చెరువుల్లో పూడిక తొలగింపుకు ఆదేశాలు..చెక్ డ్యామ్ల నిర్మాణాలకు గ్రీన్ సిగ్నల్
రానున్న వర్షాకాలానికి ముందే రాష్ట్ర వ్యాప్తంగా చెరువులో పూడిక తొలగింపుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని మంత్రి ఎన్. ఉత్తమ్కుమార్రెడ్డి అధికారులను ఆదేశించారు

- తాగునీటి ఎద్దడి నివారణకు నిధులు
- ఇరిగేషన్ మంత్రి ఎన్. ఉత్తమ్కుమార్రెడ్డి
విధాత : రానున్న వర్షాకాలానికి ముందే రాష్ట్ర వ్యాప్తంగా చెరువులో పూడిక తొలగింపుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్కుమార్రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం సచివాలయంలో ఇరిగేషన్ సహా పలు శాఖల అధికారులతో పాటు హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అవసరం ఉన్న చోట్ల చెక్ డ్యామ్లలు నిర్మాణానికి ప్రతిపాదనలు అదించాలని సూచించారు. ఇక హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అక్కడి అధికారులను ఆదేశించారు. 6 కోట్ల 24 లక్షలతో హుజూర్ నగర్, కోదాడ ఏరియా ఆసుపత్రుల్లో సిటీ స్కానింగ్ మిషన్లు మంజూరు చేసినట్లు తెలిపారు. హుజూర్ నగర్ ఏరియా ఆసుపత్రిలో నూతన వైద్య పరికరాలకు రూ 25లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. హుజూర్ నగర్ లో 37 కోట్లతో ఐటీఐ కళాశాల మంజూరు చేశామని, నిర్మాణం కోసం 5నుండి 10 ఎకరాల స్థలం అవసరమని, రెవెన్యూ అధికారులు అనువైన స్థలం గుర్తించాలని సూచించారు.
హుజూర్ నగర్, కోదాడలలో మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ మంజూరుకు కృషి చేస్తున్నామని, ఇందుకు ఒక్కో స్కూల్ నిర్మాణానికి 20 ఎకరాల స్థలం అవసరమని, స్థల సేకరణ పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఆ రెండు నియోజకవర్గాలలో కొత్తగా ఏర్పాటైన మండలాలకు స్వంత పరిపాలన భవనాలను మంజూరుకు చర్యలు తీసుకుంటున్నామని, రెడ్ల కుంట వద్ద చెక్ డ్యాం నిర్మాణంకు ప్రతిపాదనలు చేసినట్లు వెల్లడించారు.
తాగునీటి ఎద్దడి నివారణకు నిధులు
రెండు నియోజక వర్గాలలో ఈ వేసవిలో మంచి నీటి ఎద్దడి నివారణకు ఎస్డీఎఫ్, డీఎంఎఫ్టీ, 15వ ఆర్థిక సంఘం నిధులతో మంజూరైన పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. పులిచింతల బ్యాక్ వాటర్ తగ్గితే అందుకు అనుగుణంగా పైప్ లైన్లు లోపలికి తీసుకెళ్ళి పూర్తి స్థాయిలో సాగు, త్రాగు నీటిని వినియోగంలోకి తేవాలన్నారు. అదే విదంగా ఆర్ఆండ్బీ , పంచాయతీ రాజ్, డీఎంఫ్టీ, ఎన్ఆర్ఈజీఎస్, ఎస్డీఎఫ్ నిధులతో మంజూరైన రోడ్లు, డ్రైన్లు, బ్రిడ్జిలు, పాఠశాలల్లో మౌలిక సదుపాయాల పనులను తక్షణమే పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
మోతె మండలానికి పూర్తి స్థాయిలో సాగు నీరు అందించే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలిపారు. స్థానిక నాయకుల విజ్ఞప్తి మేరకు హుజూర్ నగర్ లో మండల పరిషత్ కార్యాలయం ముందు బీవోటీ పద్ధతిలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి కృషి చేస్తున్నామని చెప్పారు. కాగా మోతె, నడిగూడెం, మునగాలలకు ప్రత్యేక వ్యవసాయ మార్కెట్ ఏర్పాటు చేయాలని, అనంతగిరి హై స్కూల్ శిథిలావస్థకు చేరిందని , కొత్త భవనం నిర్మించాలని, హుజూర్ నగర్ పోలీస్ సర్కిల్ కార్యాలయం శిధిలా వస్తకు చేరిందని మరమత్తులు చేపట్టాలని స్థానిక నాయకులు మంత్రిని కోరారు. రాష్ట్ర కాంగ్రెస్ పాలసీ ప్రకారం ఇతర పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలో చేరికలు ముమ్మరం చేయాలని, చేరికలను స్థానికంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు వ్యతిరేకించ వద్దని హుజూర్ నగర్, కోదాడ నియోజక వర్గాల బ్లాక్, మండల, టౌన్ అధ్యక్షులకు మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. పార్టీ పదవులలో, నామినేటెడ్ పదవులలో, స్థానిక సంస్థల ఎన్నికల పదవులలో పార్టీ లో మొదటి నుండి ఉండి కష్టపడి పనిచేసిన వారికి మొదట ప్రాధాన్యత ఉంటుందని తెలియ జేశారు. స్థానిక నాయకులు పైరవీలు కాకుండా స్థానికంగా ఉన్న మౌలిక సమస్యలు నా దృష్టికి తీసుకు రావాలని కోరారు.