విధాత, హైదరాబాద్ : రాజ్యాంగాన్ని రక్షించడం కోసమే బీఆరెస్ పార్టీతో కలిసి బీఎస్పీ రానున్న లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తుందని బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. బుధవారం అచ్చంపేటలో ఏర్పాటు చేసిన నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై మీడియాతో మాట్లాడారు. దేశ రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తుందని, దీన్ని అడ్డుకోవలసిన కాంగ్రెస్ పరోక్షంగా బీజేపీకి వత్తాసు పలుకుతుందని ఆరోపించారు. బీజేపీ పాలనలో రాజ్యాంగం ప్రమాదంలో పడిందన్న అయన కేంద్రంలో తిరిగి బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందని ఆరోపించారు.
దేశంలో విచ్ఛిన్నకర అజెండాను అమలు చేస్తున్న బీజేపీని అడ్డుకోవడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందన్నారు. జన్వాడలో ప్రార్థన మందిరంపై దాడి జరిగితే సీఎం రేవంత్ రెడ్డి స్పందించలేదని విమర్శించారు. బీఎస్పీ-బీఆరెస్ పొత్తు బహుజనుల ఆకాంక్ష అని తెలిపిన ఆయన రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగించడానికి బీఎస్పీ బీఆరెస్తో జతకట్టినట్లు వివరించారు. బహుజనులకు న్యాయం జరగాలనేది పార్టీ లక్ష్యమన్న అయన ఈ పొత్తుతో ప్రజలకు మంచి జరగబోతున్నదని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి కారణమైన బిఆరెస్తో బీఎస్పీ కలవడం సంతోషకరమన్నారు. రాష్ట్రంలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో బీఎస్పీ- బీఆరెస్ పోటీ చేసే స్థానాలపైన త్వరలోనే విధివిధానాలు కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ప్రజలు బీఎస్పీ, బిఆరెస్ కూటమిని ఆశీర్వదించాలని కోరారు. బీఎస్పీ, బీఆరెస్ కూటమి అభ్యర్థులు ఎక్కడెక్కడ కలిసి పోటీ చేస్తారనే విధివిధానాలను త్వరలో మీడియాకు వెల్లడిస్తామన్నారు.
బీఆరెస్ పాలనలో కుంభకోణాల మాయం అని చెప్పిన కాంగ్రెస్ ఇప్పటివరకు ఒక్క కుంభకోణాన్ని కూడా బయట పెట్టలేదని విమర్శించారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలతో సీఎం రేవంత్ రెడ్డి రోజుకో ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులు రోడ్లమీదకి వస్తున్నారన్నారని విమర్శించారు. ఉద్యోగ నియామకాల్లో మహిళలకు హారిజాంటల్ రిజర్వేషన్లు అమలుచేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. నాగర్ కర్నూల్ పార్లమెంటు పరిధిలో బీఎస్పీ గెలవాలనే దృఢ నిశ్చయంతో పార్టీ శ్రేణులు పనిచేయాలని సూచించారు. గత పాలకుల నిర్లక్ష్యంతో విద్యా,ఉద్యోగాలు, వ్యవసాయ రంగాల్లో నాగర్ కర్నూల్ ప్రాంతం పూర్తిగా వెనుకబడిపోయిందని విమర్శించారు.