Vande Bharat Express | కొత్తగా నాలుగు మార్గాల్లో పట్టాలెక్కనున్న వందే భారత్..! రూట్ల వివరాలు ఇవే..!
Vande Bharat Express | భారతీయ రైల్వే ప్రస్తుతం పెద్ద ఎత్తున వందే భారత్ రైళ్లను ప్రవేశపెడుతున్నది. ఇప్పటికే 20పైగా రూట్లలో సెమీ హైస్పీడ్ రైళ్లను తీసుకువచ్చింది. పలు మార్గాల్లో ఈ రైళ్లకు భారీగా డిమాండ్ ఉన్నది. ఈ నేపథ్యంలో మరిన్ని మార్గాల్లో వందే భారత్ రైళ్లను పట్టాలెక్కించేందుకు భారతీ రైల్వే భావిస్తున్నది. ఈ నెల చివరివారంలో మరో కొత్త నాలుగు మార్గాల్లో రైళ్లను ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నది. ఇందులో భాగంగా ఢిల్లీ - ఛండీగఢ్ మార్గంలో […]

Vande Bharat Express | భారతీయ రైల్వే ప్రస్తుతం పెద్ద ఎత్తున వందే భారత్ రైళ్లను ప్రవేశపెడుతున్నది. ఇప్పటికే 20పైగా రూట్లలో సెమీ హైస్పీడ్ రైళ్లను తీసుకువచ్చింది. పలు మార్గాల్లో ఈ రైళ్లకు భారీగా డిమాండ్ ఉన్నది. ఈ నేపథ్యంలో మరిన్ని మార్గాల్లో వందే భారత్ రైళ్లను పట్టాలెక్కించేందుకు భారతీ రైల్వే భావిస్తున్నది. ఈ నెల చివరివారంలో మరో కొత్త నాలుగు మార్గాల్లో రైళ్లను ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నది. ఇందులో భాగంగా ఢిల్లీ – ఛండీగఢ్ మార్గంలో సెమీ హైస్పీడ్ రైలును తీసుకురావాలని భావిస్తున్నది.
ఢిల్లీ నుంచి చండీగఢ్కు 243 కిలోమీటర్ల దూరం ఉన్నది. రెండు రెండున్నర గంటల్లోగా చేరుకునేలా రైలును నడిపించేందుకు ప్లాన్ చేస్తున్నది. దీంతో పాటు చెన్నై – తిరునల్వేలి (622 కిలోమీటర్లు), గ్వాలియర్ – భోపాల్ (432), లక్నో – ప్రయాగ్రాజ్ (200) మార్గాల్లోనూ వందే భారత్ రైళ్లను నడిపేందుకు ప్రణాళిక రూపొందించింది. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఆయా రైళ్లు ఎనిమిది కోచ్లు ఉంటాయని.. డిమాండ్ ఎక్కువ ఉంటే.. ఒకే మార్గంలో 16 కోచ్లను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. మరో వైపు పలు మార్గాల్లో ఆక్యుపెన్సీ తక్కువగా ఉండడంతో దీన్ని భర్తీ చేసేందుకు రైల్వేశాఖ కసరత్తు చేస్తున్నది.
ఇందులో భాగంగా పలు మార్గాల్లో ఛార్జీలను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నది. ఇదిలా ఉండగా.. ఏప్రిల్ ఒకటి నుంచి జూన్ 29 వరకు నడిచిన వందే భారత్ రైళ్ల అధికారిక ఆక్యుపెన్సీ డేటా ప్రకారం.. 60శాతం కంటే తక్కువ ఆక్యుపెన్సీ ఉన్నది. న్యూఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, హిమాచల్ప్రదేశ్లను కలిపే అందౌరా నుంచి న్యూఢిల్లీ వందే భారత్ రైలులో వెయ్యి మంది ప్రయాణికులను తీసుకెళ్లే సామర్థ్యం ఉంది. 16 కోచ్లు ఉండగా.. సగటు ఆక్యుపెన్సీ 61శాతం మాత్రమే ఉన్నది. గోవా – ముంబయి వందే భారత్ రైలు ఆక్యుపెన్సీ 55శాతం ఉండగా.. ఇది తరుచూ మారుతూ వస్తుంది. రుతుపవనాల సీజన్లో ఎక్కువగా గోవా వెళ్లేందుకు ఇష్టపడరు. సెలవుల సీజన్ ముగియడంతో ఆక్యుపెన్సీ తక్కువగా ఉంటుందని రైల్వే అధికారులు తెలిపారు. అలాగే ఇండోర్ – భోపాల్ మధ్య తిరుగు ప్రయాణంలో ఆకుపెన్సీ 29శాతం తక్కువగా ఉందని అధికారులు పేర్కొంటున్నారు.
ఇదిలా ఉండగా.. ప్రస్తుతం డిమాండ్ను పెంచేందుకు గ్రేడెడ్ పద్ధతిలో రైళ్ల టికెట్ చార్జీలను 25శాతం వరకు తగ్గించాలని రైల్వేబోర్డు నిర్ణయించింది. ఇది వందే భారత్కే పరిమితం కాకుండా చైర్కార్స్, ఎగ్జిక్యూటివ్ చైర్కార్ ఉన్న అన్ని రైళ్లకు వర్తింపజేయాలని నిర్ణయించింది. జోనల్ స్థాయిలో డిమాండ్ను బట్టి తగ్గించేందుకు అధికారం ఇచ్చింది. అయితే, కొన్ని రూట్లలో ఆక్యుపెన్సీ తక్కువగా ఉండగా.. మరికొద్ది రూట్లలో విపరీతమైన డిమాండ్ ఉన్నది. కొన్ని రూట్లలో వందకుపైగా ఆక్యుపెన్సీ ఉన్నది. త్రివేండ్రం-కాసరగోడ్ (172-180శాతం), ముంబై-గాంధీనగర్ (129-134శాతం), హౌరా-న్యూ జాల్పాయ్గురి, (103-108శాతం) తదితర మార్గాల్లో అధికంగా ఆక్యుపెన్సీ ఉన్నది.