పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ డబుల్ డిజిట్ సీట్లు గెలవబోతుందని కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు
విధాత, హైదరాబాద్: పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ డబుల్ డిజిట్ సీట్లు గెలవబోతుందని కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోడీ ఈనెల 4, 5 తేదీలలో ఆదిలాబాద్, సంగారెడ్డిలలో అధికారికంగా పర్యటిస్తారన్నారు. ప్రధాని పర్యటనకు ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానాలుంటాయని తెలిపారు.
ప్రధాని రాష్ట్రానికొస్తే.. గవర్నర్, సీఎం, అధికారులు స్వాగతం పలకటం సంప్రదాయమని.. అయితే ఈ సంప్రదాయాన్ని మాజీ సీఎం కేసీఆర్ తుంగలో తొక్కారని మండిపడ్డారు. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ప్రధానికి స్వాగతం పలకాలని కోరుకుంటున్నానని, వస్తారని భావిస్తున్నట్లు తెలిపారు. 4న ప్రధాని మోడీ ఆదిలాబాద్లో 6వేల 600కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి.. బహిరంగ సభలో పాల్గొంటారని చెప్పారు. 5న సంగారెడ్డిలో 9వేల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు.. బహిరంగ సభలో మోదీ ప్రసంగిస్తారన్నారు.
రాజకీయాలకు అతీతంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు పదేళ్లలో లక్షల కోట్ల నిధులు మంజూరీ చేసిందన్నారు. ఘట్కేసర్, లింగంపల్లిల మధ్య ఎంఎంటీఎస్ ట్రైన్ ను మోడీ ప్రారంభిస్తారని తెలిపారు. సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్ను కూడా ప్రారంభిస్తారన్నారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న రక్షణ శాఖ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం బదిలీ చేసిందన్నారు. హైదరాబాద్ -నిజామాబాద్ రూట్, హైదారాబాద్- సిద్దిపేట రూట్ లో 175 ఎకరాల భూములు ఇవ్వనుందని స్పష్టం చేశారు.
మ్యానిఫెస్టో తయారీకి ప్రజల నుంచి సూచనలు
బీజేపీ అభ్యర్థుల జాబితా ఎప్పుడైనా రావొచ్చని కిషన్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణలో మెజార్టీ సీట్లు సాధించేందుకు విజయ సంకల్ప యాత్రలు చేస్తున్నామని తెలిపారు. యాత్రలకు ఫ్రజల నుంచి మంచి స్పందన ఉంటుందని, 10 సంవత్సరాలు గా మోడీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు యాత్రల ద్వారా ప్రజలకు వివరించడం జరుగుతుందని చెప్పారు. అభివృద్ధి చెందిన భారత్ కోసం మ్యానిఫెస్టో తయారీకి ప్రజల నుండి సలహాలు తీసుకోవాలని నిర్ణయించామన్నారు.
దేశంలో ఇంకా పేదరికం ఉంది, మౌలిక వసతులు, విద్యా, వైద్యము లేదన్నారు. 2047 లో దేశం అభివృద్ధి చెందిన దేశంగా ఉండాలనేది బీజేపీ సంకల్పం అన్నారు, గరిబ్ కళ్యాణ్ (G) యూత్ (Y) అగ్రికల్చర్(A) నారి శక్తి(N) ఏజెండాగా, రెండు రకాల మేనిఫెస్టోలు ఒకటి 5 సంవత్సరాల కోసం… రెండోది 25 సంవత్సరాల కోసం పార్టీ రూపొందించబోతుందన్నారు. బీజేపీ ప్రజల చేత స్థాపించబడిందని, ప్రజల కోసం, ప్రజల చేత నడిచే పార్టీ.. బీజేపీ కుటుంబ పార్టీ కాదన్నారు.
ఎవరైన ఆర్థిక సహాయం చేయాలని అనుకుంటే నమో యాప్ ద్వారా చేయండన్నారు. మేడిగడ్డకు అందరి కంటే ముందు తామే వెళ్లామని… మేడిగడ్డపై డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్ట్ సరైనదేనని స్పష్టం చేశారు. డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ను పొలిటికల్ రిపోర్ట్ అంటూ బీఆరెస్ చేసిన కామెంట్స్ను కిషన్రెడ్డి తీవ్రంగా ఖండించారు. కాళేశ్వరం కు ఎన్ని అనుమతులు కేంద్రం ఇచ్చిందో… వేదిరే శ్రీరామ్ ఏమీ చెప్పారో నాకు తెలియదన్నారు.