USA Accident: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ వాసులు మృతి

USA Accident:
విధాత : అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలంగాణ వాసులు దుర్మరణం చెందారు. అమెరికాలోని ఫ్లోరిడాలో కారు ప్రమాదంలో షాద్ నగర్ నియోజకవర్గం కొందుర్గు మండలం టేకులపల్లి గ్రామానికి చెందిన ప్రగతి రెడ్డి (35), పెద్ద కుమారుడు హార్వీన్ (6), అత్త సునీత (56)మృతి చెందారు.
ప్రమాదం సమయంలో కారులో ఉన్న ప్రగతి రెడ్డి భర్త రోహిత్ రెడ్డి, చిన్న కుమారుడికి గాయాలయ్యాయి. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందటంతో స్వగ్రామం టేకులపల్లిలో విషాధ చాయలు అలుముకున్నాయి. రోహిత్ రెడ్డి కుటుంబం ప్రయాణిస్తున్న కారును ట్రక్కును ఢీ కొనడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది.
కేటీఆర్ సంతాపం
అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో రంగారెడ్డి జిల్లా టేకులపల్లికి చెందిన మాజీ ఎంపీటీసీ మోహన్ రెడ్డి, మాజీ సర్పంచ్ పవిత్రాదేవిల రెండో కుమార్తె ప్రగతిరెడ్డి, ఆమె కుమారుడు అర్విన్, ప్రగతి రెడ్డి అత్త సునీత లు మృతిచెందడం ఎంతో బాధాకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతిని తెలియజేస్తున్నానన్నారు. గాయపడిన రోహిత్ రెడ్డి, ఆయన చిన్న కుమారుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు.