Champions Trophy : ఛాంపియన్స్ ట్రోఫీ విజేత భారత్
పుష్కర కాల విరామం తర్వాత ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ భారత్ వశమైంది. నిరుడు టీ20 వరల్డ్ కప్ను ముద్దాడిన రోహిత్ సేన.. తాజాగా చాంపియన్స్ ట్రోఫీనీ కైవసం చేసుకుంది.

Champions Trophy : ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ కప్ విజేతగా భారత్ ముచ్చటగా మూడోసారి విజయం సాధించింది. ఆదివారం దుబాయ్ వేదికగా ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ పై భారత్ నాలుగు వికెట్లతో విజయం సాధించింది. ఫైనల్ లో భారత్ విజయంతో దేశవ్యాప్తంగా అభిమానులు సంబరాలు చేసుకున్నారు. చివరిసారి 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ కప్ గెలిచిన భారత్ పుష్కర కాల విరామం తర్వాత ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ భారత్ వశమైంది. నిరుడు టీ20 వరల్డ్ కప్ను ముద్దాడిన రోహిత్ సేన.. తాజాగా చాంపియన్స్ ట్రోఫీనీ కైవసం చేసుకుంది.
టోర్నీలో అజేయంగా ఫైనల్ చేరిన టీమ్ఇండియా.. ఆదివారం దుబాయ్ వేదికగా జరిగిన స్పిన్ థ్రిల్లర్లో 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ను మట్టికరిపించి ముచ్చటగా మూడోసారి ‘చాంపియన్స్’గా నిలిచింది. ఇదే టోర్నీలో 2000లో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఎదురైన ఓటమికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. భారత్ ఖాతాలో ఇది మూడో 2002, 2013, 2025)ఛాంపియన్స్ ట్రోఫీ.
స్పిన్నర్లు ఆధిపత్యం చెలాయించిన ఈ మ్యాచ్లో భారత్నే విజయం వరించింది. కివీస్ నిర్దేశించిన 252 పరుగుల ఛేదనలో రోహిత్ (83 బంతుల్లో 76, 7 ఫోర్లు, 3 సిక్సర్లు) కెప్టెన్సీ ఇన్నింగ్స్తో చెలరేగగా మిడిలార్డర్లో శ్రేయాస్ అయ్యర్ (62 బంతుల్లో 48, 2 ఫోర్లు, 2 సిక్సర్లు), కేఎల్ రాహుల్ (33 బంతుల్లో 34 నాటౌట్, 1 ఫోర్, 1 సిక్స్), అక్షర్ పటేల్ (40 బంతుల్లో 29, 1 ఫోర్, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్లు ఆడి మెన్ ఇన్ బ్లూను విజేతలుగా నిలబెట్టారు.
అంతకుముందు భారత స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి (2/45), కుల్దీప్ యాదవ్ (2/40), రవీంద్ర జడేజా (1/30), అక్షర్ (0/29) కట్టడి చేయడంతో న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులకే పరిమితమైంది. కివీస్ ఇన్నింగ్స్ లో డారిల్ మిచెల్ (101 బంతుల్లో 63, 3 ఫోర్లు), మైఖేల్ బ్రాస్వెల్ (40 బంతుల్లో 53 నాటౌట్, 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో ఆ జట్టు పోరాడగలిగే స్కోరును సాధించింది. 252 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో నిర్దేశిత 50 ఓవర్లలో మరో ఆరు బంతులు మిగిలి ఉండగానే నాలుగు వికెట్ల తేడాతో టీం ఇండియా విజయం సాధించింది. ఆరు వికెట్లు కోల్పోయి 256 పరుగులు చేసింది. టీమ్ ఇండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ తొలి వికెట్ భాగస్వామ్యానికి 105 పరుగులు జత చేశారు.
రోహిత్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’, రచిన్ ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డులు దక్కాయి. చాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో ఇప్పటి వరకు ఏ జట్టు మూడోసారి టైటిల్ గెలుచుకోలేకపోయింది. ఇక ఈ ఐసీసీ ట్రోఫీ విజేత భారత జట్టుపై కాసుల వర్షం కురిసింది. భారత జట్టు 2.4 మిలియన్ డాలర్ల ప్రైజ్మనీ గెలుచుకుంది. అంటే భారతీయ కరెన్సీలో అక్షరాలా రూ.19.5కోట్లు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ప్రైజ్మనీని గతంలో పోలిస్తే 53శాతం పెంచిన విషయం తెలిసిందే. రన్నరప్గా నిలిచిన న్యూజిలాండ్ జట్టుకు 1.12 మిలియన్ డాలర్ల (రూ.9.72కోట్లు) ప్రైజ్మనీ దక్కింది.
సెమీఫైనల్లో ఎలిమినేట్ అయిన ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లకు రూ.4.86కోట్లు లభించాయి. టోర్నీ మొత్తం ప్రైజ్మనీ 6.9మిలియన్ డాలర్ల (రూ.60కోట్లు) కు పెరిగిందని ఐసీసీ అధ్యక్షుడు జైషా ఒక ప్రకటనలో పెరిగిందని పేర్కొన్నారు. ఇక.. గ్రూప్ దశలో గెలిచిన జట్లకు రూ.30లక్షల ప్రైజ్మనీ లభించనున్నది. ఐదు, ఆరోస్థానంలో నిలిచిన జట్లకు సుమారుగా రూ.3కోట్లు.. ఏడు, ఎనిమిదో స్థానాల్లో నిలిచిన జట్లకు రూ.1.2కోట్ల లభించాయి. అంతేకాకుండా ఐసీసీ టోర్నీలో పాల్గొన్నందుకు ఎనిమిది జట్లకు రూ.1.08కోట్లు దక్కాయి.