సోషల్ మీడియా ట్విటర్ ఎక్స్ వేదికగా మూడు పార్టీల మధ్య ట్విటర్ రచ్చ సాగుతుంది. ప్రధానంగా మేడిగడ్డ కుంగుబాటు సమస్యపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆరెస్ల మధ్య ట్విట్ల దాడులు
విధాత, హైదరాబాద్ : సోషల్ మీడియా ట్విటర్ ఎక్స్ వేదికగా మూడు పార్టీల మధ్య ట్విటర్ రచ్చ సాగుతుంది. ప్రధానంగా మేడిగడ్డ కుంగుబాటు సమస్యపై ట్విట్ల వార్ సాగుతున్నప్పటికి ఎప్పటికప్పుడు తెరపైకి వస్తున్న సమస్యపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆరెస్ల మధ్య ట్విట్ల దాడులు..ప్రతిదాడులు సాగుతున్నాయి. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఈ ట్వీట్ల యుద్దం తీవ్ర రూపం దాల్చుతుండగా ఇందులో బీజేపీ కూడా భాగస్వామ్యమైంది.
నిన్న మేడిపండు చూడు మేలిమై ఉండు..దొబ్బినోడు చూడు దాక్కోనుండు అంటు మేడిగడ్డపై బీఆరెస్ తీరును, కేసీఆర్ మేడిగడ్డకు వెళ్లని వైఖరిని తప్పుబడుతూ కాంగ్రెస్ ట్వీట్ చేసింది. తాజాగా కేసీఆర్ ఎట్ల రావాలే మీకు బుద్ది ?.. సిగ్గుండాలే… మేడిగడ్డ కుంగుబాటుపై దేశమంతా దుమ్మెత్తిపోసినా సిగ్గురాకపాయే అంటూ ఆంగ్ల పత్రికల కథనాల పోస్టులతో కాంగ్రెస్ మరో ట్వీట్ చేసింది.
బీజేపీని లక్ష్యంగా చేసుకుని ప్రధాని మోడీని భారత ఆర్థిక వ్యవస్థకు స్పీడ్ బ్రేకర్ అంటూ రాహుల్గాంధీ చేసిన ట్వీట్ను సైతం తెలంగాణ కాంగ్రెస్ పోస్టు చేసింది. యూపీఏ ప్రభుత్వ హయాంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థకు నరేంద్ర మోదీ ‘స్పీడ్ బ్రేకర్’గా మారారని, కాంగ్రెస్.. పేదలకు సాధికారత కల్పించడం ద్వారా అభివృద్ధిని వేగవంతం చేసిందని పేర్కోంది.
అయితే నరేంద్ర మోడీ.. కొద్దిమంది స్నేహితుల ప్రయోజనాల కోసం దేశాన్ని ఖాళీ చేస్తున్నారని. విధానాల్లో దేశ ప్రజలను అగ్రగామిగా ఉంచకుండా దేశాభివృద్ధి అసాధ్యమని, అసత్య ప్రచారాలకు విరుద్ధంగా, ఆర్థిక రంగంలో కాంగ్రెస్కు బీజేపీ ప్రభుత్వం ఎక్కడా లేదని, ఇందుకు గణాంకాలే నిదర్శనమని ట్వీట్ చేసింది.
తామేమి తగ్గేదిలే అన్నట్లుగా బీఆరెస్ పార్టీ సైతం కాంగ్రెస్పై ట్వీట్ అస్త్రాలు సంధించింది. ఎవడేలుతున్నడు తెలంగాణ ? అని ప్రశ్నిస్తూ సచివాలయంలో జరిగే అధికారిక మీటింగ్లలో కాంగ్రెస్ నాయకులు, వారి బంధువులు హాజరవ్వడాన్ని ప్రశ్నిస్తూ..ఇలా అధికార దుర్వినియోగం చేయడమే ప్రజా పాలనా? అని బీఆరెస్ పార్టీ ట్వీట్ చేసింది.
వరి పంటలకు ట్యాంకర్లతో నీళ్లు అందిస్తున్న దృశ్యాలను జత చేసి ఇదేనా కాంగ్రెస్ మార్పు పాలన అని ప్రశ్నిస్తూ మరో ట్వీట్ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టుతో కేసీఆర్కు మంచి పేరు వచ్చిందని, ఆ ఆనవాళ్లు చెరిపేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి యత్నిస్తున్నారని, రైతు ప్రయోజనాలను దెబ్బ తీస్తే మేము ఊరుకోమని, మేడిగడ్డ రిపేర్ చేసి వానాకాలం లోపు రైతులకు నీళ్ళు ఇవ్వాలని మాజీ మంత్రి టీ.హరీశ్ రావు మరో ట్వీట్లో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ రక్షణ శాఖ భూములను కేంద్రం తెలంగాణకు కేటాయించిన అంశంపై గతంలో ఐదుగురు రక్షణ శాఖ మంత్రులకు కేటీఆర్ వినతి పత్రాలు అందించిన ఫోటోలను జతచేసి రక్షణ శాఖ భూముల కేటాయింపు విజయం బీఆరెస్ ఘనతగా ట్వీట్ చేసుకుంది.
ఇక బీజేపీ సైతం తన ప్రత్యర్థులుగా ఉన్న రెండు పార్టీలు కాంగ్రెస్, బీఆరెస్లను టార్గెట్గా చేసుకుని మేడిగడ్డ సమస్యపై చేసిన ట్వీట్ మూడు పార్టీల సోషల్ మీడియా వార్ను మరో మలుపు తిప్పింది. నువ్వు మేడిగడ్డ పోతున్నట్లు డ్రామా చెయ్యి..నువ్వు మమ్మల్ని ఆపినట్లు డ్రామా చెయ్యి అంటూ.. సరిపోయారు ఇద్దరూ అని రాసిన క్యాప్షన్తో కేటీఆర్ రేవంత్లు గతంలో కలిసివున్న ఫోటోను పోస్టు చేసింది. పార్లమెంటు ఎన్నికల ముంగిట మూడు ప్రధాన పార్టీల మధ్య సాగుతున్న ట్వీట్ల వార్ ఎన్నికల సమయంలో మరింత ముదురుతుందని రాజకీయ విశ్లేషకులు, నెటిజన్లు భావిస్తున్నారు.