Anant Ambani: కాలినడకన.. ద్వారకకు అనంత్ అంబానీ!

Anant Ambani:
విధాత: బిలియనీర్, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముఖేశ్ అంబానీ కుమారుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ డైరెక్టర్ అనంత్ అంబానీ (AnantAmbani) గుజరాత్లోని జామ్నగర్ నుంచి ద్వారక (Dwarka) కు కాలినడకన బయలుదేరారు. ఈ రెండు నగరాల మధ్య దూరం 140 కిలోమీటర్లు. అనంత్ నిత్యం 12కిలోమీటర్లకు పైగా నడుస్తున్నట్లు తెలుస్తోంది. తన వల్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడొద్దనే ఉద్దేశంతో భారీ సెక్యూరిటీ మధ్య రాత్రివేళ నడక సాగిస్తున్నారు. ఏప్రిల్ 10న తన 30వ పుట్టినరోజు నాటికి అనంత్ ద్వారకకు చేరుకొని ప్రత్యేక పూజలు చేయనున్నారు.
అనంత్ అంబానీ ద్వారక పాదయాత్ర వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పాదయాత్రలో అనంత్ అంబానీ వెంట స్నేహితులు, బ్రాహ్మణులు, భక్తులు కూడా ద్వారకకు పాదయాత్రలో కొనసాగుతున్నారు. జై ద్వారకాధీష్ నినాదాలు, భజనలతో పాదయాత్ర భజన సంకీర్తనలతో ఉత్సాహంగా సాగుతోంది. తన భద్రతా బృందం, సహచరులతో కూడిన భారీ కాన్వాయ్ తో రాత్రిపూట అనంత్ అంబానీ పాదయాత్ర కొనసాగిస్తున్నారు. మార్గమధ్యలో ప్రజలు అనంత్ అంబానీని చూసేందుకు భారీగా తరలివస్తూ ఫోటోలు దిగుతున్నారు.
29 ఏళ్ల అనంత్ అంబానీ 2022 సెప్టెంబర్ నుంచి రిలయన్స్ ఫౌండేషన్ బోర్డులో కూడా పనిచేస్తున్నారు. ఇక గతేడాది జూలై 12న మహారాష్ట్రలోని ముంబయిలో రాధిక మర్చంట్ను వివాహం చేసుకుని ఓ ఇంటివాడైన విషయం తెలిసిందే. అనంత్ అంబానీ కుటుంబం ఆధ్యాత్మిక అంశాలపై విశ్వాసం ఎక్కువ. వారు క్రమం తప్పకుండా ద్వారక, సోమనాథ్, తిరుమల ఆలయాలను సందర్శిస్తుంటారు. ఇటీవల మహా కుంభమేళాలోనూ పవిత్ర స్నానం ఆచరించారు. అనంత్ అంబానీ ఇటీవల వంటారా వన్యప్రాణుల సంరక్షణ, పునరావస కేంద్రాన్ని ప్రారంభించి జంతు సంక్షేమం పట్ల తన చిత్తశుద్ధిని చాటుకున్నారు.
తన ద్వారక పాదయాత్రపై అనంత్ అంబానీ మీడియాతో మాట్లాడారు. జామ్నగర్లోని తమ ఇంటి నుంచి మార్చి 27న మధ్యాహ్నం 3గంటలకు జై ద్వారకాధీశ్ నినాదాల మధ్య ప్రారంభమైన ద్వారక పాదయాత్ర గత ఐదు రోజులుగా కొనసాగుతోందని అనంత్ అంబానీ తెలిపారు. మరో నాలుగు రోజుల్లో ద్వారకకు చేరుకుంటామన్నారు. ద్వారకాధీశుడి ఆశీర్వాదం కోసం ఈ పాదయాత్ర చేస్తున్నట్లు తెలిపారు. యువత ద్వారకాధీశుడిపై విశ్వాసం ఉంచాలన్నారు. ఏదైనా పని చేసే ముందు ద్వారకాధీశుడిని స్మరించుకోవాలని చెప్పారు. అప్పుడు ఆ పని కచ్చితంగా ఎటువంటి అడ్డంకులు లేకుండా పూర్తవుతుందని తెలిపారు. దేవుడు ఉన్నప్పుడు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అనంత్ అంబానీ తెలిపారు.