AISF ప్రపంచానికి హృదయాన్నిచ్చింది.. కమ్యూనిజమే.. విధాత: హృదయం లేని ప్రపంచానికి హృదయాన్నిచ్చిందీ.. ఆత్మ లేని సమాజానికి ఆత్మను ప్రసాదించిందీ మార్క్సిజమేనని ఏఐఎస్ఎఫ్ ఉమ్మడి నల్లగొండ జిల్లా పూర్వ అధ్యక్షులు కట్టా శేఖర్ రెడ్డి పేర్కొన్నారు. నాగార్జునసాగర్ డ్యాం వద్ద ఏర్పాటు చేసిన ఉమ్మడి నల్లగొండ జిల్లా ఏఐఎస్ఎఫ్ మాజీ విద్యార్థి నాయకుల సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి చైతన్య ఉద్యమాల తాలూకు ఓ ఉద్వేగ భావన మళ్లీ […]
AISF
ప్రపంచానికి హృదయాన్నిచ్చింది.. కమ్యూనిజమే..
విధాత: హృదయం లేని ప్రపంచానికి హృదయాన్నిచ్చిందీ.. ఆత్మ లేని సమాజానికి ఆత్మను ప్రసాదించిందీ మార్క్సిజమేనని ఏఐఎస్ఎఫ్ ఉమ్మడి నల్లగొండ జిల్లా పూర్వ అధ్యక్షులు కట్టా శేఖర్ రెడ్డి పేర్కొన్నారు. నాగార్జునసాగర్ డ్యాం వద్ద ఏర్పాటు చేసిన ఉమ్మడి నల్లగొండ జిల్లా ఏఐఎస్ఎఫ్ మాజీ విద్యార్థి నాయకుల సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి చైతన్య ఉద్యమాల తాలూకు ఓ ఉద్వేగ భావన మళ్లీ తనలో కలుగుతోందన్నారు.
ఏ ప్రవృత్తిలో ఉన్నా.. కమ్యూనిస్టు భావజాలాన్ని మరచిపోలేమని, ఆ శక్తి, ఉత్సాహం అసాధారణమైనవన్నారు. ప్రపంచంలోని ఏ భావజాలమూ సృష్టించలేనంత గొప్ప మార్పును మార్క్సిజం తీసుకొచ్చిందన్నారు. ప్రపంచాన్ని ఎలా చూడాలో.. ఆ కొత్త చూపునిచ్చింది కమ్యూనిజమేనన్నారు. రాజకీయాలు, దోపిడీ, దురంతాలు, అన్యాయాలు.. ఇలాంటివాటన్నింటికీ ఎదురొడ్డి నిలిచే శక్తి కమ్యూనిజం ఇచ్చిందన్నారు. అంతటి బలమైన చరిత్ర ఎర్ర జెండాదేనన్నారు. కామ్రేడ్ ను మించిన స్నేహితుడు ఎక్కడా దొరకడన్నారు. ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా… ‘ఎండి బీటలువారిపోయిన గుండె బంజరు భూమినంతయు మమత జలముల సాగుచేసెడి మహా యంత్రము స్నేహము’ అనే అద్భుతమైన వాక్యాన్ని ఆయన ఉదహరించారు. నియంతృత్వంతో నిండిపోయిన భూస్వామ్య వ్యవస్థను రాను రాను నిర్వీర్యం చేసి మార్క్సిజం అద్భుత విజయాన్ని సాధించిందన్నారు.
ఎప్పుడైనా.. ఎక్కడైనా సరే.. మార్క్సిజానికి అనుకూలంగా మాట్లాడాల్సి వచ్చినప్పుడు భయపడాల్సిన, సిగ్గుపడాల్సిన అవసరం లేదన్నారు. కమ్యూనిజం వచ్చిన తర్వాతనే ప్రభుత్వాలు సంక్షేమ రాజ్యం గురించి మాట్లాడుతున్నాయన్నారు. మార్క్స్ దాస్ క్యాపిటల్ రాసిన తర్వాత పెట్టుబడిదారులు, భూస్వాములకు భయం పట్టుకుందన్నారు. సోషలిస్టు విప్లవ నేపథ్యంలో పౌరులందరికీ సార్వత్రిక ఓటు హక్కును ప్రభుత్వాలు కల్పించాయన్నారు.
కమ్యూనిజం ప్రత్యక్షంగా, పరోక్షంగా సాధించిన విజయాలు అపురూపమైనవన్నారు. మానవాళి వీటినెప్పటికీ మరచిపోలేదన్నారు. కార్మికుడికీ, యజమానికీ గొడవ జరిగితే కార్మికుడి పక్షాన, పెద్దోడికీ, పేదోడికీ తగాదా జరిగితే పేదోడి పక్షాన, బానిసకు, బలవంతుడికీ యుద్ధం జరిగితే బానిస పక్షాన నిలబడేదే కమ్యూనిజమని స్పష్టం చేశారు. వ్యవస్థ అవినీతి అక్రమాలతో కుళ్లిపోతున్నప్పుడు ప్రక్షాళనకు నడుం కట్టేది కమ్యూనిస్టులేనన్నారు.
సమానత్వ సిద్ధాంతానికి ప్రతీక అయిన ఎర్రజెండాకు అందరం నమస్కరించాలని, కమ్యూనిస్టు విలువలతో జీవితాన్ని పరిపూర్ణం చేసుకోవాలని ఆయన యువతకు పిలుపునిచ్చారు. అప్పటి విద్యార్థి సోదరులను కలుసుకున్నందుకు ఆనందంగా ఉందని, మంచి సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఏఐఎస్ఎఫ్ నాయకులకు ధన్యవాదాలు తెలుపుతున్నానని కట్టా శేఖర్ రెడ్డి పేర్కొన్నారు.