యువత రాజకీయాల్లోకి రావాలి: సీఎం రేవంత్

కేరళలోని అలప్పుళలో మెరిట్ విద్యార్థులకు అందించే “ఎంపీ మెరిట్ అవార్డ్-2025”కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేసీ వేణుగోపాల్ ఎల్లప్పుడూ పేదల పట్ల, అణగారిన వర్గాల కోసం పోరాడుతూనే ఉన్నారు

యువత రాజకీయాల్లోకి రావాలి: సీఎం రేవంత్
  • విద్య అనేది గొప్ప బహుమతి
  • బీజేపీ యువత హక్కులను కొల్లగొడుతోంది

 

హైదరాబాద్, ఆగస్టు 31(విధాత): కేరళలోని అలప్పుళలో మెరిట్ విద్యార్థులకు అందించే “ఎంపీ మెరిట్ అవార్డ్-2025”కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేసీ వేణుగోపాల్ ఎల్లప్పుడూ పేదల పట్ల, అణగారిన వర్గాల కోసం పోరాడుతూనే ఉన్నారు. అణిచివేతకు, అన్యాయానికి గురవుతున్న బాధితుల తరఫున వేణుగోపాల్ గొంతుకగా నిలుస్తున్నారన్నారు. కేసీ వేణుగోపాల్ తన నియోజకవర్గంతో పాటు కేరళ రాష్ట్రానికే కాకుండా యావత్ దేశంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ, ప్రత్యేకించి మహిళలు, పిల్లల న్యాయం కోసం, వారి అభ్యున్నతి కోసం నిరంతరం పాటుపడుతున్నారు. వేణుగోపాల్ 2006లో ప్రారంభించిన పొంథువల్ (ఎంపీ) మెరిట్ అవార్డులకు దేశంలోనే చాలా ప్రత్యేకత ఉందన్నారు.

10 వ తరగతి, 12 వ తరగతి విద్యార్థినీ విద్యార్థుల్లో అత్యుత్తమ ప్రతిభను గుర్తించి వారిని ప్రోత్సహించడానికి, వారిలో ఒక స్ఫూర్తిని నింపడానికి ఈ మెరిట్ అవార్డులు ఎంతగానో దోహదపడుతున్నాయి. ఈ ఏడాది వంద శాతం ఫలితాలను సాధించిన 150 పాఠశాలల్లో దాదాపు 3,500 లకుపైగా ప్రతిభ కలిగిన విద్యార్థులకు అవార్డులు అందిస్తున్నారు. దేశంలో విద్యకు, కేరళ రాష్ట్రానికి బలమైన సంబంధం ఉంది. దేశంలో వంద శాతం అక్షరాస్యత సాధించిన తొలి రాష్ట్రం కేరళ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ రాష్ట్రంలో అమలు చేస్తున్న వయోజన విద్యా కార్యక్రమం అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందన్నారు.

కేరళ రాష్ట్రంలో విద్యా రంగానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు, 10 వ, 12 వ తరగతి తర్వాత సున్నా శాతం డ్రాప్ అవుట్స్ సాధించడమంటే అందులో ఆశ్చర్యమేమీ ఉండదన్నారు. విద్య అనేది మనకు లభించిన ఒక గొప్ప బహుమతి, విద్య అన్నది ఒక గొప్ప ఆయుధం. అదే అందరికీ గొప్ప శక్తి.. అని నేను చాలా బలంగా విశ్వసిస్తానన్నారు. అలాంటి విద్యకు ప్రాధాన్యతనిస్తున్న దైవ భూమి కేరళ రాష్ట్రం.

