Miss World 2024 | చెక్ రిపబ్లిక్‌ అందగత్తెకే మిస్‌ వరల్డ్ కిరీటం.. 8వ స్థానంతో సరిపెట్టుకున్న భారత భామ

Miss World 2024 | చెక్ రిపబ్లిక్‌ అందగత్తెకే మిస్‌ వరల్డ్ కిరీటం.. 8వ స్థానంతో సరిపెట్టుకున్న భారత భామ

Miss World 2024: చెక్‌ రిపబ్లిక్‌ భామకు మిస్‌ వరల్డ్‌-2024 కిరీటం దక్కింది. ఆ దేశం నుంచి ప్రాతినిథ్యం వహించిన క్రిస్టినా పిస్కోవా (Krystyna Pyszkova) మిస్‌ వరల్డ్‌ కిరీటాన్ని ఎగురేసుకుపోయింది. మహారాష్ట్ర రాజధాని ముంబై వేదికగా అట్టహాసంగా జరిగిన ఈ వేడుకలో 112 దేశాలకు చెందిన అందాల భామలు పోటీ పడ్డారు.

చెక్‌ రిపబ్లిక్‌కు చెందిన క్రిస్టినా పిస్కోవా, లెబనాన్‌కు చెందిన యాస్మిన్‌ అజైటౌన్‌, ట్రినిడాడ్‌ అండ్‌ టుబాగోకు చెందిన అచే అబ్రహాంస్‌, బోట్స్వానాకు చెందిన లీసాగో చోంబో టాప్‌-4లో నిలిచారు. చివరి వరకూ ఉత్కంఠగా సాగిన ఈ పోటీల్లో మిస్‌ వరల్డ్‌ కిరీటం క్రిస్టినాకు దక్కింది. లెబనాన్‌కు చెందిన అజైటౌన్‌ రన్నరప్‌గా నిలిచారు.

టాప్‌-8లో సినీశెట్టి

అయితే, ఎన్నో అంచనాల మధ్య పోటీలో నిలిచిన భారత్‌కు ఈ ప్రపంచ సుందరి పోటీల్లో నిరాశే ఎదురైంది. దేశం నుంచి ప్రాతినిథ్యం వహించిన కన్నడ భామ సినీశెట్టి టాప్‌-8కు పరిమితమయ్యారు. ఇతర దేశాల అందాల భామలకు గట్టి పోటీ ఇచ్చినా చివరికి సినీశెట్టి 8వ స్థానంతో సరిపెట్టుకుంది. కాగా, ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన నీతా అంబానీ మిస్‌ వరల్డ్‌ హ్యుమానిటేరియన్‌ అవార్డును అందుకున్నారు. మిస్‌ వరల్డ్‌ ఆర్గనైజేషన్‌ ఛైర్‌ ఉమెన్‌ జూలియా మోర్లీ ఈ అవార్డును అందజేశారు.