విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ లో భారీ కుదుపు వచ్చింది. మహబూబ్ నగర్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని మక్తల్, నారాయణ పేట అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముగ్గురు బీజేపీ సీనియర్ నేతలు ఆ పార్టీ కి రాజీనామా చేయడంతో అధిష్టానంలో అలజడి ప్రారంభమైంది. కొన్ని దశాబ్దాల నుంచి బీజేపీ ని నమ్ముకొని ఉన్న నేతలు పార్టీ ఒక్క సారిగా పార్టీ ని వీడడం తో క్యాడర్ అయోమయం లో పడింది.
ఎన్నికల సమయంలో ముఖ్య నేతలు పార్టీ ని వదిలి వెళ్లడం తో ఈ నియోజకవర్గాల్లో బీజేపీ కి ఎదురు గాలి వీచే అవకాశం కనబడుతుంది. నారాయణ పేట అసెంబ్లీ స్థానానికి బీజేపీ నుంచి మూడు సార్లు ఎమ్మెల్యే పదవికి పోటీచేసి ఓటమి చెందిన రతంగపాండు రెడ్డి, మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెండు పర్యాయాలు బీజేపీ నుంచి బరిలో ఉంది ఓటమి పాలైన జలంధర్ రెడ్డి,నారాయణ పేట జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి రఘురామ్ గౌడ్ పార్టీ వీడిన వారిలో ప్రముఖంగా ఉన్నారు.
బీజేపీలో సీనియర్ నాయకుల రాజీనామా
వీరంతా పార్టీ లో సీనియర్ నేతలుగా గుర్తింపు ఉండడం తో ఈ నియోజకవర్గాల్లో పార్టీ కి తీవ్ర నష్టం జరిగే అవకాశం స్పష్టంగా ఉంది. నారాయణ పేట నియోజకవర్గం లో బీజేపీ ను బలోపేతం చేసిన రతంగపాండు రెడ్డి పార్టీ ని వీడడం తో పార్టీ శ్రేణులు ఖంగుతిన్నారు. ఎన్నో ఏళ్ళ నుంచి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కు బీజేపీ అధ్యక్షుడీ గా బాధ్యతలు నిర్వహించారు. అనంతరం నారాయణ పేట ను జిల్లా గా మార్చిన తరువాత ఆ జిల్లా కు కూడా బీజేపీ అధ్యక్షులు గా కొనసాగారు. ఈ ప్రాతం లో బీజేపీ నిలబడడానికి ఈయన కృషి చాలా ఉంది. రతంగపాండు రెడ్డి సేవలను గుర్తించిన బీజేపీ అధిష్టానం నారాయణ పేట నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో మూడు సార్లు బరిలో నిలిపింది. కాని ఒక్కసారి కూడా విజయాన్ని అందుకోలేదు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసినా చివరి నిమిషం లో లోలోపల కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి పర్ణిక రెడ్డి గెలుపులో ఈయన పాత్ర ఉందని అప్పట్లో బీజేపీ శ్రేణులు ఆరోపణలు చేశాయి. ప్రస్తుతం ఆయన బీజేపీ ని వీడడం తో బీజేపీ శ్రేణుల మాటలు నిజమయ్యాయి. ఇంత కాలం బీజేపీ లో ఉన్నా రాజకీయంగా ఎదగలేదనే ఉదేశ్యం తో పార్టీ ని వదిలినట్లు సమాచారం. త్వరలో కాంగ్రెస్ పార్టీ లో చేరే అవకాశం కన్పిస్తుంది. ఇంతవరకు ఏ పార్టీ లో చేరే విషయం ఆయన ప్రకటించలేదు. మరో నేతల మక్తల్ నియోజకవర్గానికి చెందిన జలంధర్ రెడ్డి బీజేపీ నుంచి రెండు సార్లు మక్తల్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ బరిలో నిలిచి ఓటమి చెందారు.
