వయోవృద్ధులకు ఉచితంగా రూ.5 లక్షల ఆరోగ్య బీమా – ఎలా అప్లై చేయాలి? ఏ పత్రాలు కావాలి?
వయోజనులందరికి రూ.5 లక్షల ఉచిత ఆరోగ్య బీమా అందించే ఆయుష్మాన్ భారత్ పథకం – ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన (AB- PMJAY) అక్టోబర్ 29నుండి అమల్లోకి వచ్చింది, ఎలా అప్లై చేయాలి? ఏ పత్రాలు కావాలి?

దేశంలో 70 ఏళ్లు పైబడిన వయోజనులందరికి రూ.5 లక్షల ఉచిత ఆరోగ్య బీమా అందించే ఆయుష్మాన్ భారత్ పథకం – ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన (AB- PMJAY) అక్టోబర్ 29నుండి అమల్లోకి వచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ పథకాన్ని లాంఛనంగా విస్తరించారు. ఈ పథకం కింద డెబ్భైఏళ్లు దాటిన వృద్ధులకు వారి ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా రూ.5 లక్షల ఆరోగ్య బీమా లభిస్తుంది. ఇంతకీ ఈ పథకానికి ఎలా అప్లయి చేయాలి? ఏమేం పత్రాలు కావాలి? ఫిర్యాదులు ఉంటే ఎలా?
ఎవరు అర్హులు..?
AB- PMJAY : భారత్లో నివాసం ఉంటున్న 70 ఏళ్లు పైబడిన వృద్ధులందరూ ఈ పథకం కింద అర్హులే. అన్ని సామాజిక, ఆర్థిక వర్గాలకు చెందిన వృద్ధులకు ఈ పథకం(Ayushman Bharat Pradhan Mantri Jan Arogya Yojana) కింద వైద్యబీమా లభిస్తుంది. ఇప్పటికే ఆయుష్మాన్భారత్ పరిధిలో ఉన్న వృద్ధుల(Senior Cirizens)కు ఇప్పుడు రూ.5 లక్షల(5 Lakhs) అదనపు కవరేజీ లభిస్తుంది. ఇది భారత్లోని దిగువ 40శాతం ప్రజల కోసం ఉద్దేశించింది. ఇందులో ఉచితంగా ఆసుపత్రుల్లో చేర్చుకోవడం, వైద్య పరీక్షలు తదితర సేవలు పొందొచ్చు. మందులు, వసతి, పోషకాహారం వంటి సేవలు లభిస్తాయి. పథకంలో చేరిన వారికి ఆయుష్మాన్ వయా వందన కార్డ్ (Ayushman Vaya Vandana card) లభిస్తుంది.
ఈ కార్డ్ ఎలా పొందాలి? అర్హత ఏమిటి? ఏమేం పత్రాలు కావాలి?
కావాల్సిన అర్హతలు(Eligibility):
- భారత పౌరులై ఉండాలి.
- వయస్సు 70 ఏళ్లుండాలి
- ఆదాయంలో ఎటువంటి సంబంధం లేదు. ఎవరైనా చేరొచ్చు
కావాల్సిన ధృవపత్రాలు(Documents needed):
- ఆధార్ కార్డు
- మొబైల్ నంబర్ (ఆధార్తో అనుసంధానమైనది)
- ఈమెయిల్ ఐడీ
- వయో నిర్ధారణ పత్రం
- కెవైసీ
ఎలా అప్లయి చేయాలి?( How to apply):
ఇందులో చేరాల్సిన వారు ఆయుష్మాన్ భారత్ వెబ్సైట్ లేదా ఆయుష్మాన్ యాప్ ద్వారా చేరొచ్చు. ముందు www.beneficiary.nha.gov.in వెబ్సైట్లోకి వెళ్లి క్యాప్చా, మొబైల్ నంబర్, ఓటీపీ ఎంటర్ చేయాలి. తర్వాత మీ రాష్ట్రం ఎంచుకున్నాక అక్కడ వివరాలు కనిపిస్తాయి. ఒకవేళ ఇప్పటివరకు కేవైసీ చేయకపోతే, ఆధార్ ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలి. ఒకవేళ ఇదివరకే కేవైసీ పూర్తయ్యి ఉంటే.. నేరుగా ‘ఆయుష్మాన్ వయ వందన’ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు. వృద్ధుల తరఫున వారి కుటుంబ సభ్యులు సైతం వెబ్సైట్ లేదా మొబైల్ యాప్లో అప్లై చేయొచ్చు. లేదా ఎంప్యానెల్డ్ ఆస్పత్రికి వెళ్లి కూడా నమోదు చేయించుకోవచ్చు.
నెట్వర్క్ ఆస్పత్రుల జాబితా ఎలా తెలుసుకోవాలి?(Finding network Hospitals):
ఆయుష్మాన్ భారత్ పథకం కింద సుమారు 29 వేల ఆస్పత్రులు దేశవ్యాప్తంగా నమోదై ఉన్నాయి. ఇందులో కొన్ని కార్పొరేట్ ఆస్పత్రులు కూడా ఉన్నాయి. ఎంప్యానెల్డ్ ఆస్పత్రుల జాబితా dashboard.pmjay.gov.in వెబ్సైట్లో లభిస్తుంది. అక్కడ మీ రాష్ట్రం, జిల్లా ఎంచుకుంటే ఆస్పత్రుల వివరాలు కనిపిస్తాయి. అయితే ఇక్కడో మెలిక ఉంది. ఆయుష్మాన్ భారత్ నెట్వర్క్లో లేని ఆసుపత్రులలో చికిత్స చేయించుకుంటే ఈ పథకం వర్తించదు. అన్ని వైద్య ఖర్చులు పేషెంటే భరించాల్సివుంటుంది.
ఫిర్యాదులు ఉంటే ఎలా?(If complaints):
ఈ పథకం కింద 70 ఏళ్లు వయసు దాటిన వారికి ఆస్పత్రులు నగదు రహిత చికిత్స అందించాలని కేంద్రం సూచించింది. చికిత్స విషయంలో గానీ, ఇతర విషయాల్లోగానీ ఫిర్యాదులు ఉంటే, పైన పేర్కొన్న వెబ్సైట్, యాప్లో గానీ లేదా నేషనల్ కాల్ సెంటర్ 14555ను సంప్రదించొచ్చు. గంటల వ్యవధిలోనే మీ సమస్యను పరిష్కారం లభిస్తుంది.
ఇతర హెల్త్స్కీముల్లో ఉన్న వారి పరిస్థితి?(If in other Schemes):
సీజీహెచ్ఎస్(CGHS), ఎక్స్సర్వీస్మెన్ కంట్రిబ్యూటరీ హెల్త్స్కీం(ECHS), ఆయుష్మాన్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ (CAPF)పథకాల కింద ఉన్న వృద్ధులు, వాటిని గానీ, ఏబీపీఎంజేఏవైని (AB-PMJAY) గానీ ఏదో ఒకటి ఎంచుకోవచ్చు. ప్రైవేటు వైద్య ఆరోగ్య బీమా(Private health Insurance), ఈఎస్ఐ కింద ప్రయోజనం పొందుతున్నవారు మాత్రం ఈ రూ.5 లక్షల ప్రయోజనం పొందొచ్చు.