తెలంగాణలో విద్యాభివృద్ధికి పెద్ద ఎత్తున దృష్టి సారించాం. విద్యకున్న ప్రాధాన్యత గురించి నేను ప్రతి సందర్భంలోనూ ప్రజలకు చెబుతున్నా. ప్రభుత్వం చేసే సంక్షేమం, అభివృద్ధి, సంస్కరణలు ఏది చేసినా విద్య మనకు అత్యంత ప్రాధాన్యత కలిగిందని సీఎం పేర్కొన్నారు.వచ్చే పదేళ్లలో తెలంగాణకను 1 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగాపెట్టుకున్నామని, 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిదేందుకు కృషి చేస్తున్నామన్నారు.

తెలంగాణలో పేదలకు నాణ్యమైన విద్యను అందించాలని సంకల్పించాం, కేవలం 55 రోజుల్లో 11055 ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. వంద నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మించబోతున్నామని, ఒక్కో స్కూల్ కు రూ.200 కోట్లు ఖర్చుతో 25 ఎకరాల్లో నిర్మించబోతున్నామన్నారు. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా నాణ్యమైన విద్యను అందించాలని సంకల్పించామని, యువతలో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామన్నారు. దీనికి ఆనంద్ మహీంద్రాను చైర్మన్ గా నియమించామని, ఐటీఐ లను ఏటీసీలుగా అప్ గ్రేడ్ చేశామన్నారు. ఒలంపిక్స్ లక్ష్యంగా స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ అకాడమీని ఏర్పాటు చేసుకుంటున్నామని, విద్యార్థుల్లో ఒక స్ఫూర్తిని నింపడానికి ఇలాంటి మంచి కార్యక్రమం చేపట్టిన కేసీ వేణుగోపాల్‌కి అభినందనలు తెలిపారు.

ఈ రోజు దేశంలో నెలకొన్న పరిస్థితులను గమనిస్తున్నాం. ఓట్ చోరీకి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా పెద్ద ఉద్యమం చేస్తున్నామన్నారు. ప్రతి భారతీయుడి ఓటు హక్కును కాపాడాలని, రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి ప్రతి ఒక్కరం కలిసికట్టుగా పోరాటం చేయాల్సిన అవసరముందని వెల్లడించారు.

కేరళ రాష్ట్రానికి ఎన్నికలు రాబోతున్నాయి. 2026లో జరిగే ఎన్నికలు కేవలం కేరళ అసెంబ్లీ ఎన్నికలుగా భావించకండి. అవి 2029 లో దేశ భవిష్యత్తుని నిర్ణయించే ఎన్నికలవుతాయన్నారు. దేశంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడికి రాజీవ్ గాంధీ ఓటు హక్కు కల్పించారు. అదే బీజేపీ నాయకుడు నరేంద్ర మోదీ పౌరుల నుంచి ఓటు హక్కును కొల్లగొడుతున్నారని విమర్శించారు.

2029 లో జరగబోయే లోక్ సభ ఎన్నికలు ఈ రెండు శక్తుల మధ్య జరగబోతున్నాయి. దేశంలోని యువత ఈ తేడాను గమనించాలి, 21 ఏళ్ల వయసున్నఐఏఎస్‌లు జిల్లాలను సమర్ధవంతంగా నడుపుతున్నప్పుడు 21 ఏళ్ల వయసున్న యువత ఎమ్మెల్యేలుగా ఎందుకు పోటీ చేయకూడదని సీఎం అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఆ దిశగా మనం రాజ్యాంగాన్ని సవరించుకోవాల్సిన అవసరం ఉందని, యువతకు ఎమ్మెల్యేలుగా పోటీ చేసే అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉందని, యువత తమలోని శక్తిని గుర్తించాలని అన్నారు. రాజ్యాంగ పరిక్షణ కోసం పని చేస్తున్న కాంగ్రెస్ పార్టీ వద్ద ఆర్థిక బలం లేదు, మీడియా మద్దతు లేదు, కేవలం యువత, యువతలోని శక్తిని నమ్ముకుని కాంగ్రెస్ పోరాటం సాగిస్తోందన్నారు. బీజేపీ యువత హక్కులను కొల్లగొడుతోందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు.