అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చెప్పినట్లుగా రైతుల 2లక్షల పంట రుణాలను ఏకకాలంలో మాఫీ చేస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని మాజీ మంత్రి, బీజేపీ
విధాత : అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చెప్పినట్లుగా రైతుల 2లక్షల పంట రుణాలను ఏకకాలంలో మాఫీ చేస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని మాజీ మంత్రి, బీజేపీ మల్కాజ్గిరి అభ్యర్థి ఈటల రాజేందర్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం వార్డు సభలలో ఈటల మాట్లాడారు. 2 లక్షల రైతు రుణమాఫీని ఒకేసారి అమలు చేస్తే రాజకీయాల నుండి తప్పుకుంటానని, దీనిపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని ప్రకటించారు.
గత బీఆరెస్ ప్రభుత్వం మహిళలకు నెల రూ. 2 వేల పెన్షన్ సరిగ్గా ఇవ్వలేకపోయిందని.. ఒక్కొ నెల అసలు పెన్షన్ ఇవ్వలేదన్నారు. అలాంటిది మహిళలకు నెలకు రూ.2500 ఆర్థిక సహాయం చేస్తామని, పింఛన్లు 4వేలు ఇస్తమని అమలు చేయలేని హామీలతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని మండిపడ్డారు. రాష్ట్రంలో దాదాపు కోటిన్నర మంది మహిళలు 2,500ఇవ్వాల్సివుంటుందని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అందుకు అనుకూలంగా లేదన్నారు. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం భారత దేశం దీర్ఘకాలికంగా ఎదుర్కోంటున్న సమస్యలన్నింటిని పరిష్కరిస్తూ అవినీతి లేని, సుస్థిరమైన పాలన అందిస్తుందన్నారు.
రామ మందిర నిర్మాణం చేసిందని, ఆర్టికల్ 370, ట్రిఫుల్ తలాక్ రద్దు చేసిందని, కామన్ సివిల్ కోడ్ అమల్లోకి తెచ్చిందని, మహిళలకు 33శాతం రిజర్వేషన్ల చట్టం చేసిందన్నారు. రహదారులు, గ్యాస్ కనెక్షన్లు, డిజిటల్ బ్యాంకింగ్, రైతులకు, మహిళలకు మౌలిక వసతుల కల్పన వంటి ఎన్నో సౌకర్యాలు మెరుగుపడ్డాయన్నారు. మరోసారి కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రపంచలో భారత్ను అతిపెద్ద ఆర్ధిక శక్తికగా నిలిపే ప్రయత్నం చేస్తారని, ఇందుకు మల్కాజ్ గిరి ప్రజలు కూడా బీజేపీ ఎంపీగా తనను గెలిపించి మోదీకి మద్దతునివ్వాలని కోరారు.