2019 ఎన్నికలకు ముందు తెరాస లో ఉన్న ఆయన అప్పటి తెరాస ఎంపీ జితేందర్ రెడ్డి తో సన్నిహిత సంబందాలు ఉండేవి.2014 ఎన్నికల్లో మక్తల్ నియోజకవర్గం నుంచి తెరాస అభ్యర్థి గా బరిలో ఉండాలని తీవ్ర ప్రయత్నాలు చేశారు. జితేందర్ రెడ్డి కూడా ఆయనకే మద్దతుగా నిలిచారు. ఆ ఎన్నికల్లో తెరాస అభ్యర్థి గా రాంమోహన్ రెడ్డి కి టికెట్ రావడం తో జలందర్ రెడ్డి, జితేందర్ రెడ్డి కలిసి తెరాస కు వ్యతిరేకం గా ప్రచారం చేసారనే ఆరోపణలు వచ్చాయి. మళ్ళీ 2018 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి జలంధర్ రెడ్డి బరిలో ఉండడం తో తెరాస ఎంపీ గా ఉన్న జితేందర్ రెడ్డి లోలోపల బీజేపీ అభ్యర్థి కి ప్రచారం చేసారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు.
ఛక్రం తిప్పిన జితేందర్ రెడ్డి
ఇది దృష్టిలో పెట్టుకున్న కెసిఆర్ 2019 పార్లమెంట్ ఎన్నికల్లో జితేందర్ రెడ్డి కి టికెట్ ఇవ్వకుండా పక్కన పెట్టేసారు. దీంతో కలత చెందిన జితేందర్ రెడ్డి తెరాస ను వీడి బీజేపీ లో చేరారు. ప్రస్తుతం మహబూబ్ నగర్ పార్లమెంట్ సెగ్మెంట్ కు బీజేపీ నుంచి పోటీ చేయాలని భావించిన జితేందర్ రెడ్డి కి మళ్ళీ చుక్కెదురయింది. ఆయనను కాదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కు టికెట్ కేటాయించింది. బీజేపీ కూడా మోసం చేసిందనే ధోరణి లో ఆయన కాంగ్రెస్ పార్టీ లో చేరి ఢిల్లీ లో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పోస్ట్ దక్కించుకున్నారు. టికెట్ విషయం లో మోసం చేసిన బీజేపీకి ఈ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఓటమి చెందాలనే ఉదేశ్యం తో జితేందర్ రెడ్డి ఆలోచనలకు పదును పెట్టారు.
బీజేపీకి మక్తల్, నారాయణ పేటలో నష్టం
ముఖ్యంగా బీజేపీ ప్రభావితం ఉన్న నియోజకవర్గాలైన మక్తల్, నారాయణ పేట లో చక్రం తిప్పి తనకు అనుకూలంగా ఉన్న బీజేపీ నాయకులతో చర్చలు జరిపి కాంగ్రెస్ పార్టీ లో చేరే విధంగా ప్రోత్సహించారు. ఆయన పిలుపు మేరకు సన్నిహితుడైన జలందర్ రెడ్డి తో పాటు మక్తల్ నియోజకవర్గం లో ముఖ్య నేతలను కూడా బీజేపీ కి రాజీనామా చేయించారు. వీరితో పాటు నారాయణ పేట నియోజకవర్గం లోని ముఖ్య నేతలు రాతంగపాండు రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ ని వీడిడారు. ఇక్కడ కూడా వీరు పార్టీ మారడానికి జితేందర్ రెడ్డి చక్రం తిప్పినట్లు తెలుస్తోంది.
ఈ రెండు నియోజకవర్గాల్లో బీజేపీ ముఖ్య నేతలు పార్టీ ని వీడడం తో ఆ పార్టీ కి తీరని దెబ్బ తగిలింది. పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఒక్కొక్కరుగా బీజేపీ ని వీడడం తో ఆ పార్టీ అభ్యర్థి విజయం పై ఆశలు సన్నగిళ్లుతున్నాయి. పైకి మాత్రం ఎవరు పార్టీ నుంచి వెళ్లినా ఎలాంటి నష్టం లేదని బీజేపీ శ్రేణులు పేర్కొంటున్నాయి. ఇంత కాలం పార్టీ లో ఉంది ఎన్నికల సమయం లో పార్టీ ని వీడిన నేతలపై పార్టీ క్యాడర్ మండిపడుతోంది.ఏదియేమైనా మహబూబ్ నగర్ పార్లమెంట్ సెగ్మెంట్ లో బీజేపీ గెలుపు కోసం ఎదురీడాల్సిన పరిస్థితి వచ్చింది.