Warangal: మావోయిస్టు పార్టీ నేత దేవేందర్ రెడ్డి అరెస్టు: CP రంగనాథ్

Warangal దండకారుణ్య స్పెషల్ జోనల్ సభ్యుడిగా బాధ్యత 20 లక్షల రివార్డు, పలు కేసుల్లో నిందితుడు మరో సానుభూతిపరుడి అరెస్టు విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: మావోయిస్టు పార్టీ దండకారుణ్య స్పెషల్ జోనల్ సభ్యుడిగా పనిచేస్తున్న కేంద్ర కమిటీ సభ్యుడు మూల దేవేందర రెడ్డి అలియాస్ మాధవ్ అలియాస్ కరప అలియాస్ నందుతో పాటు పార్టీ సానుభూతిపరున్ని గురువారం సాయంత్రం వరంగల్(Warangal) పోలీసులు అరెస్టు చేశారు. మంచిర్యాల జిల్లా బబ్బేరు చెలుక గ్రామానికి చెందిన మూల దేవేందర […]

Warangal: మావోయిస్టు పార్టీ నేత దేవేందర్ రెడ్డి అరెస్టు: CP రంగనాథ్

Warangal

  • దండకారుణ్య స్పెషల్ జోనల్ సభ్యుడిగా బాధ్యత
  • 20 లక్షల రివార్డు, పలు కేసుల్లో నిందితుడు
  • మరో సానుభూతిపరుడి అరెస్టు

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: మావోయిస్టు పార్టీ దండకారుణ్య స్పెషల్ జోనల్ సభ్యుడిగా పనిచేస్తున్న కేంద్ర కమిటీ సభ్యుడు మూల దేవేందర రెడ్డి అలియాస్ మాధవ్ అలియాస్ కరప అలియాస్ నందుతో పాటు పార్టీ సానుభూతిపరున్ని గురువారం సాయంత్రం వరంగల్(Warangal) పోలీసులు అరెస్టు చేశారు.

మంచిర్యాల జిల్లా బబ్బేరు చెలుక గ్రామానికి చెందిన మూల దేవేందర రెడ్డి అలియాస్ మాధవ్ (63) తో పాటు హనుమకొండ జిల్లా వికాస్ నగర్ కు చెందిన పార్టీ సానుభూతిపరుడు, రియల్ ఎస్టేట్ వ్యాపారి గుర్రం తిరుపతిరెడ్డి (53)ని సుబేదారి పోలీసులు అరెస్టు చేశారు.

వీరినుండి 21వేల రూపాయల నగదు, విప్లవ సాహిత్యం, ఒక పెన్ డ్రైవ్, ఒక సెల్ ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టుకు సంబంధించిన వివరాలను వరంగల్ సిపి ఏవి రంగనాథ్ శుక్రవారం మీడియాకు వెల్లడించారు.

దేవేందర్ రెడ్డి ప్రస్తుతం మావోయిస్టు పార్టీ దండకారుణ్య స్పెషల్ జోనల్ సభ్యుడి హోదాలో సెంట్రల్ టెక్నికల్ విభాగంలో టీం సభ్యుడిగా పనిచేస్తున్నాడు. ఈయనపై 20 లక్షల రివార్డు ఉంది పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు.

మూల దేవేందర్ రెడ్డి ప్రస్థానం

దేవేందర్ రెడ్డి తన స్వగ్రామంలో 7వ తరగతి వరకు చదువుకున్నారు. ద1978లో పీపుల్స్ వార్ సిద్దాంతాలకు ఆకర్షితుడై సానుభూతిపరుడిగా పనిచేసి సి.ఓ వెంకటరెడ్డి ప్రోత్సహంతో 1982లో సిరిపూర్ దళ సభ్యుడిగా చేరాడు. మూడు సంవత్సరాల పాటు సిరిపూర్ దళం పనిచేసి పలు విధ్వంస, చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గోన్నాడు. 1985లో ఆహేరి దళంకు బదిలీ చేసారు. 1987 సంవత్సరంలో దళ సభ్యురాలు ఆత్రం బయ్యక్క అలియాస్ జ్యోతిని వివాహం చేసుకున్నాడు.

