సరైన ప్రచారం చేసుకోలేదు.. అందుకే ఓడాం
బీఆరెస్ ప్రభుత్వం పనుల మీద కంటే ప్రచారం మీద ఫోకస్ చేసి ఉంటే మనం గెలిచే వాళ్లమని మరోసారి ప్రజాతీర్పును తప్పుబట్టేలా కేటీఆర్ అసహనపు వ్యాఖ్యలు చేశారు

- మన అభివృద్ధి కంటే.. కాంగ్రెసోళ్ల అబద్దాలనే నమ్మారు
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , మాజీ మంత్రి కేటీఆర్
- మహబూబాబాద్ లోక్సభ నియోజవర్గం సన్నాహక సమావేశంలో
- ఓటమిపై కేటీఆర్ మరోసారి అసహన వ్యాఖ్యలు
విధాత, హైద్రాబాద్ : బీఆరెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి.. అమలు చేసిన సంక్షేమ పథకాల కంటే కాంగ్రెసోళ్లు చెప్పిన అబద్ధాలనే ప్రజలు నమ్మడంతో ఎన్నికల్లో మనం ఓడాల్సి వచ్చిందని, పనుల మీద కంటే ప్రచారం మీద ఫోకస్ చేసి ఉంటే మనం గెలిచే వాళ్లమని మరోసారి ప్రజాతీర్పును తప్పుబట్టేలా బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అసహనపు వ్యాఖ్యలు చేశారు. గురువారం మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో కేటీఆర్ ఆ వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికల ఫలితాల అనంతరం నుంచి పార్టీ ఓటమితో అసహనంతో ఉన్న కేటీఆర్ ప్రజాతీర్పును తప్పుబట్టే దోరణితో చేస్తున్నవ్యాఖ్యలపై విపక్షాలు, మేధావి వర్గాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నా ఆయన మాత్రం తన మాటతీరును మార్చుకోకపోవడం పార్టీ శ్రేణులను సైతం విస్మయ పరుస్తుంది. తెలంగాణ భవన్ వేదికగా వరుసగా పార్లమెంటు నియోజకవర్గాల వారిగా కొనసాగుతున్న పార్టీ సన్నాహక సమావేశాల్లోనూ కేటీఆర్ తన ప్రసంగాల్లో పార్టీ ఓటమిపై ప్రజాతీర్పును తప్పుబడుతు.. మా పాలన.. పథకాలు భేష్ అంటూ…ఓటమికి అప్పటి సిటింగ్ ఎమ్మెల్యేల తీరు..ప్రజాఆలోచన సరిగా లేకపోవడం కారణమంటు వరుసగా తన అసహనం వెళ్లగక్కుతునే ఉన్నారు.
గురువారం మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో కేటీఆర్ అదే తీరులో మాట్లాడారు. బీఆరెస్ ప్రభుత్వం వందలాది సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినా, ఏనాడు కూడా ప్రజలను లైన్లలో నిలబెట్టకపోయిన ప్రజలు ఓడించారన్నారు. ప్రజల సౌకర్యమే చూసాము కానీ రాజకీయ ప్రయోజనం, రాజకీయ ప్రచారంల గురించి ఏనాడు ఆలోచించలేదని, అందుకే కాంగ్రెస్ పార్టీ అబద్ధాల ముందు మన అభివృద్ధి ఓడిపోయిందన్నారు. కాంగ్రెసోళ్ల తప్పుడు ప్రచారం నమ్మి ప్రజలు గొప్పగా పని చేసిన మన నాయకులను కూడా తిరస్కరించారన్నారు. ప్రజలు మనకు పదేళ్లు అవకాశం ఇచ్చారన్నారు.
అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనుకోలేదని, నోటికి ఏది వస్తే అది హామి అని చెప్పారన్నారు. ఆరు గ్యారెంటీలు అని చెప్పి 420 హమీలిచ్చిందన్నారు. రేషన్ కార్డులు ఇవ్వలేదు అని ప్రచారం చేశారని, ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదన్నారని, తొమ్మిదిన్నరేళ్లలో బీఆరెస్ ప్రభుత్వం 6,47,479 రేషన్ కార్డులు ఇచ్చిందన్నారు. దేశంలో అత్యధికంగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది మన ప్రభుత్వమనని, అయినా మేము ఏనాడు చెప్పుకోలేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు అత్యధిక వేతనాలు ఇచ్చింది మన ప్రభుత్వం కానీ మేము చెప్పుకోలేదు, ప్రచారం చేస్కోలేదన్నారు.
