MLA Seetakka
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: మోదాని మెప్పు కోసం.. పాత గురువు కేసీఆర్ గెలుపు కోసం బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క(MLA Seetakka) తీవ్రంగా విమర్శించారు.
ములుగు జిల్లా కాశీందేవిపేటలో ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీపై ఈటెల బురద జల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్తో రేవంత్ రెడ్డి రాజకీయ యుద్ధాన్ని కొనసాగించేటప్పుడు ఈటల ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. అప్పుడు కేసీఆర్ పంచన ఉన్నాడని గుర్తు చేశారు.
రేవంత్ రెడ్డి సవాల్ను స్వీకరించి భాగ్య లక్ష్మి దేవాలయానికి రావడానికి భయమెందుకని ప్రశ్నించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో రేవంత్ రెడ్డి రూ.25 కోట్లు తీసుకున్నట్లు చేసిన ఆరోపణలు అవాస్తవమని సీతక్క(MLA Seetakka) అన్నారు.
బిజెపిలోకి పోయినా రాజేందర్ బుద్ది మారలేదని, కొట్లాడే రేవంత్ రెడ్డిపై బురదజల్లడం మంచిది కాదని హితవు పలికారు. కేసీఆర్ కేసులు పెట్టి, జైల్లో పెట్టినా కొట్లాడుతున్న రేవంత్ రెడ్డిపైన ఈటల వ్యాఖ్యలు మంచిది కాదన్నారు.
గుర్తింపు కోసం, కుర్చీ కోసం కక్కుర్తిపడి అబద్దపు ప్రచారం చేస్తున్న ఈటలకు ప్రజలు బుద్ది చెప్పడం ఖాయమన్నారు. కెసిఆర్ పాలన పై, బిజెపి ప్రభుత్వంపై మా పోరాటాలు ఉంటాయని సీతక్క(MLA Seetakka) అన్నారు. కార్యక్రమంలో కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గొల్ల పెల్లి రాజేందర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవి చందర్ తదితరులు పాల్గొన్నారు.