Sam Bankman : దివాలా తీసిన క్రిప్టో ఎక్స్ఛేంజ్ ఎఫ్టీఎక్స్ (FTX) సహ వ్యవస్థాపకుడు శామ్ బ్యాంక్మన్ ఫ్రీడ్కు (Sam Bankman Fried) న్యూయార్క్ కోర్టు 25 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అమెరికా కాలమానం ప్రకారం గురువారం తీర్పు వెలువరించింది. శిక్ష ఖరారుకు ముందు బ్యాంక్మన్ వ్యవహరించిన తీరుపై న్యాయమూర్తి లెవిస్ కప్లన్ తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. విచారణ సమయంలో ఆయన అన్నీ అబద్ధాలు చెప్పారన్నారు. కస్టమర్ల డబ్బు ఇతర మార్గాల్లోకి వెళ్తున్నట్లు తనకు తెలియదని చెప్పడం పూర్తిగా అవాస్తవమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తప్పులు జరుగుతున్నట్లు బ్యాంక్మన్కు ముందే తెలుసని న్యాయమూర్తి అన్నారు. కస్టమర్లను మోసం చేశాననే బాధ ఉన్నప్పటికీ విచారణలో మాత్రం దాన్ని ఆయన అంగీకరించలేదని చెప్పారు. బ్యాంక్మన్ తరఫున న్యాయవాదులు వాదిస్తూ శిక్షను 5 నుంచి 6.5 ఏళ్లకు పరిమితం చేయాలని కోర్టును కోరారు. బ్యాంక్మన్ ఎలాంటి హింసాత్మక చర్యలకు పాల్పడలేదని, ఇది అతడి జీవితంలో తొలి నేరమని పేర్కొన్నారు. మానసికంగానూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
సంస్థ దివాలా పరిష్కార ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో కస్టమర్లు తాము కోల్పోయిన సొమ్ములో మెజారిటీ భాగాన్ని తిరిగి పొందే అవకాశం ఉందని, వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని తక్కువ తీవ్రతగల శిక్షను ఖరారు చేయాలని న్యాయమూర్తికి విజ్ఞప్తి చేశారు. మరోవైపు ప్రభుత్వం తరఫు న్యాయవాదులు మాత్రం చట్టప్రకారం బ్యాంక్మన్కు దాదాపు 100 ఏళ్ల శిక్ష పడాల్సి ఉందని వాదించారు. కనీసం 40 ఏళ్ల శిక్ష విధించాలన్నారు. చివరకు న్యాయమూర్తి కల్పన్ 25 ఏళ్ల జైలు శిక్ష ఖరారు చేశారు. ఇది దీర్ఘకాల శిక్షగా అనిపిస్తున్నప్పటికీ.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం విధించాల్సిన దానితో పోలిస్తే చాలా తక్కువని తెలిపారు.
ఈమాత్రం కూడా శిక్ష పడకపోతే.. భవిష్యత్తులో మళ్లీ తీవ్ర నేరాలకు పాల్పడే ప్రమాదం ఉందన్నారు. తీర్పునకు ముందు బ్యాంక్మన్ కోర్టులో తీవ్ర పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. ‘నా వల్ల చాలామంది నిరాశ చెందారు. దానికి క్షమాపణలు చెబుతున్నా. జరిగిన దానికి చింతిస్తున్నా’ అని లో వాయిస్తో మాట్లాడారు.
ఎవరీ బ్యాంక్మన్?
