మేడిగడ్డ, అన్నారంలో నేషనల్ డ్యాం సెఫ్టీ ఆథార్టీ పరిశీలనలు

నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నేతృత్వంలోని నిపుణుల బృందం మంగళవారం రాష్ట్రానికి చేరుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను ఎన్టీఎస్ఏ అధికారులు పరిశీలించారు.

  • Publish Date - February 20, 2024 / 10:53 AM IST

విధాత, హైదరాబాద్: నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నేతృత్వంలోని నిపుణుల బృందం మంగళవారం రాష్ట్రానికి చేరుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం(సరస్వతీ) బ్యారేజీలను ఎన్టీఎస్ఏ అధికారులు పరిశీలించారు. ముందుగా అన్నారం బ్యారేజీలోని 39వ పియర్ వద్ద ఏర్పడిన సీపేజీ పరిశీలించారు. అనంతరం బ్యారేజీ పైన పియర్స్‌ను పరిశీలించి ఇసుక మేటలనలు పరిశీలించారు.


అనంతరం మేడిగడ్డ బ్యారేజ్ బ్లాక్ 7లో కుంగిన ప్రాంతాన్ని పరిశీలించారు. నది గర్భంలో బ్యారేజీ కిందకు వెళ్లి ఇరువైపుల ఏర్పడిన పగుళ్లను పరిశీలించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో వాటర్ లీకేజీ విషయాన్ని ఇంజనీర్లు నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ దృష్టికి తీసుకెళ్లగా.. మూడు బ్యారేజిల్లో నీళ్ల స్టోరేజీ అంశాన్ని ఎన్టీఎస్ఏకు ప్రభుత్వం అప్పగించింది. ఎన్డీఎస్ఏ ఇచ్చే నివేదికతోనే మరమ్మత్తులు చేయాలా వద్దా అనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.


ఇసుక తొలగిస్తేనే అవగాహాన


అన్నారం బ్యారేజీలో ఇప్పటికే స్టోరేజ్ వాటర్ రిలీజ్ చేయాలని ఎన్టీఎస్ఏ సూచించిన క్రమంలో రాత్రికి రాత్రే గేట్లు తెరిచి నీటిని పూర్తిగా విడుదల చేశారు అధికారులు. బ్యారేజీలో నిలువ ఉన్న మొత్తం 2.5 టీఎంసీల నీటిని కిందికి వదిలారు. ఇక అన్నారం నీళ్లు వదలడంతో మేడిగడ్డ దగ్గర పనులు ఆగిపోయాయి. అన్నారంలో నీటిని పూర్తిగా ఖాళీ చేయడంతో బ్యారేజీ పొడవునా 1.6 కిలోమీటర్ల దూరం వరకు లక్ష క్యూబిక్ మీటర్ల మేర గేట్ల వద్ద అర మీటరు ఎత్తులో ఇసుక పేరుకుంది. దీంతో బ్యారేజీలో సమగ్ర సర్వే చేసేందుకు వీలవుతుందా అన్న సందేహాలు వెల్లువెత్తుతున్నాయి.


ఇసుక తీయకపోతే ఫౌండేషన్, పియర్, ర్యాప్ట్ కింద ఖాళీ ప్రాంతం ఎక్కడ ఎంత మేర ఉందనేది తెలియదని ఇంజనీర్లు చెబుతున్నారు. ఇసుక తొలగించిన తరువాతనే సీపేజీ లీకేజీపై విశ్లేషణ సాధ్యం అవుతుందని అంటున్నారు. గేట్లు కూడా దెబ్బతిన్నట్లుగా తెలుస్తుంది. బ్యారేజీలో ఏర్పడిన సీపేజీల మరమ్మతుల పనుల్లో భాగంగా ఆప్కాన్స్ సంస్థ ఇప్పటికే కెమికల్ గ్రౌటింగ్ చేసింది. అయినప్పటికీ మరోచోట చిన్న చిన్న సీపేజీలు కనిపిస్తున్నాయి. దీంతో సీపేజీలకు పూర్తిస్థాయి ట్రీట్ మెంట్ చేయడంతోపాటు బ్యారేజీలోని లోపాలను కనుగొనేందుకు ప్రభుత్వం పార్సన్ సంస్థకు ఇన్వెస్టిగేషన్ బాధ్యతలను అప్పగించింది.