Tamilnadu |
విధాత: జూనియర్ మహిళా అధికారిని లైంగిక వేధింపులకు గురిచేసిన కేసులో మాజీ డీజీపీ స్థాయి అధికారికి మూడేండ్ల జైలు శిక్ష పడింది. రూ.10 వేల జరిమానా కూడా కోర్టు విధించింది. ఫిర్యాదు చేయకుండా అడ్డుకోబోయిన ఓ పోలీసుకు కూడా జరిమానా విధించింది. 2021 ఫిబ్రవరిలో జూనియర్ అధికారి దాఖలు చేసిన లైంగిక వేధింపుల కేసులో రాష్ట్ర పోలీసు దళం మాజీ స్పెషల్ డైరెక్టర్ జనరల్ రాజేశ్ దాస్ను తమిళనాడు కోర్టు శుక్రవారం దోషిగా నిర్ధారించింది. మూడు సంవత్సరాల జైలు శిక్ష కూడా విధించింది. దాస్కు రూ10,000 జరిమానా కూడా విధించింది. తమిళనాడులోని విల్లుపురం కోర్టులో ఫిర్యాదును దాఖలు చేయకుండా ఆపడానికి ప్రయత్నించిన పురుష పోలీసుకు రూ.500 జరిమానా విధించింది.
కేసు ఏమిటంటే..
తమిళనాడులోని మధ్య జిల్లాల్లో 2021 సమయంలో ఇద్దరు అధికారులు విధులు నిర్వహిస్తున్న సమయంలో తనపై దాస్ అనుచితంగా ప్రవర్తించారని మహిళా పోలీసు అధికారి ఆరోపించారు. అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం అధినేత ఎడప్పాడి పళనిస్వామి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నది.
ఫిర్యాదుపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆరుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ ఘటన అనంతరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓడిపోయింది. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న దాస్ స్థానంలో విజిలెన్స్, అవినీతి నిరోధక శాఖ అదనపు డైరెక్టర్ జనరల్ ఇంచార్జ్ జయంత్ మురళిని నియమించారు. ఎలాంటి పోస్టు కేటాయించకుండా దాస్ను రిజర్వులో ఉంచారు.
మద్రాసు హైకోర్టు ఏం చెప్పింది?
తనపై ఫిర్యాదు దాఖలైన కొన్ని నెలల తర్వాత విల్లుపురం కోర్టు అధికార పరిధిని సవాలు చేస్తూ దాస్ మద్రాసు హైకోర్టులో ఫిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఆ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. ఈ ఘటనను హైకోర్టు విమర్శించింది. ఇది ‘షాకింగ్ ఘటన అని పేర్కొన్నది. తమిళనాడులోని ఇతర మహిళా పోలీసు అధికారులపై ప్రభావం చూపుతుందని హెచ్చరించింది. హైకోర్టు వ్యాఖ్యల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం దాస్ను సస్పెండ్ చేసింది.
సుప్రీంకోర్టులో వ్యవహారం
మద్రాసు హైకోర్టు చేసిన వ్యాఖ్యలు న్యాయమైన విచారణకు తన అవకాశాలను దెబ్బతీస్తాయని విచారణను రాష్ట్రం వెలుపలికి మార్చాలని దాస్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రోజువారీ విచారణలు అవసరం లేదని సుప్రీంకోర్టు చెప్పింది. మద్రాసు హైకోర్టు ఆదేశాల మేరకు, కేసును ఆరు నెలల్లో ముగించాలని కోరింది. ఈ క్రమంలో శుక్రవారం తీర్పు వెలువడింది.
ఈ కేసులో సీఎం ఏమన్నారంటే..
తీర్పు వెలువడిన నేపథ్యంలో డీఎంకే నేత, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ స్పందించారు. తమ పార్టీ తమిళనాడు పోలీసుల్లో మహిళలకు అవమానకరమైన పరిస్థితిని ఎప్పటికీ అనుమతించబోదని స్పష్టంచేశారు.