భూకబ్జాలు నిరూపిస్తే రాజీనామా చేస్తా: మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

నిరూపించలేక పోతే వారు రాజకీయ సన్యాసం తీసుకోవాలి రేవంత్ చంద్రబాబు ఏజెంట్! రేవంత్, షర్మిల మాటలు అబద్ధాలు ఇంటర్ చేశా..ప్రజల మనోభావాలు చదివిన రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఫైర్ విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: భూ కబ్జాలకు పాల్పడినట్లు తనపై చేసిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల చేసిన ఆరోపణలను నిరూపిస్తే రాజీనామా చేస్తానని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు […]

  • By: Somu    latest    Feb 17, 2023 11:28 AM IST
భూకబ్జాలు నిరూపిస్తే రాజీనామా చేస్తా: మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
  • నిరూపించలేక పోతే వారు రాజకీయ సన్యాసం తీసుకోవాలి
  • రేవంత్ చంద్రబాబు ఏజెంట్!
  • రేవంత్, షర్మిల మాటలు అబద్ధాలు
  • ఇంటర్ చేశా..ప్రజల మనోభావాలు చదివిన
  • రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఫైర్

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: భూ కబ్జాలకు పాల్పడినట్లు తనపై చేసిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల చేసిన ఆరోపణలను నిరూపిస్తే రాజీనామా చేస్తానని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సవాల్ విసిరారు.

నిరూపించలేకపోతే వారు తమ పదవులకు రాజీనామా చేసి, రాజకీయ సన్యాసం తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాలకుర్తి నియోజకవర్గంలో చేపట్టిన పాద యాత్రల సందర్భంగా ఇద్దరూ చేసిన వ్యాఖ్యల పై మంత్రి ఫైర్ అయ్యారు. జనగామలో కేసీఆర్ బర్త్ డే సందర్భంగా కేక్ కట్ చేసిన అనంతరం శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కామెంట్స్ ఇలా ఉన్నాయి. నేను ఇంటర్ చేశా..పెద్దగా చదువుకోకపోయినా.. ప్రజల మనోభావాలు చదివిన. ప్రజావసరాలను తీరుస్తున్నా.. అభివృద్ధి చేస్తున్నా.. నన్ను అందుకే గెలిపిస్తూ వస్తున్నారు. 6 సార్లు ఓటమి లేకుండా గెలిచిన ఎమ్మెల్యేని, ఒకసారి ఎంపీ గా కూడా గెలిచిన అంటూ ఎర్రబెల్లి వివరించారు.

రేవంత్ చంద్రబాబు ఏజెంట్

రేవంత్ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన లేదు. చంద్రబాబుకు ఏజెంట్ గా ఉన్నాడు అంటూ ఎర్రబెల్లి విమర్శించారు. నేను తెలంగాణ కు అనుకూలంగా చంద్రబాబుతో లెటర్ ఇప్పించాను. తెలంగాణ కోసం నేను పాటుపడినానని చెప్పారు.తెలంగాణ కోసం రేవంత్ ఏమి చేశాడో చెప్పాలి. రేవంత్.. నీ మీద ఉద్యమ కేసు ఒక్కటి అయినా ఉందా?!.

రేవంత్ మాత్రమే కాదు, ఆయన చుట్టూ ఉన్న వాళ్ళందరి పైనా భూ దందాలో కబ్జా కేసులు ఉన్నాయి. వాళ్ళు ప్రజల కోసం జైలుకు పోలే. కుంభకోణాలు, కుట్రలు, కుతంత్రాల కేసుల్లో జైలుకు పోయారు. రేవంత్, ఓటుకు నోటు కేసు లో జైలు కు పోయాడు. వాళ్ళు ఎన్నో కుంభకోణాలు, కుట్రలు, కుతంత్రాలు చేశారు.

