బీఆరెస్ ఫ్లోర్ లీడర్ పదవి ఇవ్వకపోతే మాజీ మంత్రి టీ.హరీశ్రావు బీజేపీలోకి వెలుతారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు
విధాత, హైదరాబాద్: బీఆరెస్ ఫ్లోర్ లీడర్ పదవి ఇవ్వకపోతే మాజీ మంత్రి టీ.హరీశ్రావు బీజేపీలోకి వెలుతారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియా చిట్చాట్లో మాట్లాడిన వెంకట్రెడ్డి ఒకటవ తేదీనే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల చెల్లింపుపై మాజీ మంత్రి టి. హరీశ్ రావుపై చేసిన విమర్శలపై ఘాటుగా స్పందించారు. ఉనికి కోసం, బీఆరెస్లో తన ఆధిపత్యం కోసం హరీశ్రావు తమ ప్రభుత్వంపై ఏదో విమర్శలు చేస్తున్నారన్నారు.
కేటీఆర్ మాదిరిగా తండ్రి పేరుతో నేను రాజకీయాల్లోకి రాలేదని ఉద్యమాలు చేసి వచ్చానన్నారు. కేటీఆర్ ఇప్పటికీ తండ్రి కేసీఆర్ చాటు కొడుకే అని సెటైర్ వేశారు. మేం జీరో బిల్ ఇచ్చినట్లుగా కేటీఆర్ కి జీరో నాలెడ్జ్ ఉందని ఎద్దేవా చేశారు. నాలెడ్జ్ లేని కేటీఆర్ గురించి మాట్లాడటం వృథా అని, కాళేశ్వరం కట్టించిన చీఫ్ డిజైనర్ కేసీఆర్ మేడిగడ్డకు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. మేడిగడ్డ కుంగిపోయేందుకు కారణమైన వాళ్లే అక్కడికి వెళ్లి మాపై విమర్శలు చేయడం విడ్డూరమన్నారు.
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల ఎంపికపై పార్టీలో అంతర్గత సర్వే కొనసాగుతుందని, తెలంగాణలో మెజార్టీ సీట్లు కాంగ్రెస్ గెలుస్తుందన్నారు. దక్షిణాది రాష్ట్రాలలో కాంగ్రెస్ హవా పార్లమెంటు ఎన్నికల్లో సాగబోతుందన్నాని ఆశాభావం వ్యక్తం చేశారు. భువనగిరి నుంచి రాహుల్గాంధీని పోటీ చేయమని కోరుతున్నామని, అప్పుడు మోడీ కంటే ఎక్కువ ఓట్లతో గెలుస్తాడన్నారు. భువనగిరి, ఖమ్మం, నల్లగొండ సీట్లలో కాంగ్రెస్ దక్షిణాదిలోనే అత్యధిక మెజార్టీతో గెలిచే స్థానాలని జోస్యం చెప్పారు.