బస్సులు మేడారానికే.. ఇతర రూట్‌లలో తగ్గింపు

తెలంగాణ కుంభమేళాగా ప్రాచుర్యం పొందిన మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ మహా జాతరకు తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం 6వేల ప్రత్యేక బస్సులను నడుపుతుందని, ఈ కారణంగా రాష్ట్రంలోని ఇతర రూట్‌లలో రోజువారిగా తిరిగే బస్సుల సంఖ్య తగ్గించడం జరిగిందని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు

  • Publish Date - February 20, 2024 / 09:49 AM IST
  • జాతర పూర్తయ్యక తిరిగి పూర్తి స్థాయిలో సేవలు
  • ఆర్టీసీ ఎండీ వీ.సీ. సజ్జనార్‌


విధాత, హైదరాబాద్: తెలంగాణ కుంభమేళాగా ప్రాచుర్యం పొందిన మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ మహా జాతరకు తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం 6వేల ప్రత్యేక బస్సులను నడుపుతుందని, ఈ కారణంగా రాష్ట్రంలోని ఇతర రూట్‌లలో రోజువారిగా తిరిగే బస్సుల సంఖ్య తగ్గించడం జరిగిందని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి బస్సులు ఇప్పటికే మేడారానికి వెళ్లాయని, ముఖ్యంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, కరీంనగర్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో 51 క్యాంపులను ఏర్పాటు చేసి.. అక్కడి నుంచి ఈ ప్రత్యేక బస్సులను మేడారానికి నడుపుతున్నామన్నారు. రెండేళ్లకో సారి జరిగే ఈ మహాజాతరలో భక్తుల రద్దీకి అనుగుణంగానే ఈ 6 వేల ప్రత్యేక బస్సులను ఆర్టీసీ నడపుతోందనన్నారు.


జాతరకు మహాలక్ష్మి పథకం ఉచిత బస్సు ప్రయాణ వసతి అమలు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆదేశాల మేరకు భక్తులకు అసౌకర్యం కలగకుండా యాజమాన్యం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు. భక్తులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు ఇంత పెద్దమొత్తంలో బస్సులను మేడారం జాతరకు తిప్పుతున్నదున.. రెగ్యూలర్ సర్వీసులను తగ్గించడం జరిగిందన్నారు. దీంతో సాధారణ ప్రయాణికులకు కొంత అసౌకర్యం కలిగే అవకాశం ఉందని, జాతర సమయంలో భక్తులకు, ఆర్టీసీ సిబ్బందికి పెద్ద మనుసుతో సహకరించాలని సాధారణ ప్రయాణికులకు విజ్ఞప్తి చేస్తున్నానని సజ్జనార్ తెలిపారు.


జాతర పూర్తయ్యేవరకు తగు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని వారిని కోరుతున్నానని, తెలంగాణకే తలమానికమైన ఈ జాతరను విజయవంతం చేయడానికి ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నానని కోరారు. మేడారంలో 55 ఎకరాల్లో సువిశాలమైన బేస్‌ క్యాంప్ ఏర్పాటు చేశామని, భక్తుల కోసం 7 కిలోమీటర్ల పొడువున 50 క్యూలైన్లు ఏర్పాటు చేశామని, రాష్ట్రవ్యాప్తంగా 51 ప్రాంతాల్లో ప్రత్యేక క్యాంపులు, 30 ఎకరాల విస్తీర్ణంలో 5 చోట్ల బస్సుల పార్కింగ్ ఏర్పాటు చేశామన్నారు. తాడ్వాయిలో ఎమర్జెన్సీ టికెట్‌ ఇష్యూయింగ్ కేంద్రం ఏర్పాటు చేశామని, బస్సుల మెయిన్‌టెన్స్‌ కోసం 3 చోట్ల గ్యారేజీలు ఏర్పాటు చేశామని తెలిపారు. మొత్తంగా 15 వేల మంది ఆర్టీసీ సిబ్బంది జాతర విధుల్లో పాల్గొంటున్నారని తెలిపారు.