Delhi Liquor Case | కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ విచారణ సెప్టెంబర్ 5కు వాయిదా
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ సీబీఐ అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ, బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ల విచారణను సుప్రీంకోర్టు సెప్టెంబర్ 5కు వాయిదా వేసింది.

సీబీఐ విచారణకు ప్రత్యేక కోర్టు అనుమతి
Delhi liquor Case | ఢిల్లీ మద్యం పాలసీ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ (CM Arvind Kejriwal) సీబీఐ అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ, బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ల విచారణను సుప్రీంకోర్టు (Supreme Court) సెప్టెంబర్ 5కు వాయిదా వేసింది. మరోవైపు ఈ కేసులో కేజ్రీవాల్ను విచారించేందుకు అనుమతి లభించినట్లు కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ వెల్లడించింది. ఇదే కేసుకు సంబంధించి నమోదైన అవినీతి కేసులో ఆప్ ఎమ్మెల్యే దుర్గేశ్ పాఠక్ను విచారించనున్నట్లు తెలిపింది.
ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు (Rouse Avenue Court) ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ భావేజాకు సీబీఐ (CBI) ఈ విషయాన్ని వెల్లడించింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్ను జూన్ 26న సీబీఐ అరెస్టు చేసింది. ఆయన జ్యుడీషియల్ కస్టడీ ఆగస్టు 27న ముగియనుంది. ఇదే సమయంలో కేజ్రీవాల్, పాఠక్లను ప్రశ్నించేందుకు అవసరమైన అనుమతుల కోసం 15 రోజుల సమయం ఇస్తున్నట్లు ఆగస్టు 12న న్యాయస్థానం పేర్కొంది. ఈ క్రమంలోనే సీఎం కేజ్రీవాల్ను ప్రశ్నించేందుకు అనుమతి పొందినట్లు సీబీఐ పేర్కొంది