భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ప్రక్రియలు వేగవంతం, సులభతరం అయ్యాయి. భూ సమస్యల పరిష్కారాల కోసం ఏర్పాటు చేసిన రెవెన్యూ కోర్టులను ప్రభుత్వం రద్దు చేసింది. వీటి స్థానంలో తాత్కాలిక జిల్లా ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేసి, పాత కేసులను పరిష్కరించారు. కొత్త కేసులన్నీ సివిల్ కోర్టులకు వెళ్లాల్సిందేనని ప్రభుత్వం ప్రకటించింది.
భూముల సమగ్ర సర్వే చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. 2017 వరకు అసైన్డ్ భూములు (Assigned Lands) కొనుగోలు చేసిన పేదలకు క్రమబద్ధీకరణ కోసం చట్ట సవరణ చేసింది. అసైన్డ్ భూములకు పట్టా హక్కులు కల్పించే ప్రయత్నం చేస్తామని ప్రభుత్వం చెప్పింది. తరాలుగా అడవులు, అటవీ భూములపై ఆధారపడి జీవిస్తున్న గిరిజనుల (Tribals) హక్కులను గుర్తించడానికి కేంద్రం 2008లో అటవీ హక్కుల చట్టం తెచ్చింది. ఈ చట్టం ప్రకారం 13, డిసెంబర్ 2005 నాటికి గిరిజనుల సాగులో ఉన్న అటవీ భూమికి హక్కు మాత్రం ఇవ్వాలి.
తెలంగాణలో ఇప్పటి వరకు 97,434 మందికి 3,10,916 ఎకరాల అటవీ భూమికి హక్కు పత్రాలు ఇచ్చారు. లక్షకుపైగా దరఖాస్తులను తిరస్కరించారు. పోడు చేసుకుంటూ హక్కు పత్రాలు రాని వారి నుండి ప్రభుత్వం కొత్తగా దరఖాస్తులను స్వీకరించింది. దాదాపు పన్నెండు లక్షల ఎకరాలపై హక్కు పత్రాల కోసం నాలుగు లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. భూమి హక్కులకు పూర్తి భరోసా ఇచ్చే టైటిల్ గ్యారెంటీ (Title Guaranty) వ్యవస్థ తేవడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తామంది.
భూమిలేని నిరుపేద దళిత వ్యవసాయ ఆధారిత కుటుంబాలకు మూడు ఎకరాల భూమిని ఇచ్చే పథకం తెలంగాణ వచ్చిన తొలినాళ్లలోనే ఆరంభమైంది. ఇప్పటివరకు దాదాపు 8 వేల మంది దళిత కుటుంబాలకు 12 వేల ఎకరాల వరకు భూమి ఇచ్చారు. గ్రామ రెవెన్యూ అధికారుల వ్యవస్థను రద్దు పరిచారు. రెవిన్యూ కోర్టులు రద్దయ్యాయి. తహశీల్దార్లకే రిజిస్ట్రేషన్ అధికారాలు కట్టబెట్టారు. భూదాన్ బోర్డు రద్దయింది. భూసమస్యల పరిష్కారానికి ఇప్పుడు కేవలం కలెక్టర్లకే అధికారాలు ఉన్నాయి. భూ వివాదాల పరిష్కారం ఇప్పుడు సివిల్ కోర్టులలోనే.