Singareni: హండప రైల్వే సైడింగ్ ద్వారా నైనీ బొగ్గు రవాణా.. సింగరేణి బోర్డు అనుమతి
రూ.20 కోట్లతో కార్మికుల తాగునీటికై రాపిడ్ గ్రావిటీ ఫిల్టర్ బెడ్ నిర్మాణానికి నిధుల మంజూరు సింగరేణి ఆర్థిక నివేదికకు ‘కాగ్’ ఆమోదంపై బోర్డు హర్షం ఆర్జీవోసీ-2 విస్తరణ, కోయగూడెం ఓసి-2 గనుల్లో ఓబీ పనులకు ఆమోదం చైర్మన్, MD ఎన్.శ్రీధర్ అధ్యక్షతన సింగరేణి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశం విధాత: సింగరేణి(Singareni) సంస్థ ఒడిస్సా(Odissa) రాష్ట్రంలో చేపట్టిన నైనీ బొగ్గు(Nainy coal) బ్లాక్ నుండి ఈ ఏడాది బొగ్గు ఉత్పత్తి అవుతున్న నేపథ్యంలో అక్కడికి సమీపంలోని హండపా(Handap) […]

- రూ.20 కోట్లతో కార్మికుల తాగునీటికై రాపిడ్ గ్రావిటీ ఫిల్టర్ బెడ్ నిర్మాణానికి నిధుల మంజూరు
- సింగరేణి ఆర్థిక నివేదికకు ‘కాగ్’ ఆమోదంపై బోర్డు హర్షం
- ఆర్జీవోసీ-2 విస్తరణ, కోయగూడెం ఓసి-2 గనుల్లో ఓబీ పనులకు ఆమోదం
- చైర్మన్, MD ఎన్.శ్రీధర్ అధ్యక్షతన సింగరేణి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశం
విధాత: సింగరేణి(Singareni) సంస్థ ఒడిస్సా(Odissa) రాష్ట్రంలో చేపట్టిన నైనీ బొగ్గు(Nainy coal) బ్లాక్ నుండి ఈ ఏడాది బొగ్గు ఉత్పత్తి అవుతున్న నేపథ్యంలో అక్కడికి సమీపంలోని హండపా(Handap) రైల్వే సైడింగ్(Railway Siding) వరకు బొగ్గు రవాణా చేసి, రైల్వే వ్యాగన్లలోనికి లోడ్ చేసే పనులకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశం ఆమోదం తెలిపిందని సంస్థ చైర్మన్, ఎండి ఎన్.శ్రీధర్ వెల్లడించారు.
హైదరాబాద్ సింగరేణి భవన్లో శుక్రవారం శ్రీధర్ అధ్యక్షతన జరిగిన బోర్డు సమావేశం వివరాలను వెల్లడించారు. ఈ సమావేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు సింగరేణి డైరెక్టర్లు పాల్గొన్నారు.
నైనీ బొగ్గు బ్లాక్ నుండి ఏడాదికి సుమారు కోటి టన్నుల బొగ్గు ఉత్పత్తి అవుతుందని, బొగ్గు బ్లాక్ నుండి సమీపంలోని రైల్వే స్టేషన్కు కొత్త రైలుమార్గం నిర్మాణం జరగాల్సి ఉన్నందున, అప్పటివరకు రోడ్డు మార్గం ద్వారా రెండేళ్ల పాటు బొగ్గు రవాణా చేయడం కోసం కాంట్రాక్టు ఏర్పాటుకు ప్రతిపాదించగా బోర్డు అనుమతించింది. వీటితో పాటు రామగుండం ఓసి-2 విస్తరణ ప్రాజెక్టు, కోయగూడెం రెండు ఓపెన్ కాస్టుకు సంబంధించి ఓవర్ బర్డెన్ తొలగింపు వంటి పనులకు బోర్డు ఆమోదం తెలిపింది.
అలాగే వివిధ ఏరియాలలో భారీ యంత్రాలకు అవసరమైన స్పేర్ పార్ట్ల కొనుగోలుకు, 70 డంపర్లకు అవసరమైన సేవలకు, స్పేర్ పార్ట్లకు బోర్డు అనుమతించింది. ఆర్జీ-1, ఆర్జీ-2, ఆర్జీ-3 ఏరియాల్లో కార్మికుల తాగునీటి సౌకర్యం కోసం రూ. 20 కోట్లతో నిర్మించనున్న రాపిడ్ గ్రావిటీ ఫిల్టర్ బెడ్స్ నిర్మాణానికి అవసరమైన నిధులను బోర్డు మంజూరు చేసింది. దీంతో రోజుకు 35 మి.లీటర్ల గోదావరి నీటిని శుద్ధి చేసి పంపిణీ చేయనున్నారు. మైనింగ్ విద్య ప్రోత్సాహంలో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీలో మైనింగ్ ఇంజనీరింగ్ విభాగంలో కోర్సుల పునరుద్ధరణకు సింగరేణి సంస్థ రూ. 3 కోట్ల విరాళం అందించడానికి బోర్డు అంగీకరించింది.
2021-22 సింగరేణి ఆర్థిక నివేదికకు ‘కాగ్’ ఆమోదం
సింగరేణి సంస్థ 2021-22 ఆర్థిక సంవత్సరానికి సమర్పించిన ఆర్థిక నివేదికపై కాగ్ (కంప్ట్రోలర్ ఆఫ్ ఆడిటర్ జనరల్) అభ్యంతరాలు తెలియజేయకుండా (నిల్ కామెంట్స్) ఆమోదించడం పట్ల బోర్డు సమావేశంలో హర్షం వ్యక్తం అయింది. సింగరేణి ఆదాయ వ్యయాల పైన ఆర్థిక విభాగం వారు ఎంతో పకడ్బందీగా, సమర్థంగా సంస్థ తరఫున సమర్పిస్తున్న ఆర్థిక నివేదికలకు గత 4 ఏళ్లుగా కాగ్ ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా పూర్తి స్థాయి ఆమోదం తెలియజేయడం పట్ల బోర్డు సభ్యులు డైరెక్టర్ (ఫైనాన్స్) కి అభినందనలు తెలిపారు.
ఈ సమావేశంలో బోర్డు సభ్యులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ నుండి కార్యదర్శి సోలంకి, డైరెక్టర్ శ్రీమతి సంతోష్, డబ్ల్యుసిఎల్ సీఎండి మనోజ్కుమార్, సింగరేణి సంస్థ నుండి డైరెక్టర్ ఫైనాన్స్, (పా)ఎన్. బలరామ్, డైరెక్టర్ (ఇ అండ్ ఎం) డి.సత్యనారాయణరావు, డైరెక్టర్ ఆపరేషన్స్ ఎన్.వి.కె. శ్రీనివాస్, డైరెక్టర్ ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్ జి.వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. కంపెనీ సెక్రటరీ శ్రీమతి సునీతా దేవి, జనరల్ మేనేజర్ కోఆర్డినేషన్ ఎం.సురేష్ సమావేశానికి హాజరయ్యారు.