1988 లో అహేరి దళం, 1989 లో మహారాష్ట్ర ఏరియా దళానికి డిప్యూటీ కమాండర్ పనిచేసాడు. 1994లో జరిగిన ఎదురుకాల్పుల్లో దేవేందర్ రెడ్డి భార్య జ్యోతి మరణించింది. 1996లో దేవేందర్రెడ్డి డి.సి.యం సభ్యుడి హోదాలో టెక్నికల్ డిపార్ట్మెంట్ కమాండర్ గా 2003 వరకు పనిచేసాడు. ఈ సమయంలో 850 పైగా తుపాకులను తయారు చేసి పార్టీకి అందజేసాడు.

దళ సభ్యురాలైన దేవియా హుస్సేండి అలియాస్ రూపిని దేవేందర్ రెడ్డి రెండో వివాహం చేసుకున్నాడు. 2007లో దేవేందర్ రెడ్డి, తన భార్య, మరికొద్దిమందితో కల్సి తయారు చేసిన తుపాకులను చర్ల మీదుగా తీసుకెళ్ళుతుండగా పోలీసులకు పట్టుబడి 2009 వరంగల్ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవించాడు.

జైలు నుండి విడుదల అనంతరం తిరిగి అజ్ఞాతంలోకి వెళ్ళాడు. 2017 వరకు దేవేందర్ రెడ్డి వివిధ రకాల తుపాకులు, మందుపాతరలు, రాకెట్ లాంచర్లు తయారు చేసి దళాలకు అందించడంలో కీలకంగా నిలవడంతో ఇతనిని పార్టీ అధిష్టానం దండకారుణ్య స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడిగా నియమించింది.

ప్రస్తుతం కేంద్ర విభాగానికి చెందిన సభ్యులతో పాటు, దండకారుణ్య, నార్ట్ జోన్కు చెందిన కీలక మావోయిస్టు నాయకులతో పనిచేసాడు. కొద్దికాలంగా కంటిచూపు సమస్య రావడంతో తెలంగాణ రాష్ట్ర కమిటీ అదేశాల మేరకు చికిత్స కోసం హైదరాబాద్ వెళ్ళుతున్న క్రమంలో దేవేందర్ రెడ్డి సానుభూతిపరుడు తిరుపతి రెడ్డితో కల్సి సుబేదారి బస్ స్టాప్ వద్ద పోలీసులకు చిక్కారు.

మూల దేవేందర రెడ్డి అలియాన్ మాధవ్ పాల్పడిన నేరాలు

దేవేందర్ రెడ్డి కేంద్ర, రాష్ట్ర నాయకులతో కల్సి 33కి పైగా నేరాలకు పాల్పడ్డాడు. 2010 లో నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్, హిడుమ, మరో మూడు వందల మంది మావోయిస్టులతో కల్సి ఛత్తీసఘడ్ రాష్ట్రం సుకమా జిల్లా చింతగుప్ప పోలీస్ స్టేషన్ పరిధిలోని తాడిమెట్ల అటవీ ప్రాంతంలో కాల్పులు జరిపి 75 మంది సిఆర్పిఎఫ్ పోలీసులకు హత్య చేసి వారి నుండి తుపాకులను ఎత్తుకెళ్ళిన సంఘటనలో కీలక నిందితుడు.

అలాగే నారాయణపూర్ జిల్లా దౌడాయి పోలీస్ స్టేషన్ పరిధిలో 27 మంది పోలీసులు, 2011 సంవత్సరంలో దంతేవాడ జిల్లా బూరుగూడ ఆటవీ ప్రాంతంలో ఏడుగురు సిఆర్పిఎఫ్ పోలీసులు ప్రయాణిస్తున్న వాహనాన్ని మందుపాతరతో పేల్చి హత్య చేసిన సంఘటన, 2012లో బాసనగూడా పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు పోలీసులు, 2013లో దమ్ముగూడెం వద్ద హోంగార్డ్.