నేను ప్రజల కోసం జైలుకు పోయాను

నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో నేను ప్రజల కోసం జైలుకు పోయానని మంత్రి ఎర్రబెల్లి వివరించారు. ప్రజల కోసం కేసులు అనుభవిస్తున్నాను.నీటి కోసం బాబ్లీ కి పోయి, పోలీస్ లతో దెబ్బలు తిన్నాను. గ్రానైట్ సమస్యలపై పోరాడితే, అనంతపూర్ లో కేసులు పెట్టారు. నేను రాజకీయాల్లో మళ్లీ గెలుస్తా.. ఎక్కడ నిలబెట్టిన మళ్ళీ మళ్ళీ గెలుస్తా. రేవంత్…నీవు నీ కొడంగల్ లో గెలుస్తవా? మల్కాజిగిరి లో మళ్లీ పోటీ చేస్తావా? నీవు నా గురించి మాట్లాడే వాడివయ్యావా? నీ గురించి నీ కాంగ్రెస్ వాళ్లే మాట్లాడుతున్నారు. నీవు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ నాశనమే.

రేవంత్ వల్లే కాంగ్రెస్ పతనం

గతంలో 15 సీట్లు గెలిచిన కాంగ్రెస్, ఇప్పుడు 5 సీట్లు కూడా గెలవ లేని స్థితికి రేవంత్ వల్లే వచ్చిందని మంత్రి ఎర్రబెల్లి మండిపడ్డారు. మాకు వందల ఎకరాల భూములు ఉండే…అమ్ముకుంటూ వస్తున్న… ప్రజా సేవ చేస్తున్నా.. ఇప్పుడు 100 ఎకరాలు కూడా లేవు. మీ పాద యాత్ర ను నిలిపి వేస్తామని మా పార్టీ కార్యకర్తలు, ప్రజలు పట్టు పడితే, నేనే, వద్దని వారించిన. ఒకవేళ అడ్డుకావాలనుకుంటే, మీరు జనగామ జిల్లాలో, పాలకుర్తి నియోజకవర్గం లో తిరిగే వారా? అంటూ మంత్రి ప్రశ్నించారు.

మీ నాయన పేరు చెడగొట్టకు

అమ్మా! షర్మిలా..కొద్దో గొప్పో మీ నాయినకు మంచి పేరు ఉంది. దాన్ని చెడగొట్టకు అంటూ మంత్రి ఎర్రబెల్లి షర్మిలకు హితవు పలికారు. మాటలు మంచిగా రానివ్వమ్మా..కొంచెమైనా.. సంస్కారాన్ని పాటించి మాట్లాడు.నువ్వు మహిళ వి అన్న సంగతి మరచి పోవద్దు. జిల్లా కేంద్రానికి మెడికల్ కాలేజీ ఇచ్చాక. పెద్ద హాస్పిటల్ వచ్చింది. జనగామ కు సమీపంలోనే ఉన్న పాలకుర్తికి ఆ అవసరం లేదని మాత్రమే ఇవ్వలేదు. పాలకుర్తి, స్టేషన్ ఘనపూర్ కు డిగ్రీ కాలేజీ మంజూరైన విషయం తెలుసుకోమని మంత్రి చెప్పారు.

కాంట్రాక్టు పాదయాత్రలు

500 మంది కిరాయి గూండాలు
200 కార్లు… కాంట్రాక్ట్ పద్ధతిలో పాద యాత్ర చేస్తున్న మీరు మా గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎర్రబెల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్, షర్మిల లు పాద యాత్రల పరువు తీస్తూ, ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తూ, రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారు. కెసిఆర్ లేకపోతే తెలంగాణ ఎడారి అయ్యేదన్నారు.

ఇవ్వాళ గ్రామాల్లో చెరువులు నీటితో నిండి… నిండు కుండలా ఉన్నాయి.మీ కళ్ళకు ఇవి కనిపించవు. అదే పనిగా విమర్శిస్తారు. ఆరోపణలు చేస్తారు. ప్రజలు వాటిని నమ్మే స్థితిలో లేరు. మీ కల్లబొల్లి కబురులు కట్టి పెట్టండంటూ ఎర్రబెల్లి హెచ్చరించారు. ఈ సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి తో పాటు స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, జనగామ zp చైర్మన్ సంపత్ రెడ్డి, ఎడవెల్లి కృష్ణా రెడ్డి, తదితర నాయకులు ఉన్నారు.