రైతు సంక్షేమానికి సాగుతాగునీటి రంగాల నిర్వాహణకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక ప్రణాళిక అంటూ ఏమీ లేదని, అందుకే కాంగ్రెస్ పాలనలో కరవు పరిస్థితులు నెలకొన్నాయని ఎమ్మెల్యే జి.జగదీశ్రెడ్డి ఆరోపించారు
విధాత: రైతు సంక్షేమానికి సాగుతాగునీటి రంగాల నిర్వాహణకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక ప్రణాళిక అంటూ ఏమీ లేదని, అందుకే కాంగ్రెస్ పాలనలో కరవు పరిస్థితులు నెలకొన్నాయని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జి.జగదీశ్రెడ్డి ఆరోపించారు. తుంగతుర్తి మండలం వెలుగు పల్లి, మొండి కుంట తండా , గ్రామంలో ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించి.. రైతుల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జగదీశ్రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయంపై, ప్రాజెక్టులపై, నీళ్లపై ఈ ప్రభుత్వానికి కనీస అవగాహన లేదని విమర్శించారు. ఎస్సారెస్పీ కింద కాళేశ్వరం నీళ్లతో గత నాలుగేళ్లుగా వరుసగా రెండు పంటలకు నీళ్లు ఇచ్చిన ఘనత బీఆరెస్ పార్టీదేనన్నారు.
అప్పుడు నీళ్లు అందిస్తుంటే ఇవి కాళేశ్వరం నీళ్లు కావు అని కాంగ్రెస్ నాయకులు రాద్ధాంతం చేశారని, మరి ఇప్పుడు వాళ్లు ఎందుకు నీళ్లు ఇవ్వడం లేదని, .కాళేశ్వరం నీళ్లు ఎటు పోయాయని మేము ప్రశ్నిస్తున్నామన్నారు. ఎస్సారెస్పీ కింద నీళ్లు ఇస్తాం పంటలు వేసుకోండని చెప్పి మరి ప్రభుత్వం రైతులను నిలువునా మోసం చేసిందని విమర్శించారు. నేడు సూర్యాపేట తుంగతుర్తి నియోజకవర్గంలో ఎక్కడ చూసినా ఎండిపోయిన పంట పొలాలే దర్శనమిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నీళ్లు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు నమ్మిన రైతులు కోట్ల రూపాయల అప్పుల్లో కురుకుపోయారని, ఆయినా ప్రభుత్వానికి సోయిలేదన్నారు.
ఇది కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువు అని జగదీశ్రెడ్డి ఆరోపించారు. గ్రామాల్లో మంచినీటి సమస్య కూడా ఉత్పన్నమైందని, అయినా ప్రభుత్వం వద్ద ఎలాంటి ప్రణాళిక లేదన్నారు. సాగునీటి కొరత, అకాల వర్షాలతో పంటలు ఎండిపోయి, దెబ్బతిన్న రైతులను పరమార్శించేందుకు మంత్రులు మొఖం చాటేశారని, ఎండిన పొలాల వద్దకు పోవడం లేదని, రేవంత్ బూట్లు తుడుస్తున్నారని జగదీశ్రెడ్డి విమర్శించారు. కోమటిరెడ్డి లాంటి చిల్లర నాయకుడుకి కేసీఆర్ను విమర్శించే స్థాయి లేదన్నారు. పాలకులు చేసిన పాపం వల్లనే రైతుల పొలాలు ఎండిపోయాయన్నారు.
రైతుల తరఫున పేగులు తేగేదాక దాక కొట్లాడుతామని, ప్రభుత్వం మెడలు వంచి నష్టపరిహారం అందించేంతవరకు మా పోరాటం ఆగదన్నారు. ఈ సమయంలో కూడా కాళేశ్వరంలో నీళ్లు ఎత్తి పోసి నీళ్లు అందించే అవకాశం వున్నా కావాలని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని మండిపడ్డారు. కేసీఆర్ పై కోపంతో రైతులను ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. మేము గత పది రోజులుగా అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నామని, ఎక్కడికి వెళ్లినా రైతులు ఎండిన పంటలతో బోరున విలపిస్తున్నారని, చెరువులన్ని ఎండిపోయి కనీసం పశుపక్షాదులకు కూడా తాగునీరు దొరకడం లేదని జగదీశ్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.