రక్షణ భూముల కేటాయింపులకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు
83 ఎకరాల భూముల కేటాయింపు
హైదరాబాద్, రామగుండం, నాగపూర్ హైవేకు రూట్ క్లియర్
ఉత్తర తెలంగాణకు రవాణా సదుపాయాల విస్తరణ
కేంద్ర రక్షణ శాఖ మంత్రికి సీఎం రేవంత్రెడ్డి కృతజ్ఞతలు
హైదరాబాద్ : హైదరాబాద్ నుంచి ఉత్తర తెలంగాణ దిశగా రవాణా మార్గాల అభివృద్ధికి మార్గం సుగమమైంది. అటు నిజామాబాద్, ఆదిలాబాద్, ఇటు కరీంనగర్ రామగుండం వెళ్లేందుకు సికింద్రాబాద్ ఏరియాలోని అత్యంత ఇబ్బందికరంగా మారిన ట్రాఫిక్ సమస్య తొలిగిపోనుంది. హైదరాబాద్ నుంచి శామీర్పేట, హైదరాబాద్ నుంచి కండ్లకోయ వరకు ఎలివేటేడ్ కారిడార్ల నిర్మాణంతో గ్రేటర్ సిటీ ఉత్తర దిశగా అభివృద్ది పరుగులు తీయనుంది. జాతీయ రహదారుల విస్తరణకు రక్షణ శాఖ భూముల అడ్డంకులు తొలిగిపోయాయి. హైదరాబాద్ – కరీంనగర్ రాజీవ్ రహదారితోపాటు హైదరాబాద్– నాగపూర్ జాతీయ రహదారిపై ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్ర రక్షణ శాఖ అనుమతి ఇచ్చింది. హైదరాబాద్లోని డిఫెన్స్ భూముల మీదుగా ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి లైన్ క్లియర్ అయింది. జనవరి 5వ తేదీన ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ను కలిసి, డిఫెన్స్ భూముల మీదుగా ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి అనుమతించాలని లేఖను అందించారు. స్పందించిన కేంద్ర ప్రభుత్వం ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి శుక్రవారం ఉదయం అనుమతులు జారీ చేసింది. హైదరాబాద్ నగర అభివృద్ధికి అత్యంత కీలకమైన కారిడార్ల నిర్మాణానికి అనుమతించినందుకు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్రమోదీకి, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, రక్షణ శాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
83 ఎకరాల భూముల కేటాయింపు
హైదరాబాద్ నుంచి కరీంనగర్-రామగుండాన్ని కలిపే రాజీవ్ రహదారిలో ప్యారడైజ్ జంక్షన్ నుంచి అవుటర్ రింగు రోడ్డు జంక్షన్ వరకు ఆరు లేన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం, ఎంట్రీ, ఎగ్జిట్ ర్యాంపుల నిర్మాణానికి మొత్తంగా 11.30 కిలోమీటర్ల కారిడార్ నిర్మాణానికి 83 ఎకరాల భూమి అవసరమని రక్షణ శాఖ మంత్రికి విజ్ఙప్తి చేశారు. నాగపూర్ హైవే (ఎన్హెచ్-44)పై కండ్లకోయ సమీపంలోని ప్యారడైజ్ జంక్షన్ నుంచి అవుటర్ రింగ్ రోడ్డు వరకు ఎలివేటెడ్ కారిడార్ మొత్తంగా 18.30 కిలోమీటర్ల మేర ప్రతిపాదించామని, అందులో 12.68 కిలోమీటర్ల మేర ఆరు లేన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి, నాలుగు ప్రాంతాల్లో ఎగ్జిట్, ఎంట్రీలకు, భవిష్యత్తులో డబుల్ డెక్కర్ (మెట్రో కోసం) కారిడార్, ఇతర నిర్మాణాలకు మొత్తంగా 56 ఎకరాల రక్షణ శాఖ భూములు బదిలీ చేయాలని రక్షణ శాఖ మంత్రికి ముఖ్యమంత్రి విజ్ఙప్తి చేశారు.
ఉత్తర తెలంగాణ దిశగా రవాణా మార్గాల అభివృద్ధి
గత ప్రభుత్వం కేంద్రంతో అనుసరించిన అహంకార పూరిత వైఖరితోనే ఏళ్లకేళ్లుగా ఎలివేటెడ్ కారిడార్ల అనుమతి ప్రక్రియ నిలిచిపోయింది. ఎనిమిదేండ్లుగా అపరిష్కృతంగా ఉన్న ఈ సమస్యకు పరిష్కారం లభించటం పట్ల ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. కేవలం 80 రోజుల కొత్త ప్రభుత్వం ఈ అనుమతులు సాధించటం తమ చిత్తశుద్ధిని చాటిందని చెప్పారు. ఢిల్లీకి వెళ్లినప్పుడల్లా తెలంగాణ రాష్టానికి సాధించుకోవాల్సిన అవసరాల కోసం కేంద్ర మంత్రులను కలిసి లేఖలు అందించిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరినైనా ఎన్నిసార్లైనా కలిసేందుకు తాము సిద్దంగా ఉన్నామని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో సన్నిహిత, స్నేహ సంబంధాలను కొనసాగిస్తామని చెప్పారు. రాజకీయ వైషమ్యాలు, పార్టీల సిద్ధాంతాలేవైనా తెలంగాణ ప్రాంత ప్రయోజనాలే తమకు అత్యంత ప్రాధాన్యమని ముఖ్యమంత్రి మరోసారి స్పష్టం చేశారు. కేంద్ర రక్షణ శాఖ సూచనల మేరకు త్వరలోనే ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణాలు తలపెడుతామని తెలిపారు.