2010లో జరిగిన ఒక కార్యక్రమంలో రెచ్చగొట్టే ఉపన్యాసాలు చేశారన్న అభియోగాలపై ప్రముఖ సామాజిక కార్యకర్త, రచయిత్రి అరుంధతీరాయ్ను ప్రాసిక్యూట్ చేసేందుకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా శుక్రవారం అనుమతి తెలిపారని ఢిల్లీ రాజ్భవన్ వర్గాలు పేర్కొన్నాయి.
న్యూఢిల్లీ : 2010లో జరిగిన ఒక కార్యక్రమంలో రెచ్చగొట్టే ఉపన్యాసాలు చేశారన్న అభియోగాలపై ప్రముఖ సామాజిక కార్యకర్త, రచయిత్రి అరుంధతీరాయ్ను ప్రాసిక్యూట్ చేసేందుకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా శుక్రవారం అనుమతి తెలిపారని ఢిల్లీ రాజ్భవన్ వర్గాలు పేర్కొన్నాయి. 2010 అక్టోబర్ 21న ‘ఆజాదీ.. ఉన్న ఒకే ఒక్క మార్గం’ పేరుతో రాజకీయ ఖైదీల విడుదల కోసం ఏర్పాటు అయిన కమిటీ ఒక సమావేశాన్ని నిర్వహించింది. బుకర్ ప్రైజ్ అవార్డు గ్రహీత అయిన అరుంధతీరాయ్ ఈ కార్యక్రమంలో వక్తగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో రెచ్చగొట్టే ఉపన్యాసాలు చేశారని అరుంధతీరాయ్తోపాటు ఇతర ఉపన్యాసకులపై ఎఫ్ఐఆర్ నమోదైంది.
భారతదేశంలో చట్ట విరుద్ధమైన కార్యకలాపాలను నిరోధించే లక్ష్యం పేరుతో అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ (యూఏపీఏ)ను తీసుకొచ్చారు. ఇప్పటి వరకూ ఉన్న అన్ని చట్టాల్లోకెల్లా అత్యంత కఠిన నిబంధనలు ఉన్న చట్టం ఇదేనన్న విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వం తనకు వ్యతిరేకంగా గళమెత్తినవారిని సైతం ఇదే చట్టం కింద అరెస్టు చేస్తుండటంపై హక్కుల ఉద్యమకారులు తీవ్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీన్ని రద్దు చేయాలనే డిమాండ్లు బలంగా ఉన్నాయి