ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత పాత్రపై బీఆరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ బహిరంగ చర్చకు రావాలని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి సవాల్
విధాత, హైదరాబాద్ : ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత పాత్రపై బీఆరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ బహిరంగ చర్చకు రావాలని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి సవాల్ విసిరారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉన్నాడో లేడో తెలియని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాజకీయ కక్షతోనే కవితను బీజేపీ అరెస్టు చేసిందంటూ ఆరోపించాడని, ఆమె అరెస్టుకు బీజేపీకి సంబంధం లేదని తాను మరోసారి స్పష్టం చేస్తున్నానని చెప్పారు. కవిత అరెస్టు వ్యవహారంలోబీజేపీని విమర్శిస్తే తాము ఖచ్చితంగా ప్రతిఘటిస్తామని, ప్రజల ముందు వాస్తవాలు పెడుతామన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత ఓ వ్యాపార సంస్థను ఏర్పాటు చేసి, బినామీలతో దందా నడిపి,ఆప్ ప్రభుత్వానికి వందల కోట్ల ముడుపులు ఇచ్చారని, దీనిపై ఈడీ ఇప్పటికే తగిన ఆధారాలు కోర్టుల ముందు పెట్టినందునే కవితకు ఎక్కడా బెయిల్ రాలేదని గుర్తు చేశారు. ఇంకా కడిగిన ముత్యం లాగా తిరిగి వస్తానని కవిత చెబుతున్నారని, ఎందులో కడుగుతారో వాళ్లకే తెలియాలని చురకలేశారు. కవిత ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వంతో చర్చలు జరిపారా లేదా కోట్ల రూపాయలు చేతులు మారలేదా అన్నదానిపై కేటీఆర్, కేసీఆర్ కుటుంబ సభ్యులు సమాధానం చెప్పాలన్నారు. తెలంగాణకు, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత అరెస్టుకు సంబంధం లేదని స్పష్టం చేశారు. అది ఢిల్లీలో లిక్కర్ వ్యాపారంకు సంబంధించిన వివాదం మాత్రమే అని బీజేపీ స్పష్టం చేస్తుందన్నారు.
బీఆరెస్ ప్రభుత్వం హయాంలో అన్ని రకాల మాఫియా రాజ్యం నడిచిందని, అన్ని రకాల అవినీతికి, దోపిడికి పాల్పడ్డారని, నిజాం పాలనను పొగుడుతూ నిజాం పోకడలతో పరిపాలన చేశారే తప్ప, ప్రజాస్వామ్యయుతంగా బీఆరెస్ ప్రభుత్వం పని చేయలేదన్నారు. అందుకే జనం వారిని ఓడించారన్నారు. బీఆరెస్ నేతలు ఇంకా అధికారంలో ఉన్నట్టే భావిస్తున్నారని, ఇంకా అబద్ధాలు చెప్పడం మానడం లేదని, అబద్ధాలతో ప్రజలను మభ్యపెట్టి రాజకీయాలు చేయడంలో కేసీఆర్కు, ఆ పార్టీ నేతలకు మించిన వారి లేరని, అబద్దాలతోనే పదేళ్లు పాలించారని విమర్శించారు. కేంద్రంలో మూడోసారి ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందని, 400 ఎంపీ సీట్లు గెలవబోతుందన్నారు. తెలంగాణలోనూ 10నుంచి 12సీట్లు గెలవబోతున్నామన్నారు.