కార్యాచరణపై పెదవి విరుస్తున్న విశ్లేషకులు విధాత: తెలంగాణలో ‘పాడిందే పాటరా…’ అనే సామెత ఉన్నది. నిన్న మహబూబ్నగర్లో సీఎం కేసీఆర్ మాట్లాడిన మాటలు విన్న తర్వాత అదే సామెత గుర్తుకొస్తున్నదని అంటున్నారు అది విన్న వారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలు అనుసరిస్తున్నదని, అందుకే మోదీని గద్దె దించాలని కేసీఆర్ గత కన్నాళ్లుగా చెప్తూనే ఉన్నారు. దానికి మద్దతు కావాలని, తాను ఎక్కడికి పోతే అక్కడ ప్రజలను కోరుతున్నారు. కేంద్రానికి నేను పోవల్నా వద్దా అని […]
కార్యాచరణపై పెదవి విరుస్తున్న విశ్లేషకులు
విధాత: తెలంగాణలో ‘పాడిందే పాటరా…’ అనే సామెత ఉన్నది. నిన్న మహబూబ్నగర్లో సీఎం కేసీఆర్ మాట్లాడిన మాటలు విన్న తర్వాత అదే సామెత గుర్తుకొస్తున్నదని అంటున్నారు అది విన్న వారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలు అనుసరిస్తున్నదని, అందుకే మోదీని గద్దె దించాలని కేసీఆర్ గత కన్నాళ్లుగా చెప్తూనే ఉన్నారు. దానికి మద్దతు కావాలని, తాను ఎక్కడికి పోతే అక్కడ ప్రజలను కోరుతున్నారు. కేంద్రానికి నేను పోవల్నా వద్దా అని ప్రజలను ఉద్దేశించి ప్రశ్నించి జవాబు రాబడుతున్నారు. కానీ ఈ తంతంగం ఎంత కాలం..!
ప్రజావ్యతిరేక మోదీ పాలనను అంతం చేయాలంటే.. దేశ వ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేయాలి. అందుకు కేసీఆర్ రాష్ట్ర పార్టీగా ఉన్న టీఆర్ఎస్ను భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా నామకరణం చేసి జాతీయ పార్టీగా మలిచారు. ఎన్నికల కమిషన్లో రిజిష్టర్ కూడా చేశారు. కానీ ఆ దిశగా ఒక్క అడుగు పడిన దాఖలాలు కనిపించటం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
‘నేను లేస్తే.. పరిస్థితి మమూలుగా ఉండదు..’ అనేదొక సామెత ఉన్నది. ఆయన లేసుడుండదు, జరిగేది ఉండదు అనేది ప్రతీతి. కేసీఆర్ కూడా బీఆర్ఎస్ పేరు చెప్పటమే కానీ, దానికి సంబంధించి దేశ వ్యాప్త కార్యాచరణకు పూనుకున్నది ఏమీ లేదు. కనీసం దానికి అవసరమైన ఏర్పాట్లు, సన్నాహాలు కూడా జరగటం లేదు. ఏదో ఒకటి రెండు సార్లు హడావుడి చేసినట్లు కనిపించినా ఆశించిన మేర సన్నాహాలు జరగటం లేదని బీజేపీ వ్యతిరేకంగా ప్రత్యామ్నాయం కోసం ఆలోచిస్తున్నవారు అంటున్నారు.