విధాత: చైనా నిధుల వివాదం, ఉగ్రవాద సంబంధాల అభియోగంతో న్యూస్క్లిక్ అనే వార్తా సంస్థపై చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (UAPA) కింద ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు కేసు నమోదు చేశారు. న్యూస్క్లిక్ వార్తా సంస్థతో సంబంధం ఉన్న పలువురు జర్నలిస్టులు, వ్యాఖ్యాతల ఇండ్ల మంగళవారం తెల్లవారుజామున దాడులు జరిపారు. ఏడుగురు జర్నలిస్టుల ఇండ్లలోసహా 30 చోట్ల సోదాలు నిర్వహించారు. ఇద్దరు జర్నలిస్టులను అదుపులోకి తీసుకున్నారు. జర్నలిస్టుల నుంచి ఎలక్ట్రానిక్ పరికరాలను, ల్యాప్టాప్లు, టెలిఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఎమర్జెన్సీని గుర్తుచేసే విధంగా వార్తాప్రతినిధులు, వీడియో జర్నలిస్ట్ అభిసార్ శర్మ, సీనియర్ జర్నలిస్ట్ భాషా సింగ్, ప్రముఖ పాత్రికేయుడు ఊర్మిళేష్, న్యూస్క్లిక్ ఎడిటర్ ప్రబీర్ పుర్కాయస్థ, రచయిత గీతా హరిహరన్, ప్రఖ్యాత జర్నలిస్ట్, రాజకీయ వ్యాఖ్యాత ఆర్థిక వ్యవస్థ అయినంద్యో చక్రవర్తి, చరిత్రకారుడు సోహైల్ హష్మీ, వ్యంగ్యకారుడు, స్టాండ్-అప్ కామిక్ సంజయ్ రాజౌరా నివాసాల్లో సోదాలు జరిగాయి.
న్యూస్క్లిక్ రిపోర్టర్ని దక్షిణ ఢిల్లీలోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. సివిల్ డ్రెస్లో ఉన్న ఇద్దరు సహా ఏడుగురు పోలీసుల బృందం ఉదయం 7.15 గంటలకు అతని ఇంటికి వచ్చి గంటసేపు ప్రశ్నించినట్టు అధికారవర్గాలు వెల్లడించాయి. సీనియర్ జర్నలిస్టు ఊర్మిళేష్ను అదుపులోకి తీసుకున్నారు. ఉర్మిళేష్ని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసినట్టు ఆయన భార్య మీడియాకు వెల్లడించారు. జర్నలిస్టులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. అయితే పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.