దివంగత బీఆరెస్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదం కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. లాస్య కారు ఢీకొన్న టిప్పర్ లారీని పటాన్చెరు పోలీసులు గుర్తించారు
విధాత : దివంగత బీఆరెస్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదం కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. లాస్య కారు ఢీకొన్న టిప్పర్ లారీని పటాన్చెరు పోలీసులు గుర్తించారు. యాక్సిడెంట్ జరిగిన రోజు టిప్పర్ను ఢీకొనడం వల్లే లాస్య నందిత మృతి చెందారు. టిప్పర్ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓఆర్ఆర్పై ముందు వెళ్తున్న టిప్పర్ను లాస్య నందిత ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టింది. అయితే ప్రమాదం జరిగినప్పటికీ టిప్పర్ డ్రైవర్ ఆగకుండా వెళ్లిపోయాడు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా టిప్పర్ను పోలీసులు గుర్తించారు.
ఓఆర్ఆర్పైన గత నెలలో పటాన్చెరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో లాస్య నందిత (37) దుర్మరణం చెందారు. లాస్య నందిత ప్రయాణిస్తున్న కారు గుర్తుతెలియని వాహనాన్ని వెనక నుంచి ఢీకొని అదుపు తప్పి రోడ్డుకు ఎడమవైపు దూసుకెళ్లి రెయిలింగ్ను బలంగా ఢీకొంది. ప్రమాదం తీవ్రతకు కారు ముందువైపు ఎడమ భాగం నుజ్జునుజ్జయింది. కారు నడుపుతున్న ఆమె పీఏ ఆకాశ్ (26) తీవ్రంగా గాయపడ్డారు. రెండు కాళ్లూ విరిగిపోవడంతో ఆయన కారులోనే ఇరుక్కుపోయారు. డ్రైవర్ పక్క సీట్లో కూర్చున్న నందిత సీటు బెల్ట్ పెట్టుకున్నప్పటికి, ఎయిర్బ్యాగ్లు తెరుచుకున్నా.. ఆమె తలకు, ముఖానికి, కాళ్లకు తీవ్రగాయాలై అక్కడికక్కడే దుర్మరణం చెందారు.
లాస్య తండ్రి మాజీ ఎమ్మెల్యే జి.సాయన్న గత ఏడాది ఫిబ్రవరి 19న అనారోగ్యంతో మరణించారు. ఆయన ప్రథమ వర్థంతి జరిగి నాలుగు రోజులు గడవక ముందే కుమార్తె రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో వారి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని రేపింది. ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక లాస్య నందిత తొలుత లిప్ట్లో ఇరుక్కుని తొలి ప్రమాదం నుంచి బయట పడ్డారు. ఆ తరువాత నల్గొండ బహిరంగ సభకు వెళ్లొస్తూ ఫిబ్రవరి 13న రెండవ సారి ప్రమాదానికి గురయ్యారు. అయితే గాయాలతో లాస్య నందిత బయటపడగా, ఆమె కారు ఢీకొన్న ప్రమాదంలో విధుల్లో ఉన్న హోంగార్డు మృతి చెందాడు. మూడవ సారి ఓఆర్ఆర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో లాస్య నందిత మృతి చెందారు.