ఇంట్లో నడుస్తుంటే కిందపడటంతో బెంగాల్ సీఎం మమతాబెనర్జీ నుదిటికి గాయమైందని తొలుత వార్తలు వచ్చినా.. ఇప్పుడు కొత్త విషయం వెలుగులోకి వస్తున్నది
దర్యాప్తు చేసేందుకు సిట్ను ఏర్పాటు చేసిన కోల్కతా పోలీస్
కోల్కతా: ఇంట్లో నడుస్తుంటే కిందపడటంతో బెంగాల్ సీఎం మమతాబెనర్జీ నుదిటికి గాయమైందని తొలుత వార్తలు వచ్చినా.. ఇప్పుడు కొత్త విషయం వెలుగులోకి వస్తున్నది. దానిపై దర్యాప్తు చేసేందుకు కోల్కతా పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించారు. మమతాబెనర్జీని ఆమె నివాసంలో ఎవరో నెట్టివేయడంతో ఆమె కిందపడి ఉంటారనే కొత్త వాదన తెరపైకి వచ్చింది. ఆమెకు చికిత్స చేస్తున్న ఎస్ఎస్కేఎం మెడికల్ కాలేజీ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ మణిమయ్ బందోపాధ్యాయ ఈ అనుమానాలను గురువారం రాత్రి లేవనెత్తారు. ఆమెను ఆమె నివాసంలో ఎవరన్నా నెట్టివేసి ఉండొచ్చని మీడియాతో మాట్లాడుతూ సందేహం వెలిబుచ్చారు.
ఈ నేపథ్యంలో ఈ ఉదంతంపై దర్యాప్తు జరిపేందుకు వేర్వేరు విభాగాల అధికారులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్టు కోల్కతా సిటీ పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఈ దర్యాప్తును సిటీ పోలీస్ కమిషనర్ వినీత్ కుమార్ గోయల్ నేరుగా పర్యవేక్షిస్తారని తెలిపాయి.
ఈ క్రమంలో ముఖ్యమంత్రి నివాసమైన దక్షిణ కోల్కతాలోని కాళిఘాట్లో సీసీటీవీ ఫుటేజ్ను సిట్ పరిశీలించనున్నది. సీఎం నివాసంలోని భద్రతా సిబ్బందిని కూడా సిట్ సభ్యులు ప్రశ్నించనున్నారు. ముఖ్యమంత్రి వంటి వీవీఐపీకి సంబంధించిన భద్రతా అంశం ఇమిడి ఉన్నందున ఈ కేసును అత్యంత ముఖ్యమైన విషయంగా పరిగణించాలని నగర పోలీసుల ఆదేశాల్లో పేర్కొన్నారు. ఎవరో నెట్టివేశారన్న అంశంతోపాటు.. ముఖ్యమంత్రి నివాసంలో భద్రతా ఏర్పాట్లను కూడా అధికారులు సమీక్షించనున్నారు.
గురువారం రాత్రి తన నివాసంలో నడుస్తున్న ముఖ్యమంత్రి మమతాబెనర్జీ అకస్మాత్తుగా పడిపోయారు. వెంటనే ఆమెను ఎస్ఎస్కేఎం మెడికల్ కాలేజీ హాస్పిటల్కు తరలించారు. ఆమె గాయానికి వైద్యులు నాలుగు కుట్లు వేసి, ఇంటికి పంపించారు. ఆమె ఇంటికి వెళ్లిపోయిన గంట తర్వాత ఎస్ఎస్కేఎం డైరెక్టర్ మీడియాతో మాట్లాడుతూ.. ఎవరన్న ఆమెను నెట్టివేసి ఉండొచ్చనే వాదనను ముందుకు తెచ్చారు.