Opposition Alliance విధాత: దేశవ్యాప్తంగా మోడీ వ్యతిరేక కూటమి బలపడుతోంది. పాట్నాలో జరిగిన సమావేశానికి హాజరుకాని మరో ఎనిమిది పార్టీలు ఈ నెల 17, 18 తేదీల్లో బెంగుళూరులో జరగనున్న కూటమి సమావేశానికి మద్దతు పలికాయి. విపక్ష సమావేశంలో ఈ పార్టీలు పాల్గొననున్నాయి. విపక్షాల మహాకూటమికి కొత్తగా మద్దతు ప్రకటించిన పార్టీలలో వైకో సారధ్యంలోని మరుమలర్చి ద్రవిడ మున్నేట్ర కజగం (MDMK), కొంగు దేశ మక్కల్ కట్చి (KDMK), విడుదలై చిరుతైగళ్ కట్చి (VCK), రివల్యూషనరీ సోషలిస్ట్ […]
Opposition Alliance
విధాత: దేశవ్యాప్తంగా మోడీ వ్యతిరేక కూటమి బలపడుతోంది. పాట్నాలో జరిగిన సమావేశానికి హాజరుకాని మరో ఎనిమిది పార్టీలు ఈ నెల 17, 18 తేదీల్లో బెంగుళూరులో జరగనున్న కూటమి సమావేశానికి మద్దతు పలికాయి. విపక్ష సమావేశంలో ఈ పార్టీలు పాల్గొననున్నాయి.
విపక్షాల మహాకూటమికి కొత్తగా మద్దతు ప్రకటించిన పార్టీలలో వైకో సారధ్యంలోని మరుమలర్చి ద్రవిడ మున్నేట్ర కజగం (MDMK), కొంగు దేశ మక్కల్ కట్చి (KDMK), విడుదలై చిరుతైగళ్ కట్చి (VCK), రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ (RSP), ఆల్ ఇండియా ఫార్వాడ్ బ్లాక్ (AIFB), కేరళ కాంగ్రెస్ (జోసెఫ్), కేరళ కాంగ్రెస్ (మణి), ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) ఉన్నాయి. లోక్సభలో ఈ పార్టీలకు ఉన్న బలాబలాల ప్రకారం చూస్తే, ఎండీఎంకే, కేడీఎంకే, ఏఐఎఫ్బీ, కేరళ కాంగ్రెస్ (జోసెఫ్)లకు ఎలాంటి ప్రాతినిధ్యం లేదు.
వీసీకే, ఆర్ఎస్పీ, కేరళ కాంగ్రెస్ (మణి)లకు లోక్సభలో ఒక్కో స్థానం చొప్పున ప్రాతినిథ్యం ఉండగా, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్కు లోక్సభలో 3 సీట్లు ఉన్నాయి. జూన్లో బీహార్ సీఎం నితీష్ కుమార్ సారథ్యంలో పాట్నాలో జరిగిన విపక్షాల సమావేశంలో 15 పార్టీలు పాల్గొనగా, కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో ఈనెల 17, 18 తేదీల్లో బెంగళూరులో తలపెట్టిన విపక్షాల సమావేశంలో 23 పార్టీలు పాల్గొంటాయని అంచనా వేస్తున్నారు. మరోవైపు, పాట్నాలో ఇటీవల జరిగిన విపక్షాల సమావేశాన్ని ఫోటో సెషన్గా బీజేపీ అభివర్ణించింది, చాలా పార్టీలకు లోక్సభలో అసలే ప్రాతినిధ్యమే లేదని ఎద్దేవా చేసింది.