సీఎం జగన్కు షాక్: శాశ్వత అధ్యక్ష హోదా కుదరదు.. ఈసీ నోటీసులు!
ఉన్నమాట: దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా చేయని తీర్మానం చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా నియమితులైన వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కేంద్ర ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది. ఎక్కడా.. ఏ పార్టీలోనూ లేని కొత్త సంప్రదాయాన్ని తీసుకొచ్చిన తీరు పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేసిన ఎన్నికల కమిషన్ ఈ మేరకు వైస్సార్సీపీకి నోటీసులు జారీ చేసింది. వాస్తవానికి వైఎస్సార్సీపీ ఏర్పాటు చేసినపుడు 2009లో వైఎస్ విజయమ్మను గౌరవాధ్యక్షురాలిగా నియమించారు. ఈ 13 […]

ఉన్నమాట: దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా చేయని తీర్మానం చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా నియమితులైన వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కేంద్ర ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది. ఎక్కడా.. ఏ పార్టీలోనూ లేని కొత్త సంప్రదాయాన్ని తీసుకొచ్చిన తీరు పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేసిన ఎన్నికల కమిషన్ ఈ మేరకు వైస్సార్సీపీకి నోటీసులు జారీ చేసింది.
వాస్తవానికి వైఎస్సార్సీపీ ఏర్పాటు చేసినపుడు 2009లో వైఎస్ విజయమ్మను గౌరవాధ్యక్షురాలిగా నియమించారు. ఈ 13 ఏళ్లుగానూ ఆమె అదే పదవిలో కొనసాగుతూ ఉన్నారు. జగన్ జైల్లో ఉన్నపుడు సైతం ఆమె గౌరవాధ్యక్షురాలిగా ఉంటూ పార్టీని నడిపించారు. ఈ మధ్యలో రెండు మూడుసార్లు జరిగిన పార్టీ ప్లీనరీల్లో జగన్ను కార్యకర్తలు పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకుంటూ వస్తున్నారు.
అయితే మొన్న జులైలో వైఎస్ జయంతి సందర్భంగా నిర్వహించిన పార్టీ ప్లీనరీలో మాత్రం వైఎస్సార్సీపీ ఓ విచిత్రమైన తీర్మానం చేసింది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకుంటూ కార్యకర్తలు తీర్మానం చేశారు. అదే సందర్భంలో పార్టీ గౌరవాధ్యక్షురాలిగా విజయమ్మ రాజీనామా చేశారు. అయితే జగన్ను శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకుంటూ చేసిన తీర్మానాన్ని కేంద్ర ఎన్నికల సంఘం తిప్పి కోట్టింది.
ప్రజాస్వామ్యంలో ఒక పార్టీకి శాశ్వత అధ్యక్షుడు, ఒక పదవికి శాశ్వత నియామకం ఉండదు. ఎప్పటికప్పుడు నిబంధనల మేరకు ఎన్నికలు జరగాలి. ఈసీ నియమావళి అంగీకరించిన తర్వాతే పార్టీల రిజిస్ట్రేషన్ జరుగుతుంది. ఈసీ నియమ నిబంధనలకు విరుద్ధంగా శాశ్వత అధ్యక్షుడిని ఎన్నుకోవడంపై పలుమార్లు వైసీపీని వివరణ కోరినా ఎలాంటి స్పందనా లేదు.
దీంతో శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమైన వ్యవహారమని ప్రకటిస్తున్నాం. ఇలాంటివి చెల్లుబాటు కాదు” అని ఈసీ తేల్చి చెప్పింది. అంతేకాదు, దీనిపై అంతర్గత విచారణ జరిపి నివేదికను తమకు పంపాలని పార్టీ ప్రధాన కార్యదర్శిని ఆదేశించినట్టు ఈసీ స్పష్టం చేసింది.
కేవలం చైనా వంటి ఏక పార్టీ పాలనలో మాత్రమే శాశ్వత అధ్యక్షులు ఉంటారు. జిన్ పింగ్ వంటి వారు శాశ్వతంగా అదే పదవిలో ఉండేలా అక్కడ చట్టాల్లో మార్పులు చేశారు. కానీ ప్రజాస్వామ్య దేశాల్లో ఇలా శాశ్వత అధ్యక్షులుగా ఉండడం రాజ్యాంగ విరుద్ధం అన్నది వైఎస్సార్సీపీ నాయకులకు తెలియక పోవడం చిత్రంగా ఉంది.
అయినా ఏటా ఏదోలా తూతూమంత్రంగా ఎన్నికలు పెట్టి తానే అధ్యక్షుడిగా ఎన్నికవచ్చు. దీన్ని ఎవరూ కాదనరు.. ఇంకో వ్యక్తి అధ్యక్ష పదవికి పోటీగా రారు..రాలేరు. ఆమాత్రం తెలియకుండానే ఒకేసారి శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నికవడం..ఆ తీర్మానం ఎన్నికల సంఘానికి పంపడం.. ఇప్పుడు అదే ఎన్నికల సంఘం ఈ తీర్మానాన్ని, ఎన్నికను కొట్టి వేయడం పార్టీకి తలవంపుగానే భావించాల్సి ఉంటుంది.. దీనిమీద జగన్, పార్టీ పెద్దలు ఎలా స్పందిస్తారో చూడాలి..