Prof.Haragopal
విధాత: ప్రొఫెసర్ హరగోపాల్పై పోలీసులు పెట్టిన ఉపా కేసు నమోదు చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి అన్నారు. వెంటనే పోలీసులు ఈ కేసును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ మేరకు ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో అన్ని అంశాలపై అవగాహన ఉండి రాజకీయాలకు అతీతంగా ప్రజా సంక్షేమం, ప్రాంత అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న వ్యక్తి హరగోపాల్ అని అన్నారు.
హరగోపాల్ ఒక నిష్పక్షపాత మేధావిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అహర్నిశలు కృషి చేశారన్నారు. తెలంగాణ కోసం ప్రొ. జయశంకర్ లాంటి వారితో కలిసి పోరాటాలు చేసిన ఉద్యమ కారుడన్నారు. అలాంటి హరగోపాల్ పైన ఉపా కేసులు పెట్టి వేధించడం ఈ పాలకుల దుశ్చర్యలకు నిదర్శనమన్నారు. గతంలో నక్సలైట్లు ప్రజా ప్రతినిధులను కిడ్నాప్ చేస్తే ప్రభుత్వం కోరిక మేరకు మధ్యవర్తిత్వం వహించి వారి విడుదలకు సహకరించిన వ్యక్తి అని అన్నారు.