ఇదే సంవత్సరంలో ఆవులపల్లి పోలీస్ స్టేషన్పరిధిలో నలుగురు పోలీసులు, 2014లో సుకుమా జిల్లా తొంగ్పాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 11 మంది సిఆర్పిఎఫ్, నలుగురు సివిల్ పోలీసులు, 2016లో దంతేవాడ జిల్లా, కౌకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏడుగురు సిఆర్పిఎఫ్ పోలీసులు, 2017లో బెజ్జి పోలిస్ స్టేషన్ పరిధిలోని 11మంది సిఆర్ఎఫ్, ఇదే సంవత్సరంలో చింతగుప్ప పోలీస్ స్టేషన్ పరిధిలో 25 మంది పోలీసులు, 2018 సంవత్సరంలో కిష్టారం ప్రాంతంలో 9 మంది పోలీసులు, 2020 సంవత్సరంలో ఇర్చపల్లి అటవీ ప్రాంతంలో ముగ్గురు, చింతగుప్పా అటవీ ప్రాంతంలో 17మంది పోలీసులు, 2021లో టేకుల గుర్మా ఆటవీ ప్రాంతంలో 22 మంది పోలీసులపై కాల్పులు జరిపి హత్య చేసి చనిపోయిన పోలీసులకు చెందిన తుపాకులను ఎత్తుకెళ్ళి సంఘటల్లో దేవేందర్ రెడ్డి కీలకంగా నిలవడంతో పాటు ఛతీస్తగడ్ మరియు ఖమ్మం సరిహద్దు ప్రాంతాల్లో ఇన్స్ఫార్మర్ నేపంతో సాధారణ పౌరులను హత్య చేయడంతో పాటు, వివిధ ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడంలో దేవేందర్ రెడ్డి నేరస్థుడు, దేవేందర్ రెడ్డిపై 20లక్షల రూపాయల రివార్డును వుంది.

పార్టీకి సహకరిస్తున్న తిరుపతిరెడ్డి

పోలీసులు అరెస్టుచేసిన సానుభూతిపరుడు తిరుపతి రెడ్డి 1989లో ఉద్యోగరీత్యా దుబాయికి వెళ్ళి వచ్చి తన గ్రామంలో కెనాల్ కాంట్రాక్ట్ పనులు చేయించే తిరుపతిరెడ్డికి దడబోయిన స్వామి ఆలియాస్ ప్రభాకర్తో పరిచయం కావడంతో జనగాం ఏరియా పీపుల్స్వార్ దళాలకు నిత్యవసర వస్తువులను అందజేసేవాడు. ఇదే సమయంలో తిరుపతి రెడ్డికి కంకణాల రాజిరెడ్డి అలియాస్ వెంకటేష్ తో పరిచయం అయింది.

ఈ పరిచయం. తిరుపతి రెడ్డి మావోయిస్టు నాయకులకు కావల్సి వస్తువులను అందజేయడంతో పాటు, దళసభ్యులకు రహస్యంగా చికిత్స అందించేవాడు. ఇదే రీతిలో కంటి చికిత్స కోసం నిన్న సాయంత్రం తిరుపతి రెడ్డి, మావోయిస్టు దేవేందర్ రెడ్డితో కల్సి హైదరాబాద్‌కు వెళ్ళే క్రమంలో సుబేదారి పోలీసులకు చిక్కారు. ఈ మీడియా సమావేశంలో ఏ.వి.రంగనాథ్, హనుమకొండ ఏసీపీ కిరణ్ కుమార్, సుబేధారి ఇన్స్ స్పెక్టర్ షూకూర్ పాల్గొన్నారు.