2017లో వాల్ స్ట్రీట్లో ఉద్యోగం వదిలేసిన బ్యాంక్మన్.. అలమెడా రిసెర్చ్ పేరిట హెడ్జ్ ఫండ్ను ఏర్పాటు చేశారు. రెండేళ్ల తర్వాత ఎఫ్టీఎక్స్ పేరుతో క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజ్ను నెలకొల్పారు. క్రిప్టో ర్యాలీతో ఫోర్బ్స్ గణాంకాల ప్రకారం ఆయన సంపద 26 బిలియన్ డాలర్లకు చేరింది. అప్పటికి ఆయన వయసు 30 ఏళ్లు కూడా నిండలేదు. ఆ సంపదతో డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థులకు భారీ ఎత్తున విరాళాలు ఇచ్చారు. 2022 అమెరికా మధ్యంతర ఎన్నికల సమయంలో పార్టీ కార్యకలాపాలకు ఆర్థికసాయం అందజేశారు. బహమాస్ కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహించిన బ్యాంక్మన్.. తనదైన ఆహార్యంతో అప్పట్లో అందరి దృష్టినీ ఆకర్షించారు. బిల్ క్లింటన్ వంటి హేమాహేమీలతోనూ ఆయన షార్ట్స్ ధరించి సమావేశమయ్యేవారు. క్రిప్టో సురక్షితమైన పెట్టుబడని చెప్పడం కోసం పెద్ద ఎత్తున వాణిజ్య ప్రకటనలు ఇచ్చారు. అందుకోసం హాలీవుడ్కు చెందిన ప్రముఖ సెలబ్రిటీలను రంగంలోకి దింపారు.
ఏం జరిగింది..?
అసలు వివాదం ఎఫ్టీఎక్స్, అలమెడా రిసెర్చ్ మధ్య సంబంధంతోనే మొదలైంది. వాస్తవానికి ఈ రెండు కంపెనీలు వేర్వేరని బ్యాంక్మన్ చెప్పేవారు. కానీ, అది వాస్తవం కాదని తర్వాత తేలింది. అలమెడా ఆస్తుల్లో చాలావరకు ఎఫ్టీఎక్స్ ఆవిష్కరించిన ఎఫ్టీటీ క్రిప్టో టోకెన్ల రూపంలోనే ఉన్నట్లు తెలిపింది. మార్కెట్ విలువ ప్రకారం తమ ఎఫ్టీటీ టోకెన్ల విలువ బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు అప్పట్లో అలమెడా లెక్కగట్టింది. వాస్తవానికి టోకెన్లన్నీ ఈ ఇరు సంస్థల అధీనంలోనే ఉన్నాయి. అసలు సర్క్యులేషన్లో ఉన్నవి చాలా తక్కువ. అంటే అలమెడా విలువ పూర్తిగా ఊహాజనితమే. ఈ విషయం బయటకు రాగానే ఎఫ్టీఎక్స్ ప్రత్యర్థి సంస్థ బైనాన్స్ వ్యూహాత్మకంగా వ్యవహరించి తమ వద్ద ఉన్న ఎఫ్టీటీ టోకెన్లను అన్నింటినీ విక్రయించేసింది.
దాంతో మిగతా ట్రేడర్లు కూడా తమ ఎఫ్టీటీ హోల్డింగ్స్ను వదిలించుకునేందుకు ఎగబడ్డారు. ఫలితంగా ఎఫ్టీటీ విలువ 75 శాతానికి పైగా పడిపోయింది. అలమెడా ఆస్తుల విలువ పూర్తిగా ఆవిరైంది. మరోవైపు ఎఫ్టీఎక్స్ నుంచి నిధులను ఉపసంహరించుకునేందుకు మదుపర్లు ఎగబడ్డారు. కానీ, ఎఫ్టీఎక్స్ వద్ద మదుపర్లకు చెల్లించేందుకు నిధులు లేవు. మరోవైపు అలమెడా దగ్గర ఉన్న టోకెన్లకు విలువ లేకుండా పోయింది. ఫలితంగా ఎఫ్టీఎక్స్ దివాలా పరిష్కార ప్రణాళికకు దరఖాస్తు చేసుకుంది.
ఈ వ్యవహారంలో బ్యాంక్మన్తో పాటు మరో ముగ్గురు ఉన్నారు. వారంతా తప్పులను కోర్టు ముందు అంగీకరించారు. బ్యాంక్మన్ ఆదేశాల మేరకే తాము నడుచుకున్నట్లు తెలిపారు. కస్టమర్లను మోసం చేయడం, అక్రమ నగదు చలామణి సహా మొత్తం ఏడు అభియోగాల్లో బ్యాంక్మన్ను గత నవంబరులో కోర్టు దోషిగా తేల్చింది. దాదాపు 10 బిలియన్ డాలర్ల విలువైన ఆర్థిక నేరం జరిగినట్లు గుర్తించింది. ఇది అమెరికా చరిత్రలోనే అతిపెద్ద ఆర్థిక మోసాల్లో ఒకటని తెలిపింది.