Mahaboobnagar - కృష్ణానది నీటి మధ్య లో గుర్రంగడ్డ గ్రామం - నది పారితే ఇతర ప్రాంతాలకు సంబంధం కట్ - ఎక్కడకు వెళ్లాలన్నా పుట్టే రవాణా సాధనం - నేతల వాగ్దానాలకే పరిమితమైన బ్రిడ్జి నిర్మాణం - తెలంగాణ రాష్ట్రం వచ్చినా మారని బతుకులు విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రం సిద్ధించి తొమ్మిది సంవత్సరాలు గడిచినా కొన్ని ప్రాంతాల ప్రజలు కనీస అవసరాలకు నోచుకోని దౌర్భాగ్యం నెలకొంది. గద్దె […]
Mahaboobnagar
– కృష్ణానది నీటి మధ్య లో గుర్రంగడ్డ గ్రామం
– నది పారితే ఇతర ప్రాంతాలకు సంబంధం కట్
– ఎక్కడకు వెళ్లాలన్నా పుట్టే రవాణా సాధనం
– నేతల వాగ్దానాలకే పరిమితమైన బ్రిడ్జి నిర్మాణం
– తెలంగాణ రాష్ట్రం వచ్చినా మారని బతుకులు
విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రం సిద్ధించి తొమ్మిది సంవత్సరాలు గడిచినా కొన్ని ప్రాంతాల ప్రజలు కనీస అవసరాలకు నోచుకోని దౌర్భాగ్యం నెలకొంది. గద్దె ఎక్కక ముందు నేతలు ఇచ్చిన వాగ్దానాలు నీటి లో కొట్టుకుపోతున్నాయి. ఏళ్ల తరబడి ఇచ్చిన వాగ్దానాలకు రూపం రావడం లేదు. ఇదే కోవలోకి గుర్రంగడ్డ గ్రామం కూడా వస్తుంది. వర్షాకాలంలో ఈ గ్రామంలో ఎవరిని కదిలించినా కన్నీళ్ల తోనే సమాధానం చెప్తారు. వారి బాధ విన్న వారేవరైనా కన్నీళ్లు పెట్టక మానరు. అక్కడి ప్రజల ఆవేదన అలాంటిది.
వివరాల్లోకి వెళితే.. జోగులాంబ గద్వాల జిల్లా పరిధి లోని కృష్ణానది మధ్యలో గుర్రం గడ్డ గ్రామం ఉంది. ఈ ఊరికి వెళ్ళాలంటే పుట్టే ముఖ్య రవాణా సాధనం. హైదరాబాద్ – కర్నూల్ 44 జాతీయ రహదారి కి సమీపంలో ఉన్న ఈ గ్రామానికి వెళ్లాలంటే పుట్టిని పట్టుకోవాల్సిందే. గ్రామానికి వెళ్లేందుకు దారులు లేకపోవడంతో ఇతర ప్రాంతాలకు వెళ్ళేందుకు పుట్టి ప్రయాణమే దిక్కు. 2500 ఎకరాల్లో విస్తరించుకున్న ఈ గ్రామంలో జనాభా మాత్రం వేయిలోపే. కృష్ణానది మధ్యలో గ్రామం ఉండడంతో వర్షాకాలంలో నదిలోకి నీరు వస్తే గ్రామం చుట్టూ పారుతుంది. ఈ కాలంలో గ్రామస్థులకు ఇతర ప్రాంతాలతో సంబంధం తెగి పోతుంది. అధికంగా వ్యవసాయం పైనే ఆధారపడ్డ కుటుంబాలు జీవిస్తుండడంతో వర్షకాలంలో తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారు. ఎరువులు కొనాలన్నా, తమ పిల్లలను బడికి పంపాలన్నా పుట్టి లో నదిని దాటాల్సిందే. పిల్లలని బడికి పంపిన తరువాత సాయంత్రం క్షేమంగా ఇంటికి వచ్చే వరకు తల్లిదండ్రులు ఎదురుచూస్తూనే ఉంటారు.
గ్రామానికి పిల్లను ఇవ్వాలన్నా… తెచ్చుకోవాలన్న ఎవ్వరూ ఆసక్తి చూపరు. ఈ పరిస్థితి రావడంతో 40 ఏళ్లు దాటిన అమ్మాయిలు, అబ్భాయిలు పెళ్లి కాకుండా ఉన్నారు. ఈ విషయం తల్లిదండ్రులను అడిగితే గుర్రం గడ్డ కు పిల్లను ఇవ్వాలంటే ఇతర ప్రాంతాల వారు ఇష్టపడరని ఆవేదన చెందుతారు. పెళ్లిళ్ళు కాకుండానే ఇక్కడి వారి బతుకులు తెల్లారి పోయాయని కన్నీళ్లు పెట్టుకుంటారు. గ్రామానికి రావడానికి పుట్టి ప్రయాణం తప్పా మరెటువంటి దారి లేదని వాపోతుంటారు. నది పారుతున్న సమయంలో గ్రామం లోకి పాములు, మోసళ్ళు వస్తాయని, వాటి నుంచి తీవ్ర ఇబ్బందు ఎదుర్కోంటామని, పాములు కరిస్తే వైద్య సదుపాయం కోసం పుట్టి లోనే వెళ్లాలని, ఒకవేళ పుట్టి సమయానికి లేకుంటే ప్రాణాలు పోతాయని ఆవేదన చెందుతున్నారు. గర్భిణీనులు కాన్పు కోసం ఆసుపత్రి కి వెళ్ళాంటే నానా తంటాలు పడతారని, సకాలంలో వైద్యం అందక పసికందులు పురిటి లోనే ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఇక్కడ కోకొల్లలు. ఇక్కడ వైద్యం దొరకాలంటే ఆర్ఎంపీ ఇచ్చే వైద్యమే దిక్కు.
ఇక్కడకు ప్రభుత్వ వైద్యం అందని ద్రాక్షలా ఉంది. పండించిన పంటలు మార్కెట్ కు తరలించాలంటే నది లో నీరు లేకుండా పోవాలి. ఏళ్ల తరబడి మా గోడు వినే వారే తప్పా తీర్చే నాథుడే లేరని బాధ పడుతున్నారు. కొన్నేళ్ల నుంచి గ్రామానికి వెళ్లేందుకు కృష్ణానది పై వంతెన నిర్మిస్తామని నేతలు ఇచ్చిన హామీలు నేటికీ నెరవేరలేదు. వంతెన నిర్మాణ పనులు చేపట్టి నప్పటికీ ఏళ్ల తరబడి పనులు సాగుతూనేవున్నాయి. అది ఎప్పటికి పూర్తి అవుతుందో నని గ్రామస్తులు ఎదురుచూస్తున్నారు. త్వరగా వంతెన నిర్మాణం పూర్తి అయితే చీకట్లో ఉన్న గుర్రంగడ్డ వెలుగులోకి వస్తుంది. అది ఎప్పుడు పూర్తి అవుతుందో.. మా బతుకులు ఎప్పుడు బాగుపడతాయోనని గుర్రంగడ్డ వాసులు వాపోతున్నారు.