KTR | మేడిగడ్డపై యాగీ.. జూరాల, మంజీరా సంగతేంటి? : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

  • By: TAAZ    news    Jun 27, 2025 4:27 PM IST
KTR | మేడిగడ్డపై యాగీ.. జూరాల, మంజీరా సంగతేంటి? : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

KTR | మేడిగడ్డ బ్యారేజీలోని రెండు పియర్స్ కు వచ్చిన పగుళ్లపై నానాయాగీ చేసిన కాంగ్రెస్.. బీజేపీ నేతలు మంజీరా బ్యారేజీ పిల్లర్లకు వచ్చిన పగుళ్లపై కనీసం స్పందించకపోవడం వారి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని ఎక్స్ వేదికగా విమర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బ్యారేజీల సామర్థ్యానికి మించి వరద వచ్చిన సందర్భాల్లో ఆ ఒత్తిడిని తట్టుకోలేకే పిల్లర్లకు పగుళ్లు వచ్చినట్టు ఎస్డీఎస్ వో గుర్తించిందని.. సరిగ్గా మేడిగడ్డ వద్ద కూడా ఊహించని వరద పోటెత్తడం వల్ల అక్కడ కూడా మంజీరా బ్యారేజీ తరహాలో పగుళ్లు ఏర్పడ్డాయన్నారు. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కై దీన్ని అసెంబ్లీ ఎన్నికల వేళ భూతద్దంలో చూపించి బీఆర్ఎస్ పై బురదజల్లాయని కేటీఆర్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ సర్కారు చేతకాని తనంతో నిన్న జూరాల ప్రాజెక్టు డేంజర్ లోకి వెళ్లిన సంఘటనకు 24 గంటలు గడవకముందే హైదరాబాద్ జంటనగరాలకు మంచినీరు అందించే మంజీరా బ్యారేజీని కూడా ప్రమాదంలో పడేయడం అత్యంత ఆందోళనకరమన్నారు.

ప్రభుత్వం వైఫల్యాలతోనే ప్రాజెక్టులకు డేంజర్ బెల్స్

సాగు, తాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ, పర్యవేక్షణలో సీఎం రేవంత్ ఘోర వైఫల్యం వల్లే వరుసగా జూరాల, మంజీరా బ్యారేజీకి డేంజర్ బెల్స్ మోగుతున్నాయని విమర్శించారు. స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ (ఎస్డీఎస్ వో) నిపుణుల బృందం గత మార్చి 22న బ్యారేజీని సందర్శించి సమర్పించిన నివేదికను ప్రభుత్వం నిర్లక్ష్యంగా పక్కనపెట్టడం క్షమించరాని నేరమని ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్. మేడిగడ్డ బ్యారేజీ వద్ద కూడా చరిత్రలో లేనంత వరద రావడంతో రెండు పిల్లర్లకు పగుళ్లు వచ్చిన తరహాలోనే, ఇప్పుడు మంజీరాపై కూడా వరద ఒత్తిడి పెరిగి దిగువ భాగంలో పిల్లర్లకు పగుళ్లు రావడం, ఆఫ్రాన్ కొట్టుకుపోయాయని, స్పెల్ వే లోని భాగాలు కూడా దెబ్బతిన్నట్టు ఎస్డీఎస్ వో నివేదిక గుర్తించినా సీఎం మొద్దునిద్ర వీడకపోవడం మరో దుర్మార్గమన్నారు. నిన్నటిదాకా ఎన్డీఎస్ఎ నివేదిక చెప్పినా మేడిగడ్డ బ్యారేజీని రిపేర్ చేయకపోవడం, నేడు ఎస్డీఎస్ వో నివేదిక అందినప్పటికీ మంజీరా బ్యారేజీ మరమ్మత్తులు చేపట్టకపోవడం.. ఈ కాంగ్రెస్ సర్కారు అలసత్వానికే కాదు.. దుర్మార్గపు వైఖరికి ప్రత్యక్ష నిదర్శనమని దుయ్యబట్టారు.

బ్యారేజీలపై రాజకీయాలు వద్దు

రానున్న రోజుల్లో మంజీరాలో వరద ఉధృతి పెరిగితే మరింత కోతకు గురై చివరికి డ్యామ్ ను కూడా ప్రమాదంలోకి నెట్టే పరిస్థితి తలెత్తవచ్చని నిపుణులు అంచనా వేస్తున్న క్రమంలో ఇకనైనా ఈ చిల్లర రాజకీయాలు మానాలని సూచించారు. అటు మేడిగడ్డ బ్యారేజీని, ఇటు మంజీరా బ్యారేజీని వెంటనే రిపేర్ చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై, కాంగ్రెస్ సర్కారుపై ఉందన్నారు. గత ప్రభుత్వాలు నిర్మించిన ప్రాజెక్టులు, బ్యారేజీల్లో స్వల్ప రిపేర్లు వస్తే, అప్పటికప్పుడు వాటిని మరమ్మతు చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారే తప్పా కాళేశ్వరంపై కక్షగట్టినట్టు ఏ ప్రభుత్వాలు గతంలో వ్యవహరించలేదని మండిపడ్డారు. పరిపాలన చేతకాక కేవలం రాజకీయ కక్షసాధింపులతో కాలం వెల్లదీస్తున్న ఈ ముఖ్యమంత్రి మంజీరా, మేడిగడ్డ వంటి తాగు సాగునీటి బ్యారేజీలను రిపేర్లు చేయకుండా వదిలేస్తే, సీఎం రేవంత్ ను, కాంగ్రెస్ సర్కారును చరిత్ర ఎప్పటికీ క్షమించదని స్పష్టం చేశారు కేటీఆర్.