దేశంలో అందరికన్నా ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగులకు 73% జీతాలు పెంచిన ఏకైక నాయకుడు కేసీఆర్ అని, 29 లక్షల ఫించన్లను 46 లక్షలకు పెంచినా ఏనాడు చెప్పుకోలేదన్నారు. ఇలాంటి అనేక అంశాలను చెప్పుకోవడంలో విఫలమవ్వడంతో ఎన్నికల్లో ఓటమి చెందామన్నారు. అయినప్పటికి ప్రజలు మనల్ని పూర్తిగా తిరస్కరించలేదని గుర్తుంచుకోవాలన్నారు. బీఆరెస్ పార్టీకి మూడో వంతు సీట్లు 39 వచ్చాయని, 14 స్థానాల్లో కేవలం గరిష్టంగా 6 వేల ఓట్లతోనే ఓడామన్నారు. మొత్తంగా కాంగ్రెస్కు బీఆరెస్కు మధ్య ఓట్ల తేడా కేవలం 1.85 శాతం మాత్రమేనన్నారు.
స్థానిక సంస్ధల నుంచి మొదలుకోని, అసెంబ్లీదాకా బలమైన నాయకత్వం మనకున్నదని, బలమైన ప్రతిపక్షం మనదన్నారు. అన్నిటికీ మించి కేసీఆర్ లాంటి గొప్ప నాయకుడు మనకున్నారని, పార్లమెంటు ఎన్నికలతో పాటు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో భారీ విజయాల దిశగా ధైర్యంగా ముందుకెళ్లాలన్నారు. మహబూబ్ బాద్ పార్లమెంట్ ఎన్నికలే మన గెలుపుకు సోపానం కావాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన అడ్డగోలు హామీలను అమలు చేసే దారిలేకనే అప్పులు, శ్వేతపత్రాల నాటకాలను ఆడుతుందన్నారు. అందుకే వాస్తవాలు అందరికీ తెలియాలనే స్వేద పత్రం రూపొందించామన్నారు.
ఎన్నికల ముందు రైతు రుణమాఫీ చేస్తామంటూ రేవంత్ రెడ్డి అనేక మాటలు మాట్లాడారని, రుణం ఉన్నవాళ్లే కాదు, వ్యవసాయ రుణం లేనివాళ్లు కూడా తీసుకోండి, రాగానే వెంటనే రుణమాఫీ చేస్తామన్నారన్నారు. గిరిజనులకు స్థానిక సంస్థల రిజర్వేషన్ తో పాటు పొడు భూముల పట్టాల పంపిణీ, అనేక ఇతర సంక్షేమ పథకాలు అనేక కార్యక్రమాలను మన ప్రభుత్వం గతంలో అందించిందన్నారు. అయినా గిరిజనం ఎక్కువ ఉన్న చోట్ల కూడా ప్రజలు పూర్తి మద్దతు మనకివ్వలేదని, ఇలాంటి వాటన్నింటిపై ఆత్మవిమర్శ చేసుకుని ముందుకుపోతామన్నారు. ఎవరు నిరుత్సాహ పడాల్సిన అవసరం లేదని, మన పార్టీకి బలమైన నాయకులు అద్భుతమైన నాయకత్వం ఉందన్నారు.
ఇలాంటి పార్టీ సమావేశాలను వరుసగా పెట్టుకుంటామని, అనుబంధ సంఘాలను బలోపేతం చేస్తామని, పార్టీకి అన్ని వర్గాలను దగ్గరయ్యేలా కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు టి.హరీశ్రావు, కడియం శ్రీహరి, వేముల ప్రశాంత్రెడ్డి, సత్యవతి రాథోడ్, పోచారం శ్రీనివాస్రెడ్డి, ఎంపీ కవిత, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, మేయర్లు, మాజీ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, మాజీ మున్సిపల్ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, నియోజకవర్గాల ఇన్చార్జీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు పాల్గొన్నారు.